
సూళ్లూరుపేట : దేశీయ అవసరాల నిమిత్తం బుధవా రం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్ రిబ్ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. 628 కేజీల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్ రిబ్ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు సమీపంలో హాసన్లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ను చేపట్టారు.