
రూ.32.81 కోట్ల పంట నష్టం
కడప అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. కరువు పరిస్థితులపై రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కరువు పరిస్థితులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం డిసెంబరు నెల15వ తేదీ రాత్రి జిల్లాలో 48 మండలాలను కరువు బారిన పడినట్లు ప్రకటించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కరువులో దెబ్బతిన్న పంటల తుది జాబితా తయారీకి సిద్ధమైంది.
డిసెంబరు నెల 23 నుంచి 31వ తేదీ వరకు నివేదిక తయారు చేసేందుకు ఏఓ, ఏఇఓలు, గ్రామ రెవిన్యూ అధికారుల బృందాలు పంటలను సందర్శించి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీ సంబందింత అధికారులను ఆదేశించారు. దీంతో యంత్రాంగం క్షేత్రస్థాయిలో 20 మండలాల్లో ఎలాంటి నష్టంలేదని, మిగతా 28 మండలాల్లో తొమ్మిది రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంగళవారం క్షేత్రస్థాయి యంత్రాంగం తుది జాబితాను జిల్లా వ్యవసాయశాఖ ఇన్చార్జ్ జేడీకి సమర్పించింది.
ఆ నివేదికను కలెక్టర్కు ఇన్చార్జ్ జేడీ సమర్పించారు. జిల్లాలోని 28 మండలాల్లో అత్యధికంగా పంట నష్టాలు జరిగాయని అంచనాలు వేశారు. గతంలోనే రైతులు ఆయా పంటలకు సంబందించి ఫోటోలను తయారు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఆ విధంగా రైతులు తీసుకున్న పంటల ఫోటోలను అధికారులకు సమర్పించారు.
ఆ ఫోటోల ఆధారంగా అలాగే గ్రామ రెవిన్యూ అధికారులు ముందుగనే రైతులు సాగు చేసిన పంటలను అడంగళ్లో రాసి ఉన్నారు. ఆయా పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో రెవిన్యూ కార్యాలయాల్లో బృందాలు పరిశీలించి నివేదికలు తయారు చేశాయి.
పంటలు విస్తీర్ణం పంట నష్టం బాధిత
(హెక్టార్లలో) (రూ.లలో) రైతులు
వరి 471.282 47,12,820 1074
వేరుశనగ 13273.026 13,27,30,760 9854
కంది 132.712 8,29,450 309
పత్తి 18619.623 18,61,96,230 18971
నువ్వులు 118.212 5,91,060 167
జొన్న 22.86 1,14,300 28
ఉలవలు 283.78 17,73,625 540
సజ్జ 243.116 12,15,580 404
చెరకు 1.8 8,000 02
మొత్తం 33165.461 32,81,71,825 41349