
ప్రశాంతంగా డీ సెట్
అనంతపురం ఎడ్యుకేషన్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (డీసెట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. జిల్లాలో 18,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 17,127 మంది హాజరయ్యారు. మొత్తం 18,108 మంది తెలుగు మీడియం అభ్యర్థులకు గాను 16,795 మంది హాజరయ్యారు. ఉర్దూ మీడియానికి సంబంధించి 344 మందికి గాను 328 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్రావు ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన అబ్జర్వర్ వనజాక్షి, పరీక్షల విభాగం అసిస్టెంటు కమిషనరు గోవిందునాయక్ వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా, అనంతపురం నగరంలోని 62వ పరీక్ష కేంద్రంలో ఫొటో మార్పుతో ఓ అభ్యర్థి ఇబ్బంది పడ్డాడు. నామినల్ రోల్లో తన ఫొటో బదులుగా మరో వ్యక్తి ఫోటో ఉండటంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. హాల్టికెట్లో కరెక్టుగా ఉన్నా..ఎన్ఆర్లో మారడంతో అధికారులు అభ్యర్థి ఫొటోను అతికించి అనుమతించారు. 25వ కేంద్రంలో ఓ అభ్యర్థికి ఉర్దూ మీడియం బదులుగా తెలుగు మీడియం ప్రశ్నపత్రం వచ్చింది. సదరు అభ్యర్థి దరఖాస్తు చేసుకునే సమయంలోనే పొరబాటు చేసినట్లు అధికారులు తేల్చారు. డీఈఓ అనుమతితో సదరు అభ్యర్థికి ఉర్దూ మీడియం బఫర్ ఓఎంఆర్ ఇచ్చి పరీక్ష రాయించారు.