హుజూరాబాద్, న్యూస్లైన్ : హుజారాబాద్ పట్టణంలోకి గురువారం ఓ ఎలుగుబంటి ప్రవేశించి కలకలం సృష్టించింది. స్థానిక సాయిబాబా ఆలయ సమీపంలో నివసించే ఆలేటి శ్రీను ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుపై వేకువజామున ఓ భారీ భల్లూకం దర్శనమిచ్చింది. గమనించిన పలువురు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 7 గంటలకే సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ సురేశ్ అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
చుట్టూ గృహాలు ఉండడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులకు విషయా న్ని చేరవేశారు. దీంతో సబ్ డీఎఫ్వో అనిల్కుమార్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది వచ్చారు. చెట్టుపై నుంచి ఎలుగుబంటి కిందకు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఫారెస్ట్ రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దించారు. వారు ప్రజలందరికీ హె చ్చరికలు చేస్తూ పటిష్టమైన వలలు అమర్చారు. ఒకవేళ ఎలుగుబంటి చెట్టుదిగితే ఇళ్లలోకి వెళ్లకుండా వలలతో ప్రత్యేక దారిని పొలాల వరకు ఏర్పాటు చేశారు. అయినా సాయంత్రం 5 గంటల వరకు అది కిందకు దిగకపోవడంతో జంతువులకు మత్తు ఇంజక్షన్ వేసే వైద్యనిపుణుడిని పిలి పించారు. మత్తు ఇంజెక్షన్ వే స్తే చెట్టుపైనుంచి కిందపడి ఎలుగు చనిపోయే అవకాశాలున్నాయని తర్జనభర్జన పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. కుక్కలు తరమడం తో ఎలుగుబంటి ఇలా వచ్చి చెట్టెక్కి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 9.20 గంటలకు చెట్టు దిగిన ఎలుగుబంటి అధికారులు ఏర్పాటుచేసిన దారి గుండా కాకుండా పట్టణంలోకి ప్రవేశించి 9.40 గంటలకు ప్రభుత్వాస్పత్రి ఆవరణలోకి వెళ్లింది. రెస్క్యూ టీమ్, అటవీశాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు దానికోసం వెతుకుతున్నారు. అధికారుల కంటబడకపోవడంతో ఆస్పత్రిలోని రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
భయపెట్టిన భల్లూకం
Published Fri, Dec 27 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement