
పుర పాలకుల ఎన్నిక నేడే
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు : ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు యాభై రోజుల తర్వాత పురపాలకులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు ఆరు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరగనుంది. ఏర్పాట్లను ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లుండగా 32ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది, టీడీపీ 18 డివిజన్లకు ప రిమితమైంది. కాంగ్రెస్ 1, సీపీఎం 2, బీజేపీ 2 డివిజన్లను దక్కించుకున్నాయి. ఎక్స్అఫిషి యో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తాము ఎంచుకున్న చోట ఓటు వేయవచ్చు. వైఎస్సార్సీపీ తమ పార్టీ కార్పొరేటర్లకు బుధవారం విప్ జారీ చేసింది. విప్ ఫారాలను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
పార్టీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి విప్ జారీ చేశారు. ఆరు మునిసిపాలిటీల్లోని వైఎఎస్సార్సీపీ కౌన్సిలర్లుకు కూడా విప్ జారీ అయింది. నెల్లూరు మేయర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అబ్దుల్ అజీజ్, టీడీపీ అభ్యర్థిగా జెడ్.శివప్రసాద్ పోటీలో ఉన్నారు. కార్పొరేటర్లు చేతులెత్తి తమ అభ్యర్థికి మద్దతు తెలుపుతారు. ఆరు ము నిసిపాలిటీలోనూ చైర్మన్ల ఎన్నిక ఇదే పద్ధతిలో జరుగుతుంది. వైఎస్సార్సీపీ చైర్మన్(చైర్పర్స న్) అభ్యర్థులుగా ఎల్లసిరి గోపాల్రెడ్డి(గూడూ రు), కేతిరెడ్డి శ్రీలత(కావలి), ముత్తుకూరు లక్ష్మమ్మ(సూళ్లూరుపేట), గంధళ్ల లక్ష్మమ్మ(ఆత్మకూ రు) పోటీ చేస్తున్నారు. ఈ నాలుగు మున్సిపాలి టీలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయి.
విప్ ధిక్కరిస్తే వేటే
ఏ పార్టీ సభ్యుడైనా విప్ను ధిక్కరించినా, ఉద్దేశపూర్వకంగా ఎన్నికకు గైర్హాజరైనా వేటు తప్పదని ఎన్నికల స్పష్టం చేసింది. మూడింట ఒక వంతు లేదా రెండు వంతుల సభ్యులు పార్టీ ఫిరాయించినా వేటుపడుతుందని ఇప్పటికే తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ తరపున కార్పొరేషన్ కమిషనర్కు ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్యాదవ్, తాటి వెంకటేశ్వర్లు బుధవారం విప్జారీ పత్రాన్ని అందజేశారు. మరోవైపు మేయర్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ వృథాప్రయాస పడుతోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే విప్ జారీపై కార్పొరేటర్లలో గందరగోళ పరిస్థితిని నెలకొనేలా చేశారని అంటున్నారు.
ఈ ఎన్నికల కోసం టీడీపీ నాయకులు పి.నారాయణ, ఆదాల ప్రభాకర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నెల్లూరులో మకాం వేసి, కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కంభంపాటి రామ్మోహన్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా వీరితో మంతనాలు జరిపి వెళ్లారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు మేయరుతో పాటు నాలుగు మునిసిపాలిటీలో తమవేనన్న ధీమాతో ఉన్నారు.