శేఖర్ కమ్ముల సూచనతో హీరోనయ్యా : శ్రీవిష్ణు
Published Mon, Jan 20 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
దర్శకుడు శేఖర్ కమ్ముల సూచనతోనే తాను హీరోనయ్యానని వర్ధమాన నటుడు శ్రీవిష్ణు తెలిపారు. ప్రేమ ఇష్క్ కాదల్లో ముగ్గురు హీరోల్లో ఒకరిగా, సెకండ్ హ్యాండ్ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఆయన నటించాడు. అల్లవరం మండలం గోడిపాలెంలోని తన స్వగృహ ంలో శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో సరదగా గడిపారు. అమలాపురం పళ్ల వెంకట్రావు వీధిలోని వారి వసతి గృహంలో ఆదివారం ఉదయం తన తండ్రి కృష్ణంరాజుతో కలసి శ్రీవిష్ణు ‘న్యూస్లైన్’తో ముచ్చటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ చిత్రంలో శేఖర్ కమ్ముల తనకో అవకాశం ఇచ్చారన్నారు. ‘ నువ్వు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాకుండా హీరోగా నటిస్టే బాగుంటావు.. ట్రైచేయి’ అని శేఖర్ కమ్ముల తనను ప్రోత్సహించారని, ఆయన సూచనతోనే తాను హీరోనయ్యానని శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ప్రతినిధి చిత్రంలో మరో హీరోగా తాను నటిస్తున్నట్టు తెలిపారు. అమలాపురం పరంజ్యోతి స్కూల్లో ఎనిమిదో తరగతి వరకు, భీమవరం విశ్వకవి స్కూల్లో పదో తరగతి వరకు చదివానన్నారు. విజయవాడ నలందలో ఇంటర్మీడియెట్, వైజాగ్ గీత మ్లో బీబీఎం చదివినట్టు తెలిపారు. అమలాపురంలో మా మావయ్యకు సినిమా థియేటర్ ఉండేదని, అక్కడకు వచ్చిన నటులను చూసి తనకు కూడా నటపై ఆసక్తి కలిగిందని ఆయన వివరించారు. కొత్తగా ‘మ్యారియో’ అనే చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్నానని, ఇటీవలే షూటింగ్ ప్రారంభమైందన్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్ల నట ప్రేరణతో తాను నటుడిగా ఎదగాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కోనసీమ నేటివిటీతో తాను హీరోగా ఓ ప్రేమకథా చిత్రం చిత్రీకరించాలన్న కోరిక ఉందని, ప్రయత్నాలు చేస్తున్నట్టు శ్రీవిష్ణు వివరించారు.
Advertisement
Advertisement