
ఆ సమయంలో నిషిత్ కారు 242 కి.మీ వేగంలో
హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఘోర కారు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని, దాని వల్లే నిషిత్ ప్రాణాలుకోల్పోయాడని చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో నిషిత్ కారు గంటకు 242 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో రెండు పిల్లర్ల మధ్య ఉన్న దూరం 75 మీటర్లను నిషిత్ కారు 0.5 మైక్రో సెకన్లలో దాటిందని చెప్పారు. సాధారణంగా సీసీ కెమెరాల్లో సెకనుకు 4 ఫ్రేమ్స్ మాత్రమే రికార్డవుతాయని, కానీ, నిషిత్ కారు మాత్రం 24 ఫ్రేముల్లో రికార్డయిందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు అరవింద్ ఘోర బెంజ్ కారు ప్రమాదానికి గురై మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు శోధించే క్రమంలో జర్మనీ బెంజ్ ప్రతినిధులను సైతం పిలిపించి విచారణ చేయించిన పోలీసులు వారి నుంచి నివేదిక కూడా తీసుకున్నారు. నిషిత్ అతడి స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లో వేగంగా వెళుతూ నేరుగా మెట్రోపిల్లర్ 36కు ఢీకొట్టిన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.