జాతీయ రహదారిపై ప్రమాదం | Road accident in National Highway | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ప్రమాదం

Published Sun, Jul 15 2018 10:34 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road accident in National Highway - Sakshi

గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దావులూరి సుధాకరబాబు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య చేబ్రోలు శైలజ (40) తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటుగా మరికొందరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు శైలజ డోకిపర్రులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె తన భర్త దావులూరి సుధాకర్‌బాబుతో కలిసి ద్విచక్ర వాహనంపై శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరారు. వీరి ముందు ఓ వ్యాన్‌ ప్రయాణికులతో విజయవాడ వైపునకు వెళుతోంది. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపునకు అతివేగంగా వస్తున్న కారు గూడూరు సమీపంలోకి రాగానే అదుపు తప్పింది.  

వ్యాన్‌ను ఒక పక్కగా ఢీకొంటూ వచ్చి దాని వెనుక నుంచి వస్తున్న స్కూటీని కూడా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న దావులూరి సుధాకర్‌బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న శైలజ గాలిలో ఎగిరి పక్కన ఉన్న కాలువలో పడి అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయింది. బాధితురాలిని స్థానికులు బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ద్విచక్ర వాహనం కంటే ముందుగా వ్యాన్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు బందరు మండలం సుల్తానగరానికి చెందిన మట్టా అంజమ్మ (56), సత్రంపాలెంకు చెందిన కోరశిక నాంచారయ్య (19), బందరుకోటకు చెందిన బచ్చుల వెంకన్న (45), Ðపోలాటిదిబ్బకు చెందిన మొకా చంద్రరావు (36), గూడూరు మండలం ఆకుమర్రులాకుకు చెందిన పేరే పుష్పలీల (40)గాయపడ్డారు. వీరందరికీ గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేశారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు మాత్రం కారును అక్కడే వదిలి పరారయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement