ఉరవకొండ: విలువైన వస్తువులు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలోని గోపురంపైన ఉన్న కలశాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామ శివారులోని పర్వతేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన అర్చకుడు ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకురావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు లభిస్తాయనే అనుమానంతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.