పయ్యావుల అనుచరుల దౌర్జన్యకాండ | Sakshi
Sakshi News home page

పయ్యావుల అనుచరుల దౌర్జన్యకాండ

Published Thu, Oct 10 2019 7:57 AM

Payyavula Keshav Followers Violence In Anantapur  - Sakshi

సాక్షి, ఉరవకొండ : కౌకుంట్ల పంచాయతీ విభజనను జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు తమ అనుచరుల ద్వారా కౌకుంట్ల పంచాయతీలో దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. వారం రోజుల క్రితం వడ్డే వెంకటేష్, గంగమ్మ కుటుంబంపై దాడి ఘటన మరకముందే మైలారంపల్లిలో తాము పంచే చీరలు తీసుకొనందుకు దంపతులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. బాధితులు అల్లాబకష్, ఇమాంబీ కథనం మేరకు.. పది రోజుల క్రితం జరిగిన పంచాయతీ విభజన గ్రామసభలో ప్రజలను ప్రలోభ పెట్టడానికి పెద్దఎత్తున పంపిణీ చేయడానికి చీరలు తీసుకొచ్చారు.

అయితే కొన్ని గ్రామాల్లో  చీరల పంపిణీ వాయిదా పడటంతో వాటిని మంగళవారం రాత్రి పంపణీ చేశారు. అయితే అల్లాబకష్‌ దంపతులు వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. దీన్ని జీర్ణించుకోలేని పయ్యావుల ప్రధాన అనుచరులు వెంకటరమణప్ప, సాయిరాజు, ప్రణయ్, శ్రీకాంత్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ఇమాంబి చీర, జాకెటు చింపి ఆమెను తీవ్రంగా అవమానపరిచారు. గ్రామస్తులు బాధితులను హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు. 

వారి దౌర్జన్యకాండను ఇక సహించం  
పయ్యావుల కేశవ్‌ ఆయన సోదరుడు పయ్యావు ల శ్రీనివాసుల దౌర్జన్యకాండను ఇక సహించ బోమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.మధు సూధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చిన్నకౌకుంట్ల, విడపనకల్లు మండలం కరకముక్కల, పాల్తూరు గ్రామాల్లో పయ్యావుల అనుచరులు వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేశారన్నారు. గ్రామాల్లో తమ అధిపత్యం చెలాయించడం కోసం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే తాము చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.   

Advertisement
Advertisement