ఒకరిద్దరు వైద్యులు తప్పుచేస్తే దీన్ని వైద్యులందరికీ ఆపాదించి 600 మంది వైద్యులకు నోటీసులు ఇవ్వడం, ఇంక్రిమెంట్లు కోత వేస్తానని చెప్పడం...
ఏపీ ప్రభుత్వంపై మండిపడిన వైద్యుల సంఘం
సాక్షి, హైదరాబాద్: ఒకరిద్దరు వైద్యులు తప్పుచేస్తే దీన్ని వైద్యులందరికీ ఆపాదించి 600 మంది వైద్యులకు నోటీసులు ఇవ్వడం, ఇంక్రిమెంట్లు కోత వేస్తానని చెప్పడం సరైంది కాదని వైద్యుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అడ్హక్ కమిటీ కన్వీనర్లు డా.విజయేంద్రబాబు, డా.బాబ్జీ శ్యామ్కుమార్, డా.మునీశ్వర్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేసిన వైద్యులను శిక్షించడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రస్తుతం నోటీసులు అందుకున్న చాలామంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన వేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేసిన వైద్యులకు నోటీసులు ఇచ్చి ఇంక్రిమెంట్లు కోత వేయడం బాధ కలిగిస్తోందన్నారు. వైద్యులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.