అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | Suspicious circumstances in the death of the married | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Published Wed, Sep 17 2014 2:11 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

అనుమానాస్పద స్థితిలో  వివాహిత మృతి - Sakshi

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

శృంగవరపుకోట:తన కాపురాన్ని పండించుకోవాలని కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ ఇల్లాలు పెళ్లయి రెండో ఏడు నిండకుండానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఎస్.కోట పట్టణంలోని  శ్రీనివాసకాలనీలో  మంగళవారం జరిగిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న  వానపల్లి  త్రిమూర్తులు, దేవి దంపతుల  కుమారుడు రవివర్మ, స్థానిక బర్మాకాలనీకి చెందిన  కొట్యాడ కొన్నాయుడు, ఎర్నమ్మల  కుమార్తె  మణిలకు 2013 మే 12వ తేదీన వివాహం జరిగింది. అయితే వానపల్లి మణి(17)ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త పట్టణమంతా ఒక్కసారిగా వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు  సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మణి   మృతదేహాన్ని  ఆరుబయట  గడ్డిపై  వేసి,   ఆమె ముఖమంతా పసుపురాసి, మలేరియా జ్వరంతో చనిపోయిందంటూ  వచ్చి న వారందరికీ కుటుంబీకులు  చెబుతున్నారు.  
 
 ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసిఆరా తీయగాతొలుత జ్వ రంతో చనిపోయిందని చెప్పిన కుటుంబీకులు  తర్వాత   ఉరిపోసుకుని చనిపోయిందని, ఆ సమయంలో తామెవరం ఇంటి వద్ద లేమని చెప్పారు.  మృతురాలి  అత్త, మామలైన  వానపల్లి త్రిమూర్తులు, దేవిలు మాట్లాడుతూ గదిలో చీరతో ఉరిపోసుకున్నమణిని తాము దిం పి  బయట వేశామని చెప్పారు. ఎటువంటి తగాదాలు లేవని, ఎందుకు  ఈ పని చేసిందో  తమకు తెలియదన్నారు. మృతురాలి భర్త  రవివర్మ మాట్లాడుతూ తాను పనికి పోయి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేసరికి ఇంటివద్ద జనం గుమిగూడి ఉన్నారని, తీరా చూస్తే తన భార్య చనిపోయి ఉందని, ఎందుకు చనిపోయిందో తనకేమీ తెలియదని చెప్పాడు. మృతురాలి సోదరుడు  ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు  మృతదేహంపై ఉన్న పసుపును కడిగించి చూడడంతో ఆమె మెడ కమిలిన నల్లని గుర్తులు కనిపించాయి. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ  కేసు నమోదు చేశారు.   డీఎస్పీ శ్రీనివాస రావు,  సీఐ లక్ష్మణమూర్తిలు  మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని  సందర్శించి  కుటుంబీకులను  విచారణ చేశారు. మణి చావుకు కారణం అద నపు కట్నం వేధింపులే అని పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
 
 వివాహిత ఆత్మహత్యాయత్నం
 విజయనగరం క్రైం:  అదనపు కట్నం వేధింపులు తాళలేక పట్టణానికి చెందిన ఓ వివాహిత మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..పట్టణంలోని ఇప్పిలివీధిలో ఎస్.గణేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. గణేష్‌కు  రెండేళ్లక్రితం విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన విజయమాధవితో వివాహమైంది.  ఈ దంపతులకు ప్రస్తుతం ఓ పాప కూడా ఉంది. పెళ్లి అయిన దగ్గర నుంచి గణేష్‌తోపాటు అత్త మహాలక్ష్మి, చిన్నత్త పద్మ, అడపడుచు  కామేశ్వరి అదనపుకట్నం కోసం మాధవిని నిరంతరం వేధిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లిన తర్వాత మాధవి ఇంట్లో  కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు భరించలేక కేకలు వేయడంతో స్థానికులు చూసి 108కు సమాచారం అందించి  జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మాధవి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి మెజిస్ట్రేట్  వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని ఇన్‌చార్జ్  సీఐ కె.రామారావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement