యూరియా కోసం రాస్తారోకో | Poison for urea | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రాస్తారోకో

Jan 27 2015 1:05 AM | Updated on Sep 18 2018 7:34 PM

యూరియా కోసం రాస్తారోకో - Sakshi

యూరియా కోసం రాస్తారోకో

తెనాలిలో రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా అందడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

తెనాలి టౌన్ : తెనాలిలో రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా అందడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. గుంటూరు-తెనాలి రహదారిపై రాస్తారోకో చేశారు. రబీలో మొక్కజొన్న, తెల్లజొన్న పైర్లకు అవసరమైన యూరియా కోసం సోమవారం తెనాలి మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులు ఒక్కసారిగా రాస్తారోకోకు దిగారు. ఈ కారణంగా రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
 
ఇదిలావుంటే, మార్కెట్ కమిటీ ఆవరణలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి సందర్శించారు. యూరియా కొరతపై వ్యవసాయాధికారులను మంత్రి నిలదీశారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలికి ఒక ర్యాక్ యూరియా సోమవారం తెప్పిస్తున్నామని, నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రి చెప్పినట్టు సోమవారం ఒక బస్తా యూరియా కూడా మార్కెట్‌యార్డుకు రాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులంతా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.

పరిస్థితిని తెలుసుకున్న వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి, మండలపరిషత్ అధ్యక్షుడు సూర్యదేవర వెంకట్రావులు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం జ్యోతిరమణి విలేకరులతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఠా కూలీలు రాకపోవడం వల్ల యూరియా రాలేదని చెప్పారు.

120 టన్నుల ఎలాంట్‌మెంట్  ఉందని, 40 టన్నులు తెనాలిలో విక్రయ కేంద్రానికి, మిగిలిన 80 టన్నుల యూరియాను  గ్రామాల్లో సొసైటీలకు పంపనున్నట్టు చెప్పారు. మంగళవారం ఉదయానికి యూరియా వస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యార్డులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి సరఫరా చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డీడీఏ వెంకటేశ్వరరావు, వ్యవసాయాధికారి కె.అమలకుమారి కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement