
జిల్లా లో సమైక్య బంద్ సంపూర్ణం
కెకలూరులో సమైక్య బంద్ సంపూర్ణం
కలూరు,
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కైకలూరులో గురువారం నిర్వహించిన సమైక్య బంద్ సంపూర్ణమైంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎంపీలు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై దాడి చేయడం అమానుషమన్నారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాసామ్యం గొంతునొక్కడమేనని తెలిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొబ్బిలి రత్తయ్యనాయుడు, అబ్దుల్ హమీద్, శొంఠి వీరముసలయ్య, పార్టీ పట్టణ కన్వీనర్ భాస్కర వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు రాంబాబు, వేణు, ఆదినారాయణ, కొండయ్య, శ్యామల, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
191వ రోజూ వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారం 191వ రోజుకు చేరాయి. పట్టణానికి చెందిన 25 మంది మహిళలు దీక్షలో కూర్చున్నారు. శిబిరానికి డీఎన్నార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ ఏకపక్షంగా కేంద్రప్రభుత్వం టీ బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. టీ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పార్టీ నేతలు పళ్లెం చిన్నా, సోమల శ్యాంసుందర్, మద్దాల ఆండ్రూస్, మంజులూరి కృష్ణ, వల్లూరి ఆదినారాయణ పాల్గొన్నారు.
అధికార దాహంతోనే రాష్ట్ర విభజన
కలిదిండి : సోనియాగాంధీ రాహుల్కు ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టాలని ఉద్దేశంతోనే రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పోసిన పాపారావు విమర్శించారు. పార్టీ మండల కన్వీనర్ అయినాల బ్రహ్మాజి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో రాస్తారోకో గురువారం నిర్వహించారు. కలిదిండి సెంటరులోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరసన ర్యాలీ జరిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి బాబి, కలిదిండి సొసైటీ అధ్యక్షుడు యార్లగడ్డ రవికుమార్, పార్టీ మహిళా మండల కన్వీనర్ మేడిశెట్టి ఉమా, పార్టీ యూత్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు దాసరి అబ్రహం లింకన్, మైనార్టీ నేత ఎస్.కె.చాన్, మాలమహానాడు మండల అధ్యక్షుడు కూరేళ్ల ఏడుకొండలు, నేతలు దాదా, రామకృష్ణ, మూసా, శ్రీనులు పాల్గొన్నారు.
మండవల్లిలో బంద్ ప్రశాంతం
మండవల్లి : టీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండవల్లిలో గురువారం బంద్ నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, జెడ్పీ ఉన్నత పాఠ శాల, ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్లో కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నేతలు కైలే అనీల్, నక్కా కిషోర్, ఫణి, వెంకటేశ్వరరావు, దాసి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.