ఇప్పుడు మా దారికొచ్చారు
-
కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలలోని సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట నుంచీ డిమాండ్ చేస్తున్న వైఖరికే వచ్చారని ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, ఆదిరెడ్డి అప్పారావు, నారాయణరెడ్డి అన్నారు. సోమవారం శాసనమండలి మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన డిసెంబర్ 12వ తేదీనే రూల్ నంబరు 76, 77 కింద ఉభయ సభలలో సమైక్య తీర్మానం కోరుతూ తాము నోటీసులిచ్చామని జూపూడి గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీలలోని సీమాంధ్ర నేతలు తమ పార్టీకి నిబంధనలు తెలియవని విమర్శలు చేశారని, ఇప్పుడు ఆ పార్టీల నేతలు అవే నిబంధనల ప్రకారం బిల్లు వెనక్కి పంపాలని కోరుతున్నారని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే: 42 రోజుల పాటు సీఎం కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబులిద్దరూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలాడారని జూపూడి దుయ్యబట్టారు. బిల్లు తప్పుల తడకగా ఉందని ఇప్పుడు చెబుతున్న ముఖ్యమంత్రి.. అదే మాటను వైఎస్సార్సీపీ మొదట నుంచీ చెబుతుంటే ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించారు. బిల్లుపై ఏమి మాట్లాడాలో తెలియని బాబు ఏమీ మాట్లాడకుండా సభను ముగించుకొని వెళ్లడం ఎలా అన్నదానికి దారులు వెతుక్కున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం సమన్యాయం చేయడం లేదు కాబట్టే తమ పార్టీ సమైక్య నినాదం ఎత్తుకుంటే బాబు తమ పార్టీ వదలివేసిన సమన్యాయాన్ని ఇప్పుడు పట్టుకున్నారని విమర్శించారు. బిల్లుపై ఓటింగ్ జరపాలని ఆనాడే బీఏసీ సమావేశంలో చెప్పానని అంటున్న మండలి సభా నాయకుడు రామచంద్రయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటింగ్ కోసం పట్టుబట్టినప్పుడు ఎందుకు స్పందించలేదని అప్పారావు ప్రశ్నించారు.