
నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత
► కలుషితాహారం తిని వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 21 మంది
► రిమ్స్ నర్సింగ్ హాస్టల్లో పర్యవేక్షణ లోపం
► ఆహార కాంట్రాక్టర్కు మెమో జారీ
ఒంగోలు సెంట్రల్: రిమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దాదాపు 180 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రిమ్స్లోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనే ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే హాస్టల్లో ఉన్న విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో ఉదయం 6 గంటల సమయంలో ఈ విషయాన్ని రిమ్స్ అధికారులకు తెలిపారు. అనంతరం ఐదుగురు విద్యార్థినులు రిమ్స్ క్యాజువాలిటీ అత్యవసర చికిత్స విభాగంలో తీవ్ర కడుపునొప్పితో చేరారు.
అనంతరం మరో ఐదుగురు తీవ్ర వాంతులతో, ఇంకో 11 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం చేరారు. మధ్యాహ్నానికి పలువురు విద్యార్థినులు కోలుకున్నారు. మిగిలిన వారిలో మూడో సంవత్సరం నర్సింగ్ విద్యార్థినులు లావణ్య, హర్షితల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించారు. వీరికి బీపీ చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్స అందించారు. మరో 24 గంటలు పరిశీలనలో ఉంచారు.
విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు దగ్గర ప్రాంతాల వారు హుటాహుటిన రిమ్స్కు చేరుకుని, తమ పిల్లల పరిస్థితి వాకబు చేసి ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినులకు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టర్ ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. గురువారం రాత్రి దోసకాయ కూరతో కూడిన అన్నాన్ని విద్యార్థినులకు పెట్టారని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.వల్లీశ్వరి తెలిపారు. ఆహారంలోనో, పాత్రల్లోనూ కలుషితమై విషపూరితమైనట్లు చెప్పారు.
కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రిమ్స్ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబులు రిమ్స్కు చేరుకుని పరామర్శించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్కుమార్, డాక్టర్ ఎం.వెంకయ్య, డాక్టర్ హనుమానాయక్, నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలు అందించారు.
వసతి గృహంపై కొరవడిన పర్యవేక్షణ:
రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆహార కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అనేక సార్లు ఆహారం బాగాలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదు. ఈమధ్యే వైద్య కళాశాల విద్యార్థినులు తమకు కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని, అధిక ధరలు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కలెక్టర్కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇది జరుగుతుండగానే నర్సింగ్ కళాశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై విషాహారంగా మారింది. ఆహారం విద్యార్థినులు గానీ, రోగులు గానీ తినే ముందు ఆర్ఎంఓ, డైటీషియన్లు తప్పని సరిగా రుచి చూడాలి. బాగుంది అంటేనే విద్యార్థులకు గానీ, రోగులకు గానీ వడ్డించాలి. అయితే ఈ నిబంధన అమలు కావడం లేదు. ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడుతున్న అధికారులు నాసిరకం భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారు.
ఆహార కాంట్రాక్టర్కు మెమో:
రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ లక్ష్మీ నారాయణకు ప్రాథమికంగా మెమో జారీ చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆహార శాంపిల్ను నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. పూర్తి నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.