
రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు
దాదాపు 3 గంటల పాటు సాగిన వేలం ప్రక్రియలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి బద్వేలు శ్రీనివాసులురెడ్డి వ్యూహాత్మకంగా రూ.60.30 కోట్లకు పాడుకుని భూములు దక్కించుకున్నారు. ఇతను మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి అనుచరుడు. వేలం ప్రక్రియలో ఆరు సంస్థలు సీల్డు టెండర్లు దాఖలు చేయగా, రెండు సంస్థలు ఈ టెండర్ల విధానంలో బిడ్లు దాఖలు చేశాయి. వీరితో పాటు మరో ఎనిమిది మంది బిడ్డర్లు నేరుగా బహిరంగ వేలంలో పాల్గొన్నారు. రూ.27.45 కోట్లతో వేలం మొదలు వేలం ప్రక్రియ రూ.27.45 కోట్ల నుంచి మొదలైంది. కనిష్టంగా రూ.5 లక్షల చొప్పున పెరుగుతూ రూ.60.30 కోట్ల వద్ద ముగిసింది. మొత్తం 186 విడతల్లో ధర పెరిగింది. బహిరంగ వేలం అనంతరం సీల్డు కవర్ల రూపంలో దాఖలైన బిడ్లు పరిశీలించగా, అందులో అత్యధికంగా రూ.54.90 కోట్లు కోట్ అయ్యింది.
ఆ తర్వాత ఈ టెండరు విధానంలో దాఖలైన రెండు బిడ్లు తెరవగా అత్యధికంగా రూ.28.27 కోట్లు నమోదైంది. దీంతో మూడు విధానాల్లో బహిరంగ వేలంలో సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లతో మొదటి స్థానంలో, హైదరాబాద్కు చెందిన చదలవాడ లక్ష్మి రూ.60.25 కోట్ల ధరతో రెండో స్థానంలో అత్యధిక ధరతో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఏడాదిన్నర కిత్రం జరిగిన వేలం ప్రక్రియలో కేవలం రూ.22.44 కోట్లతో అత్యధిక బిడ్డరుగా నిలిచిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సహచరుడు సంజీవరెడ్డి రెండో విడత వేలంలో రూ.54.15 కోట్ల వరకు పాడారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా వేలం ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.43 కోట్ల ధర వరకు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతూ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు.