
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
⇒ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు..
⇒ ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి.
జిల్లా, మండల కేంద్రాల్లో....
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.