కథ అడ్డం తిరిగింది! | Opposition to the mobilization of farmers on airport land | Sakshi
Sakshi News home page

కథ అడ్డం తిరిగింది!

Published Mon, Feb 29 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

కథ అడ్డం తిరిగింది!

కథ అడ్డం తిరిగింది!

భూములివ్వం
విమానాశ్రయ భూసమీకరణపై రైతుల వ్యతిరేకత
మొదటి విడతకూ అంగీకరించబోమని వెల్లడి
రాజధాని ప్రాంతంలో కేటాయింపుపై అనుమానాలు

 
విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూములు సమీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రైతులు తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వబోమని అధికారులకు తెగేసి చెప్పారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆదివారం అవగాహన సదస్సుల పేరిట గన్నవరం మండలం బుద్దవరం, అజ్జంపూడి, చినఅవుటపల్లి గ్రామాల్లో పర్యటించారు. భూ సమీకరణకు అంగీకరించిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు పథకం రచించారు. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించి ఫారం-3 ఇస్తే రాజధాని ప్రాంతం ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం తరఫున అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులు మొదటి విడత 750 ఎకరాల భూసమీకరణకు కూడా సహకరించేది లేదని స్పష్టం చేశారు. తమ భూములు ఇవ్వబోమంటూ ఫారం-2 దరఖాస్తులను అధికారులకు అందించారు. మొదటి విడత భూసమీకరణకు ఆరు మాసాల కిందట కలెక్టర్‌తో  జరిపిన చర్చల్లో సగం మంది రైతులు అంగీకరించారు.
 
ఫారం-2 దరఖాస్తులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రైతులు...
తాజాగా ఏలూరు కాల్వ మళ్లింపునకు మరో 450 ఎకరాలు జక్కులనెక్కలం, సావరగూడెం, కేసరపల్లి, గన్నవరం, మర్లపాలెం, చిన అవుటపల్లి, పెదఅవుటపల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో సోమవారం అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి ల్యాండ్‌పూలింగ్‌కు భూములు ఇచ్చే వారి నుంచి ఫారం-3 దరఖాస్తులు స్వీకరించేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో ఏలూరు కాల్వ మళ్లింపునకు కూడా భూములు ఇచ్చేది లేదని రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫారం-2ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ల్యాండ్ పూలింగ్‌ను తాము నమ్మబోమని రైతులు అధికారులకు తెగేసి చెబుతున్నారు. ఎన్నాళ్లకు తమకు రాజధాని ప్రాంతంలో ల్యాండ్‌పూలింగ్‌లో స్థలం కేటాయిస్తారో నమ్మకం లేదని నిర్వాసితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భూములు తీసుకున్నాక రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించటంలో ఆలస్యమైతే తమ గతేమిటని ఆదివారం నాటి సదస్సుల్లో అధికారులను ప్రశ్నించారు. నూజివీడు సబ్ కలెక్టర్,  గన్నవరం తహసీల్దార్, ఇతర అధికారులు రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను సర్దుబాటు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పించేందుకు విఫలయత్నాలు చేశారు. రెండో విడత భూసమీకరణలో ఏలూరు కాల్వను మళ్లించబోమని, ఎయిర్‌పోర్టుకు ఆ భూములు అవసరమని అధికారులు వివరించారు. అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినా రైతులు మాత్రం ససేమిరా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement