Excavations
-
రోమ్లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్
సాక్షి, నేషనల్ డెస్క్: ఏసీ గదులు, ప్రైవేట్ బాత్ టబ్లు. విందుల కోసం ప్రత్యేకమైన, విలాసవంతమైన గదులు. సంపన్నుల ఇళ్లలో ఉండే విలాసాల గురించి తెలిసిందే. ఇప్పుడంటే సరే గానీ ఏకంగా 2 వేల ఏళ్ల కిందటే ఇలాంటి నిర్మాణాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పురాతన రోమన్ నగరమైన పోంపెయ్లో ఇలాంటివన్నీ ఉన్నట్టు తాజాగా తేలింది. 2 వేల ఏళ్ల కింద నిర్మించిన పెద్ద ప్రైవేట్ థర్మల్ కాంప్లెక్స్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది.పోంపెయ్ పార్కు మధ్య ప్రాంతంలో బాత్ హౌస్లు బయటపడ్డాయి! నాటి పాలక వర్గ సభ్యులు విందుల కోసం 30 మంది సామర్థ్యమున్న విశాలమైన గదులను ఏర్పాటు చేసుకున్నారని పోంపెయ్ పురావస్తు పార్కు డైరెక్టర్ గాబ్రియేల్ జుచ్ట్రీగల్ తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రోత్సహించడం, ఏకాభిప్రాయ సాధన తదితరాల కోసం సం సమావేశాలు, ఒప్పందాలు వంటివి ఇక్కడ జరిగేవని వెల్లడించారు.ఇటీవల ఇదే ప్రాంతంలో అప్పటి బేకరీ, లాండ్రీ షాప్, రెండు విల్లాలను కనుగొన్నారు. అప్పట్లో మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వత బద్ధలవ్వడంతో దాని బూడిద కింద పోంపెయ్తో పాటు హెర్కులేనియం నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడవన్నీ తవ్వకల్లో బయట పడుతున్నాయి. నాటి ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఎముకలు కూడా పురావస్తు శాస్త్రవేత్తలకు లభించాయి.ఇదీ చదవండి: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!?
అలనాటి బలిపీఠానికి చెందిన ఫొటోలివి. పనామా రాజధానికి 177 కిలోమీటర్ల దూరంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఈ సమాధిలో అలనాటి పాలకుడిని, అతడి భార్యను తలకిందులుగా పాతిపెట్టి బలిచేశారు. వారితో పాటు మరో ముప్పయిరెండు మందిని కూడా ఇక్కడ పాతిపెట్టారు. ఈ సువిశాలమైన సమాధిలో వారి అస్థిపంజరాల అవశేషాలతో పాటు విలువైన బంగారు వస్తువులు భారీగా బయటపడటంతో తవ్వకాలు చేపట్టిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సమాధిలో బంగారు శాలువ, బంగారు పళ్లేలు, పాత్రలు, నగలు, తిమింగలం దంతాలు తదితర వస్తువులు ఉన్నాయి. భారీ పరిమాణంలో బంగారు వస్తువులు దొరకడం వల్ల ఈ సమాధి అలనాటి పాలకుడు లేదా సంపన్న కులీనుడికి చెందినది కావచ్చని ఇక్కడ తవ్వకాలు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జూలియా మాయో తెలిపారు. ఈ సమాధి కనీసం పన్నెండువందల ఏళ్ల కిందటిది కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి చదవండి: ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'! -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
ఎలాంటి తవ్వకాలూ చేపట్టడం లేదు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్ను ఆదేశించింది. తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. పిటిషనర్ ఆరోపిస్తున్న విధంగా ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది వరికూటి సూర్యకిరణ్ చెప్పిన విషయాన్ని హైకోర్టు రికార్డ్ చేసింది. నిబంధనల ప్రకారం ఈ కొండ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్)–2 పరిధిలోకి వస్తుంది కాబట్టి, తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణలో ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామంది. విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం తవ్వకాలకు అనుమతులు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కైలాసగిరి కొండను తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులివ్వాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఎలాంటి తవ్వకాలు చేయడం లేదని, తెన్నేటి పార్కుకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం కొండ దిగువన ఉన్న చెట్ల తుప్పలను తొలగించి, కార్ పార్కింగ్కు అనువుగా చదునుచేస్తున్నామని వీఎంఆర్డీఏ తరఫు న్యాయవాది సూర్యకిరణ్ తెలిపారు. కార్ పార్కింగ్ ఏర్పాటు ప్రజా ప్రయోజనం కిందకే వస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి కదా.. మీరు అనుమతులు తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలు తన వద్ద సిద్ధంగా లేవని సూర్యకిరణ్ తెలిపారు. తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానన్నారు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
బెర్లిన్: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్లింజెన్లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. -
చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు
సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘన చరిత్ర.. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు.. రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – సనపల కిరణ్కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
క్షుద్ర పూజలతో వణికిపోతున్న వికారాబాద్ ప్రజలు.. పుర్రె, విగ్రహం లభ్యం
దోమ (వికారాబాద్): పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి హైటెక్ సమాజంలోనూ మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కొన్ని దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తరచూ జరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం ఖమ్మం నాచారం గ్రామం చెరువు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేకెత్తించింది. దీంతో పూజలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుప్త నిధుల అన్వేషణలో.. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల అన్వేషణలో పడి పూజలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలు మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మండల పరిధిలోని దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామల మధ్యలో ఉన్న ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండయపల్లిలోని పోచమ్మ ఆలయం సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలను జరిపారు. బడేంపల్లిలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. గుండాల గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో క్షుద్రపూజలు చేస్తూ తవ్వాకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ విగ్రహంతో పాటు ఓ మనిషి పుర్రె లభ్యమైనట్లు గ్రామస్తులు అనుమానించి అధికారులకు తెలిపారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఓ కారు గుర్తించి తనిఖీ చేశారు. కారులో గుప్త నిధుల్లో వెలికి తీసిన ఓ విగ్రహం బయటపడింది. బయటపడ్డ విగ్రహం పోలీసులకు అప్పగించారు. మంత్రతంత్రాలను నమ్ముతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఆస్పత్రులకు వెళ్లకుండా మంత్రాలు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లి క్షుద్రపూజలతో పాటు తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. వీటిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పొలం దగ్గరకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుని క్షుద్రపూజలు, మూఢనమ్మాకాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గుండాల సమీపంలో గుప్తనిధుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం, ఓన్నవ్వ దేవాలయం ఎదుట గుప్తనిధుల కోసం తవ్వకాలు భయాందోళనకు గురవుతున్నాం... గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఇలాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. – యాదయ్య, ఖమ్మంనాచారం గ్రామం అవగాహన లేకపోవడం వల్లే.. మూఢనమ్మకాలపై పల్లెవాసులకు అవగాహన లేకపోవడం వల్లే మంత్రాలను నమ్ముతున్నారు. ఆయా గ్రామాలలో మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులంటూ ఎన్నో రకాల పూజలు నిర్వహిస్తున్నారు. వాటితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూఢనమ్మకాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – నిమ్మలి వెంకటమ్మ, కొండయపల్లి -
అబ్బుర పరిచిన ఆదిమానవుని ఆనవాళ్లు..
సాక్షి, నంగునూరు: ఆదిమానవుల ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆదిమానవుని సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు. (చదవండి: హైదరాబాద్లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?) 1.క్యాప్స్టోన్గా అతిపెద్ద బండరాయి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి ఆదిమానవుల సమాధిపై ఉన్న క్యాప్స్టోన్. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు. 2. సుద్ద ముక్కలు కావు శంఖాలు (కౌంచ్) సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 3. కుండలు పెట్టుకునే రింగ్స్టాండ్ ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్స్టాండ్) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్స్టాండ్ ఇది. 4. నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్మాక్స్ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి). 5. తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాదుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది. 6. అద్భుతమైన మట్టికుండ ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టు అలంకారంగా సర్కిళ్లు చెక్కగా ఇప్పటికి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత పెద్దకుండను తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: జొన్నలకు పులి కాపలా!) 7 ఫైర్స్టాండ్, మృణ్మయ పాత్రలు ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే ఫైర్స్టాండ్ (కుంపటి) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు వీటిని వాడినట్లు తెలుస్తోంది. 8. రాళ్లుకావు ప్రాచీన మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్విస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. 9. గుంతలు కావు గ్రూవ్స్ మగ్దుంపూర్లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు. 10. గిన్నెల తయారీ అద్భుతం ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా ఇప్పటికి చెక్కుచెదరలేదు. మెన్హీర్ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి. 11. చెక్కు చెదరని దంతాలు మెన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో జరుపుతున్న తవ్వకాల్లో తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికి చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలు కీలకంగా మారనున్నాయి. 12. ఎముక ఆభరణాలు ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్హీర్ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) -
‘పాలమూరు–రంగారెడ్డి’పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశలో చేపట్టే పనులకు పర్యావరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, మహబూబ్నగర్ జిల్లా హన్వాడ, నారాయణపేటలో కార్యక్రమం జరిగింది. ముందుగా అధికారులు ప్రాజెక్టు అవశ్యకత, లాభాలు, వ్యయాల వం టివి ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వివరించారు. అనంతరం వారి అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీచేసి అనుమ తించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించలేదు. ప్రతి కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. వెల్దండలో కలెక్టర్ శర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 8 మండలాల రైతులు పాల్గొన్నారు. తమకు పర్యావరణంపై అవగాహన లేదని, నష్టపరిహారంపైనే ఆందోళన ఉందని రైతులు చెప్పారు. నారాయణపేటలో కలెక్టర్ దాసరి హరిచందన అధ్యక్షతన 9 మండలాల రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతుల పేర్లను చిట్టీల్లో రాసి డిప్తీస్తూ ఒక్కొక్కరితో మాట్లాడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లే తీశారనే ఆరోపణలొచ్చాయి. -
హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయో తెలుసా..
దొడ్డబళ్లాపురం: మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన వస్తువులు బయటపడడం ఆసక్తిగా మారింది. మాగడి తాలూకా కన్నూరు గ్రామంలో మక్కళ దేవర మఠంలో మఠానికి చెందిన భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం జేసీబీతో తవ్విస్తుండగా హఠాత్తుగా భూమి లోపలకు కూలిపోయింది. దీంతో అక్కడ తవ్వి చూడగా ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి. తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు వెలుగుచూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
చీపురుపల్లి రూరల్: రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు. గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి–సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటి కోసం రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. ఆర్థిక భారం కావడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మి తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని చెబుతున్నారు. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
ఇంటి తవ్వకాల్లో బయటపట్ట బంగారం
న్యూశాయంపేట/వరంగల్ : వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి కందకాలు తీస్తుండగా బంగారు గొలుసు బయటపడింది. దీని పంపకం విషయమై కూలీల గొడవతో విషయం బయటపడగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన గొలికారి రమేష్ పాత ఇంటి స్థానంలో నూతన నిర్మాణ పనులను బిల్డర్కు అప్పగించాడు. ఆయన కాట్రపల్లికి చెందిన కూలీలతో బుధవారం కందకాలు తవ్విస్తుండగా మూడున్నర తులాల బంగారు గొలుసు బయటపడింది. అయితే, గొలుసు పంపకంపై కూలీలు గొడవ పడుతుండగా ఆనోట ఈనోట విషయం బయటపడింది. దీంతో ఎస్ఐ సతీష్ చేరుకుని కూలీలు విచారించి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాత ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో తమ పూర్వీకులు ఇంకా ఏమైన ఆభరణాలు దాచిపెట్టారా అనే అనుమానాల్ని యజమాని వ్యక్తం చేశారు. -
తవ్వకాల్లో గుట్టలు గుట్టలుగా గవ్వలు..
భువనేశ్వర్: నయాగడ్ జిల్లాలోని తరియా పంచాయతీలో ఉన్న నిచ్చిపూర్ గ్రామంలో కొత్త ఇల్లు నిర్మాణం నిమిత్తం పునాదులు తీసేందుకు తవ్వకాలు చేపడుతుండగా అక్కడి భూగర్భంలో నుంచి గుట్టలు గుట్టలుగా గవ్వలు బయటపడ్డాయి. మొత్తం 10 తట్టల గవ్వలు వెలికి తీసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం రేకిత్తిస్తుండగా, పూర్వీకులు వీటిని గుప్త నిధిగా భావించి భూగర్భంలో పదిలపరిచినట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్వ కాలంలో దైనందిన లావాదేవీల్లో నేటి తరంలో వినియోగించే ధనం తరహాలోనే ఈ గవ్వలను వినియోగించే వారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం 4 అడుగులు లోపు జరిపిన తవ్వకాల్లోనే ఈ గవ్వలు కనిపించాయని ఇంటి స్థల యజమాని నారాయణ సాహు తెలిపాడు. చదవండి: ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం -
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) 1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా,ఒంటిమిట్ట : గంగపేరూరులోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన వీరభద్రస్వామి ఆలయం శిథిలమైంది. ఆఖరికి వీరభద్రుడి శిల్పం, ఆనాటి శాసనాలు మాత్రమే మిగిలాయి. పురాతన ఆలయం కాబట్టి గుప్త నిధులు ఉంటాయనే ఆలోచనతో కొంత మంది 5 బైక్ల్లో వచ్చారు. అక్కడ ఉన్న వీరభద్రుడి శిల్పాన్ని తొలగించారు. శిల్పం ఉన్న చోట తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా ఏమీ కనిపించక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు. -
ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
సాక్షి, అమ్రాబాద్: పదర మండలం రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అగ్ని గుండం కోసం పేర్చిన రాళ్లను తొలగించి, తవ్వకాలు జరిపి యథాస్థానంలో ఉంచారు. బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న భక్తులు కొంత మంది చూసి తవ్వకాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదర ఎస్ఐ సురేష్కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. గతంలోనూ తవ్వకాల ప్రయత్నం ఆలయంలో తవ్వకాలు జరిపిన ప్రదేశం ఇదిలాఉండగా గత ఆగస్టు 10వ తేదీన రాయలగండిలో గుప్త నిధుల తవ్వకాల ప్రయత్నం జరిగింది. ఓ కారులో గుప్తనిధుల కోసం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో పరికరాలతో అణ్వేషన జరుపుతుండగా స్థానికులు గుర్తించి వెంబడించారు. కారులో పరారైన దుండగులను మన్ననూర్లో ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వచ్చిన ఐదు మంది దుండగులతో పాటు కారును, గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనేటర్, పౌడర్, వివిధ పరికరాలను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు. అప్పట్లో అన్వేషణ ప్రయత్నం జరగడం, బుధవారం తవ్వకాలు బయట పడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలగండి ఆలయం వద్ద పోలీసు పహారా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జాడల్ని చెరిపేసుకుంటున్నాం
రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ. గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు. ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది. ప్రాచీనతకు హంగులా!! శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు. స్నానాల బాటను తవ్వేశారు టూరిజం భ్రమలో పడి సైట్ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం. అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని! పాత తొట్లకొండ మాయం బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు. ఇదంతా భావితరాల ఆస్తి నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్హూత్లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది. ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ. – సరస్వతి రమ ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్ రెండవ పుస్తకం రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’. -
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
సాక్షి, కొల్లిపర/ గుంటూరు: కృష్ణానదిలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు రాత్రివేళ చేపట్టారు. గమనించిన గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. పది రోజుల కిందట కృష్ణానదికి వరదలు రావడంతో నిన్నటి వరకు వరద ఉధృతి నెలకొంది. రెండు రోజుల నుంచి నీరు తగ్గి ఇసుక దిబ్బలు బయట పడ్డాయి. వాటిపై ఇసుక మాఫియ కన్నుపడింది. ఇక అంతే రాత్రి వేళల్లో ఇసుక తరలించటం మొదలు పెట్టారు. రెండు రోజుల నుంచి హన్మాన్పాలెంలో డంప్ చేసి, ఇసుకను చక్రాయపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అలాగే శనివారం రాత్రి కొల్లిపర గ్రామానికి చెందిన కొంత మంది కొత్తబొమ్మువానిపాలెం కృష్ణానది కరకట్ట పుష్కర ఘాట్ వద్ద జేసీబీ, కూలీల సాయంతో లారీ, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అది గమనించిన హన్మాన్పాలెం, బొమ్మువానిపాలెం గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. వారిని చూసిన అక్రమార్కులు జేసీబీని పక్కన ఉన్న పొలంలో నుంచి కరకట్టకు ఎక్కించారు. అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మీరు ఎవరు, ఏ అనుమతితో ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ స్పందించి మీరెవరు మమ్ములను ప్రశ్నించడానికి అంటూ ఎదురుదాడికి దిగాడు. ట్రాక్టర్తో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.గ్రామస్తులు బైకును ట్రాక్టర్కు అడ్డుగా పెట్టి అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు లారీ, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర, వాహన యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మూడు ఇసుక ట్రాక్టర్లపై కేసు యర్రబాలెం(మంగళగిరి): యర్రబాలెం గ్రామంలోని రాజధాని రోడ్లలో నిల్వ ఉంచిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక ట్రాక్టర్తో సహా పరారయ్యాడు. మరో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
లేదే కనికరం.. రాదే పరిహారం!
సాక్షి,తుగ్గలి(కర్నూలు) : బంగారు నిక్షేపాల వెలికి తీతకు సంబంధించి భూములు విక్రయించిన రైతులకు అటు కంపెనీ డబ్బు ఇవ్వక, పరిహారం, బీమా రాక తీవ్రంగా నష్టపోయారు. మండలంలో బొల్లవానిపల్లి, జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల సరిహద్దుల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన జియోమైసూర్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ గత 20 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో పలు సర్వేలు చేసింది. చివరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి వాటిని వెలికితీసేందుకు 2013లో ప్రభుత్వ అనుమతులు పొందింది. ఈ మేరకు 2018 ఏప్రిల్ 12న ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఎకరా రూ.12లక్షల ప్రకారం 350 ఎకరాలు కొనుగోలు చేసేలా కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంది. ఒకటి రెండు నెలల్లో భూములు కోల్పోయే రైతులకు కొన్న ప్రకారం మొదటి విడతగా రూ.10 లక్షలు, మలిదశలో రూ.2లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పంటలు కూడా వేయొద్దని, త్వరలో డబ్బు ఇచ్చి పనులు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందకుండా, పంటలు వేయకుండా తమ పొలాలు బీళ్లు పెట్టారు. అయితే కంపెనీ చెప్పిన గడువు ముగిసి నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదు. దీంతో బంగారు నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభం కాలేదు. చివరకు ఏడాది దాటిపోయి నా డబ్బు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ మాటలు నమ్మి మోసపోయామని అటు పంటలు వేసుకోక, ఇటు పంట రుణాలు పొందక చివరకు పంట నష్టపరిహారం, బీమా లాంటివి కోల్పోయామని బాధిత రైతులు వాపోతున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరువుతో అల్లాడిపోతున్నామని, కుటుంబాలు గడవడం కూడా కష్టమైందని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తమకు డబ్బు ఇవ్వకపోగా, ప్రభుత్వం నుంచి వచ్చే పంటనష్ట పరిహారం, బీమా వంటి సౌకర్యాలు కోల్పోయామని వాపోతున్నారు. పంటలు వేసుకోకుండా చేసిన కంపెనీనే తమకు జరిగిన నష్టాన్ని భరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలులో స్పందన కార్యక్రమంలో కూడా తమ కష్టాలు చెప్పుకున్నామని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తాం బంగారు నిక్షేపాల వెలికితీతకు సంబంధించి కొన్ని ఆటంకాలు ఏర్పాడ్డాయి. దీంతో అనుకున్న సమయంలో పనులు ప్రారంభించ లేక పోయాం. త్వరలోనే ఆటంకాలు తొలగిపోతాయి. పంటలు వేసు కోకుండా, పరిహారం, బీమా కోల్పోయిన రైతులు నష్టపోకుండా కంపెనీతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – హనుమప్రసాద్, కంపెనీ ప్రతినిధి నెలకే డబ్బు ఇస్తామన్నారు బంగారు నిక్షేపాల వెలికితీత అని జియోమైసూర్ కంపెనీ ఏడాది క్రితం భూమలు కొంటామని చెప్పి ఎకరా రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నాది 6.20 ఎకరాలు కంపెనీకి పోతోంది. కంపెనీ వారు పంటలు వేసుకోవద్దు, డబ్బు ఇచ్చి పనులు మొదలు పెడతామని చెప్పారు. అయితే ఇంత వరకు డబ్బు ఇవ్వలేదు. దీంతో పంటలు వేసుకోక, పరిహారం బీమాకు నోచుకోక నష్టపోయిన తమను కంపెనీనే ఆదుకోవాలి. –లేపాక్షిరెడ్డి,రైతు, బొల్లవానిపల్లి పంటలు వేసుకోవద్దన్నారు బంగారు గనుల పనులు మొదలు పెడతామని పంటలు వేసుకోవద్దని కంపెనీ వారు చెప్పారు. ఏడాది దాటినా డబ్బు ఇవ్వలేదు. దీంతో తాము పంటలు వేసుకోక, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం, బీమా అన్నీ కోల్పోయాం. తమకు కలిగిన నష్టానికి కంపెనీనే బాధ్యత వహించాలి. – అంజినయ్య, రైతు, బొల్లవానిపల్లి -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
వైఎస్ఆర్ జిల్లా, అట్లూరు : అట్లూరు మండలం కమలకూరు పంచాయతీ నల్లాయపల్లి రెవెన్యూ పొలంలోని పాపాయకుంట దగ్గర ఉన్న పురాతనమైన బావిలో గత వారం రోజు లుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్వ కా లంలో రాజులు ఇక్కడికి వేటమార్గంలో వచ్చినప్పుడు వారాల తరబడి ఈ బావి సమీపంలో సేద తీర్చు కోవడంతో పాటు కొంతమేర గుప్తనిధులు ఈ బావిలో భద్రపరిచేవారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బావిలో తవ్వకాలు జరపగా సు మారు పది అడుగుల లోతులో రెండు నీటి తొట్లు బయటపడ్డాయి. పోలీసులు వి చారణ జరిపితే తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. -
చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూడని బుద్ధుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగుసున్నంతో రూపొందిన) వెలుగు చూసింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తుశకం మూడో శతాబ్దంలో దీన్ని రూపొందించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్తూప కేంద్రమైన ఫణిగిరిలో శుక్రవారం ఈ అద్భుతం బయల్పడింది. ఫణిగిరి బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ఫిబ్రవరి నుంచి పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. బౌద్ధ స్తూపం, చైత్యాలు, బుద్ధుడి ధాతువు, బుద్ధుడి జీవిత చరిత్రను కళ్లముందు నిలిపే అద్భుత చెక్కడాలను గతంలో వెలికి తీశారు. ఆ తర్వాత తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఏఎస్ఐ నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం దాదాపు ఆరడగుల పొడవున్న బుద్ధుడి ఆకారం వెలుగు చూసింది. ఆ ప్రతిమ వెనుక భాగం మాత్రమే కన్పిస్తోంది. దాన్ని చూస్తే నిలబడి ఉన్న బుద్ధుడి ఆకారంగానే కనిపిస్తోంది. అయితే బుద్ధుడి జీవిత చరిత్రలో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బుద్ధుడి చరిత్రలో ఉండే రాజులకు సంబంధించినదై కూడా ఉంటుందనే మరో అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై అలంకరణ గుర్తులున్నాయి. సాధారణంగా బుద్ధుడి శరీరంపై ఎక్కడా అలంకరణ ఉండదు. కంకణాలు, ముంజేతి అలంకరణలు కనిపిస్తున్నందున అది బుద్ధుడిగా మారకముందు రూపమై ఉంటుందని, లేదంటే ఇతర రాజులకు సంబంధించినదై ఉంటుం దని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పేర్కొంటున్నారు. ఆ విగ్రహం ముందు భాగం చూస్తేగాని కచ్చితమైన రూపాన్ని ప్రకటించలేమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా.. పురాతన కాలం నాటి కట్టడాలున్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో డంగు సున్నంతో రూపొందించిన శిల్పాలు వెలుగు చూడటం సహజం. కానీ ఇవి రెండడుగుల కంటే ఎక్కువ పొడవున్న దాఖలాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కానీ తొలిసారి మానవుడి సహజ ఎత్తు పరిమాణంలో ఉండే సున్నం (గార) ప్రతిమ వెలుగుచూసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఆరడగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు కనిపించలేదని నాగరాజు, విశ్రాంత అధికారులు రంగాచార్యులు, తవ్వకంలో పాలుపంచుకున్న భానుమూర్తిలు వెల్లడించారు. ఇది చాలా అరుదైన ప్రతిమగా వారు అభివర్ణించారు. లోన ఇటుకలు.. ఈ విగ్రహాన్ని తొలుత ఇటుకలతో నిర్మించి దానిపై మందంగా డంగు సున్నం మిశ్రమ లేపనంతో ఆకృతి తెచ్చారు. ఆ విగ్రహానికి పలు ప్రాంతాల్లో రంధ్రాలున్నాయి. దానికి చేరువలో భారీ గోడ ఉన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహాన్ని ప్రత్యేక పద్ధతిలో గోడకు అమర్చి ఉంటారని, అది గోడతోపాటు అలాగే కూలిపోయి భూగర్భంలో ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వెలికి తీసే తరుణంలో అది ముక్కలు కానుంది. దాన్ని తిరిగి పూర్వపు పద్ధతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించనున్నారు. ఇందుకోసం విగ్రహాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు. విగ్రహం పగుళ్ల ఆధారంగా నంబర్లు వేశారు. వెలికి తీశాక అ ముక్కలను హైదరాబాద్ తరలించి ఫొటో డాక్యుమెంటేషన్ ఆధారంగా డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించి పూర్వరూపం తెస్తారు. ఈ భారీ విగ్రహం వెలుగు చూసిన విషయాన్ని వెంటనే హెరిటేజ్ తెలంగాణ ఇన్చార్జి డైరెక్టర్ సునీత భగవత్ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె సూచనల మేరకు నిపుణులతో చర్చించి దాన్ని హైదరాబాద్ తరలింపు, సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాజు పేర్కొన్నారు. అపూర్వ గుర్తు ఆ విగ్రహం వెలుగు చూసిన వెంటనే మా సిబ్బంది నా దృష్టికి తెచ్చారు. అది అతి అరుదైన ప్రతిమగా వారు చెప్పారు. కానీ పూర్తిగా వెలికి తీశాక గాని వివరాలు తెలియవు. ఇప్పటి వరకైతే అది చరిత్రకు సంబంధించి అపూర్వ గుర్తుగా భావిస్తున్నాం. తవ్వకాలు కొనసాగించి అక్కడ ఇంకా ఏమున్నాయో గుర్తిస్తాం. శనివారం కొన్ని వివరాలు వెల్లడవుతాయి. సునీత భగవత్, ఇన్చార్జి డైరెక్టర్ -
గుప్త నిధుల కోసమే తవ్వకాలా...!
విజయనగరం, కొత్తవలస రూరల్: కొత్తవలస పంచాయతీ బలిఘట్టం గ్రామ సమీపంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద మూలవిరాట్టును ఆనుకుని వెనుక భాగంలో సుమారు మూడడుగుల మేర జరిగిన తవ్వకాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విగ్రహాన్ని సైతం పెకలించి దాని కింద తవ్వకాలు జరిగిన వైనం చూస్తుంటే గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేసుంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలనాటి రాజుల గుప్తనిధులు దాచి ఉంచారన్న సమాచారంతోనే ఈ తవ్వకాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సోమవారం భక్తుల కంట పడిన తవ్వకాల పనులు ఆదివారం రాత్రి జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఈ తవ్వకాల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని అపచారం జరిగిందని పేర్కొంటున్నారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవిస్తుండడంతో ఆకతాయిలు చేసిన పనై ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. పెద్దాపురం రాజుల కాలం నుండి... శ్రీవేణుగోపాలస్వామి ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నాటిదని పాతసుంకరపాలెం గ్రామపెద్ద పెదిరెడ్ల సూరిబాబు తెలిపారు. అప్పటి రాజులు స్వామికి నిత్యం పూజలు చేసేవారని నిత్య స్నానాధుల కోసం బావి కూడా తవ్వారని పేర్కొన్నాడు. ఈ ఆలయంలో అప్పటి రాజులు గుప్త నిధులు దాచారని చాలా కాలంగా ప్రచారం సాగుతుందని గతంలో జీర్ణావస్థకు చేరుకున్న ఆలయానికి 1987లో పునఃనిర్మాణ పనులు చేపట్టే సమయంలో రాగి చెంబు ఒకటి తవ్వకాల్లో దొరికిందని అప్పటి నుంచి ఈ ఆలయం వద్ద గుప్త నిధులు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగలు తవ్వకాలు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల వద్ద క్షుద్ర పూజలు ఆలయం వెనుక తవ్విన ప్రాంతంలో తవ్వడానికి ముందు వివిధ రకాల పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపించాయని బహుసా క్షుద్రపూజలు ఏమైనా నిర్వహించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా గుప్త నిధులు ఉన్నాయా ఏమైనా తస్కరించారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. దేవుని విగ్రహం పగులగొట్టి తవ్వకాలు జరపటం అపచారంగా భావిస్తున్నామని పోలీసులకు సమాచారం అందించామని పెదిరెడ్ల సూరిబాబు తదితరులు తెలిపారు. బుధవారం సీఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలన చేసారని స్థానికులు తెలిపారు. -
వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం
రాజమహేంద్రవరం క్రైం: గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలంటూ ధర్మకర్తల మండలి ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, కణుపురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కొత్తలంక మల్లికార్జున శర్మ (30)అర్చకుడు. అతని తండ్రి సత్యనారాయణ శర్మ 40 ఏళ్లుగా ఇక్కడే అర్చకుడిగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటుండడంతో మల్లికార్జున శర్మ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే దేవాలయంలో గుప్త నిధులున్నాయనే వదంతులు రావడంతో దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునశర్మపై తవ్వకాలకోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో మరో పూజారిని నియమించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున శర్మ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. తనపై జరిగిన వేధింపుల విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వేందుకు సహకరించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, కాగా తాను వేదమంత్రాలు వల్లెవేస్తూ మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.దీనిపై అర్చక సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. మల్లికార్జున శర్మ మృతదేహంతో తమ నిరసనను తెలిపింది. అర్చకులకు రక్షణ కల్పించాలని కోరింది. -
కేరళలో ఎందుకీ విపత్తు ?
దేవభూమి కేరళ వర్ష బీభత్సానికి చివురుటాకులా వణుకుతోంది. అసలు ఎందుకీ ప్రకృతి ప్రళయం ? 2011లో చేసిన ఒక తప్పిదమే ఇప్పుడు వెంటాడుతోందా ? ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, కొండ ప్రాంతాల్ని తొలిచేయడం వల్లే ఈ దుస్థితి ఎదురైందా? అనే అనుమానాలు తలెత్తడం సహేతుకమే. గాడ్గిల్ కమిటీ సిఫారసులు బేఖాతర్ పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో ప్రతీ ఏడాది వర్షాలు ఎక్కువ. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ భారీ వర్షాలు మామూలే. వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి ముందస్తుగా సరైన చర్యలు చేపట్టకపోవడం, పర్యావరణవేత్తలు చేసిన సూచనల్ని, సలహాల్ని పెడచెవిన పెట్టడం వల్ల ఇప్పుడు అతివృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేరళ ముప్పు ముంగిట్లో ఉందని 2011లోనే గాడ్గిల్ కమిటీ హెచ్చరించింది. లక్షా 40 వేల విస్తీర్ణంలోని పశ్చిమ కనుమల్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనవని పేర్కొంటూ వాటిని మూడు జోన్లగా విభజించింది. ఈ జోన్లలో మైనింగ్ తవ్వకాలు, ఎడాపెడా నిర్మాణాలు చేపట్టవద్దంటూ సూచనలు చేసింది. అటవీ కార్యకలాపాలకు మాత్రమే ఈ జోన్లను వాడుకోవాలని సిఫారసు చేసింది. కానీ అప్పట్లో కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వం గాడ్గిల్ కమిటీ చేసిన సిఫారసుల్ని పెడచెవినపెట్టింది. యథేచ్ఛగా తవ్వకాలు.. ఈ సీజన్లో కేరళలో అత్యధికమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం కొండచరియలు విరిగిపడటమే. ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కొజికోడ్, మలాపురం వంటి జిల్లాల్లో కొండచరియలు తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికంగా నివాసం ఉండే వారి సహకారంతో కొండ ప్రాంతాలను ఎలా కాపాడుకోవచ్చో గాడ్గిల్ కమిటీ వివరించింది. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, కొండ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టింది. కేరళ వ్యాప్తంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న యూనిట్లు 1500కి పైగానే ఉన్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్లో తవ్వకాలు జరపడం వల్ల నేల అడుగు భాగంలో మట్టి కదిలిపోయి డొల్లగా మారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలపై నిషేధం విధించాలంటూ 2011లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ ఈ విపత్తు మానవ తప్పిదమేనని అంటున్నారు. కొండలపై ఆకాశహర్మ్యాలు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న సాకుతో కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా రిసార్టులు, రెస్టారెంట్ల నిర్మాణానికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అటవీ భూముల్ని ఆక్రమించి చెట్లను నరికేసి ఎడాపెడా భవంతులు నిర్మించారు. వాటర్ జోన్లలో కూడా చట్టవిరుద్ధంగా ఆకాశహర్మ్యాలు వెలిశాయి. దీంతో కొండప్రాంతాలు నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. పై నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమైంది. అదే ఇప్పుడు కేరళకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిపోయి గేట్లను ఎత్తేయడం ఒక్కటే ఇప్పటి పరిస్థితికి కారణం కాదని, ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ స్టడీస్ మాజీ శాస్త్రవేత్త వి. థామస్ అన్నారు. కేరళలో 44 నదులు ప్రవహిస్తున్నాయి. నదీ గర్భాన్ని తవ్వుతూ తీరాల వెంట గృహ నిర్మాణాలు చేపట్టడంతో జనవాసాలను వరద నీరు ముంచెత్తింది. 1924 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే ప్రథమం కేవలం రెండున్నర నెలల్లోనే 37% అధిక వర్షపాతం నమోదు ఇడుక్కిజిల్లాలో 83.5% అధిక వర్షపాతం 27 డ్యామ్ల గేట్లను ఎత్తేశారు 211 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయ్ మృతుల సంఖ్య 180 పై మాటే 20 వేల ఇళ్లు ధ్వంసం 10 వేల కిలోమీటర్ల రహదారులు నాశనం రూ.8,316 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వరదముప్పులో ఉన్న జిల్లాలు ః 13 రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ః 9 ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం మూసివేత ఆసియాలో అతి పెద్ద డ్యామ్ ఇడుక్కి నుంచి గత మూడు నాలుగు రోజులుగా సెకండ్కి 10–15 లక్షల లీటర్ల నీరు విడుదల సహాయ చర్యల్లో నిమగ్నమైన 18 బృందాలు, మరో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం ఓనం పండుగ కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధులు వరద సహాయానికి మళ్లింపు -
మాంత్రికుల సలహాలతో కోటలో తవ్వకాలు.!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో నిధుల కోసం గత కొన్ని నెలలుగా అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఏమి లేదని తెలిసి అధికారులు తవ్వకాలు నిలిపివేశారు. అయితే తాజాగా మళ్లీ కోటలో నిధి వేటగాళ్లు తవ్వకాలు ప్రారంభించారు. నిధి వేటగాళ్లు క్షుద్ర మాంత్రికుల సలహాలతో కోటలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కలేబరాల అవశేషాలు మాత్రమే బయటపడటం విశేషం. అదేవిధంగా సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. రాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీంతో పురావస్తు, మైనింగ్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున తవ్వకాలు జరిగాయి. వజ్ర వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికియాని వార్తలు రావడం తెలిసిందే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. -
'పెద్దబొంకూరు'పై గద్దల కన్ను
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది. చారిత్రక ప్రాధాన్యం పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ 40 ఎకరాలు భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది. తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
కర్నూలు, ఆళ్లగడ్డ : అహోబిలం క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ కాలువ సమీపంలో వెలసిన దుర్గమ్మ విగ్రహాన్ని గుప్తనిధులకోసం దుండగులు కూల్చివేసిన ఘటన బుధవారం తీవ్ర సంచలనం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. తెలుగుగంగ అటవీ సమీపంలో దుర్గామాత గుడి ఉంది. ఈగుడిలో ప్రతిష్టించిన దుర్గామాతకు మంగళవారం సాయంత్రం నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించడంతో పాటు భజనలు చేస్తూ దారిన వచ్చిపోయేవారికి తీర్థప్రసాదాలు కూడా అందజేశారు. అర్ధరాత్రి అనంతరం క్షుద్రపూజలు నిర్వహించి విగ్రహాన్ని పెకిలించి ధ్వంసం చేసి బయట పడేశారు. ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అహోబిలంలో భయం భయం అహోబిలం క్షేత్ర పరిధిలో సుమారు 101 పురాతనమైన గుళ్లు, గోపురాలున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గుళ్లుగోపురాలను గుప్తనిధుల వేటగాళ్లు కూల్చివేసి ధ్వంసం చేశారు. తాజాగా ప్రధాన రోడ్డుపైనే ఉన్న దుర్గమ్మ విగ్రహన్ని కూల్చివేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. -
హైదరాబాదీలకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇకపై రోడ్ల తవ్వకాలుండవ్. ఈ ఏడాదంతా నగరవ్యాప్తంగా రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. అడ్డగోలు తవ్వకాలతో అవస్థలు పడుతున్న సిటీజనులకు ఇది శుభవార్తే. కేబుల్ వైర్లు, తాగునీరు, విద్యుత్, టెలికం అవసరాల కోసం ఆయా సంస్థలు రోడ్లను తవ్వేసి నెలల తరబడి పూడ్చకపోవడం, పనులు సాగుతూ ఉండడం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ.. ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా రాత్రికి రాత్రే రోడ్లన్నీ తవ్వేస్తుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నిషేధం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దాదాపు 1900 కి.మీ మేర తవ్వకాల కోసం ఆయా సంస్థలు అనుమతి కోరగా నిర్ద్వందంగా తిరస్కరించింది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ తవ్విన రోడ్లతో జనం నానాపాట్లు పడుతున్నారు. కేబుళ్లు, తాగునీరు, విద్యుత్ తదితర అవసరాల కోసంఆయా సంస్థలు రోడ్లను తవ్వి..నెలల తరబడి పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పాడుతున్నారు. ఆ సమస్యలలా ఉండగానే వివిధ సంస్థలు తమ అవసరాల కోసం మళ్లీ రోడ్ల తవ్వకాలకు అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీని కోరాయి. ఇలా దాదాపు 1900 కి.మీ.ల మేర తవ్వకాల అనుమతులు కోరగా, అందుకు జీహెచ్ఎంసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ ఏడాదంతా ఎవరికీ ఎలాంటి అనుమతులిచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అత్యంత అవసరమైన పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తెస్తే అనుమతులిస్తున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఆయా అవసరాల కోసం రోడ్ల కటింగ్లకు అనుమతులు పొందిన సంస్థలు తమ పనుల్ని సకాలంలో పూర్తి చేయకపోవడంతో తవ్విన రోడ్లతో ప్రజలు పడరాని పాట్లుపడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో తవ్వకాల చుట్టూ కనీసం ఫెన్సింగ్ వంటివి కూడా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. దాదాపు మరో నెల రోజుల్లో వర్షాకాలం రానుండటంతో మరిన్ని సమస్యలు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కొత్త అనుమతులివ్వడం లేదని జియావుద్దీన్ పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ఆయా అవసరాల కోసం దాదాపు 40 కి.మీ.ల మేర మాత్రం ఇప్పటికే అనుమతులిచ్చినట్లు తెలిపారు. వీటిల్లో ట్రాన్స్కోకు 1.233 కి.మీ.లు, టీఎస్ఎస్పీడీసీఎల్కు 18.17 కి.మీ.లు స్మార్ట్సిటీ ప్రాజెక్ట్కు సంబంధించి సీసీటీవీల ఏర్పాట్లకు 14.27 కి.మీ.లు, జలమండలికి 5.7 కి.మీ.ల మేర అనుమతులిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల గృహావసరాలకు సంబంధించి మాత్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఆన్లైన్లో అందే దరఖాస్తులకు అనుమతులిస్తున్నట్లు స్పష్టం చేశారు. గృహావసరాలకు తక్కువ దూరం మాత్రమే రోడ్ కటింగ్ అవసరమవుతుందని, త్వరితంగానే పనులు పూర్తవుతాయన్నారు. -
ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు
తుగ్గలి: చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. తవ్వకాలను ఆదోని ఆర్డీఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, తుగ్గలి ఎస్ఐ పులిశేఖర్, ఆర్ఐ మధుసధనరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి పాల్గొన్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం. -
తవ్వకాల్లో బయటపడ్డ నందీశ్వరుడి విగ్రహం
సాక్షి,భైంసారూరల్(ముథోల్) : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంలో సోమవారం పోచమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతుండగా నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలియగానే త్రియంబకేశ్వరుని ఆలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులంతా అక్కడికి చేరుకుని నందీశ్వరున్ని శుద్ధిచేసి జలాభిషేకాలు చేశారు. గ్రామంలో పురాతన ఆలయాలు ఉండేవని కాలగర్భంలో కలిసిన ఆలయాల వద్ద తవ్వకాలు చేపడితే ఇలా విగ్రహాలు బయటకు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. -
కోటలో మళ్లీ తవ్వకాలు
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు 15 రోజుల విరామం తర్వాత శనివారం పునఃప్రారంభమయ్యాయి. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. మొదట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల తర్వాత ‘వాల్యూబుల్ మినరల్స్’ కోసమంటూ అధికారులతో ప్రకటన చేయించింది. ఓ వైపు తాంత్రిక పూజలు చేయిస్తూ.. మరో వైపు పలు సర్వేలను నిర్వహించింది. స్కానర్లు, రెసెస్టివిటీ మీటర్లతో పాటు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల ద్వారా అత్యాధునిక పరికరాలైన మాగ్నటో మీటరు, జీపీఆర్తో సర్వే చేయించింది. గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎగువ భాగాన కుడి వైపు స్థలంలో శనివారం మధ్యాహ్నం పూజలు చేసి.. తవ్వకాలు పునః ప్రారంభించారు. కర్నూలుకు చెందిన 12 మంది కూలీలతో తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ముందు గదుల ఆనవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. తవ్వకాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ పర్యవేక్షించారు. -
మూటకట్టి.. మూలనేసి..
సాక్షి, హైదరాబాద్: తవ్వకాల్లో వేల ఏళ్ల నాటి వస్తువులు, పనిముట్లు బయటపడ్డాయి.. అధికారుల్లో ఆసక్తి పెరిగి ఇంకాస్త శోధించారు.. ఈసారి చెక్కలకు అద్దాలు బిగించి రూపొందించిన షోకేసులు బయటపడ్డాయి.. మరికాస్త వెతగ్గా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కుర్చీలు, బల్లలు కనిపించాయి.. చారిత్రక అన్వేషణల్లో వస్తువులు బయటపడే కొద్దీ సంబరపడే అధికారులు ఇక్కడ మాత్రం వస్తువులు బయటపడే కొద్దీ అవాక్కయ్యారు.. ఎందుకనుకుంటున్నారా..? ఇవన్నీ ఎక్కడో చారిత్రక ప్రదేశంలో దొరికినవనుకుంటే పొరపాటే.. పురావస్తు శాఖ సంచాలకుల కార్యాలయం ‘షెడ్డు’లో బయటపడ్డాయి. విలువైన వస్తువులను గతంలో పనిచేసిన అధికారులు తమ నిర్లక్ష్యానికి బలిచేసిన తీరుతో కొత్త అధికారులు విస్తుపోయారు. వేల ఏళ్లనాటి వస్తువులను మూటకట్టి పడేయడంతో అనేక వస్తువులు ధ్వంసమయ్యాయి. చారిత్రక సాక్ష్యాలు చెదిరిపోయాయి. అన్నీ తెలిసీ గాలికొదిలారు.. తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో ముఖ్యమైన చోట్ల సైట్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఉదా.. ధూళికట్టలో బౌద్ధ స్థూపం లభించింది. అక్కడి తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులతో సైట్ మ్యూజియం ఏర్పాటు చేస్తే, అక్కడికి వచ్చే సందర్శకులకు ఆ చరిత్ర కళ్లకు కడుతుంది. ఇలాంటి సైట్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలంటే ఆయా తవ్వకాల్లో వెలుగుచూసిన వస్తువులు భద్రపరచాలి. కానీ వాటిల్లో కొన్ని ధ్వంసమయ్యాయి. తవ్వకాలు వెలుగుచూసిన నాటి వస్తువులు చిన్న పెంకు కూడా పురావస్తు శాఖ దృష్టిలో విలువైనదే. భవిష్యత్ అధ్యయనాలకు అవి ఆధారమవుతాయి. అవి ధ్వంసమయితే అధ్యయనాలు జరగవు. ఈ విషయం తెలిసీ అధికారులు నిర్లక్ష్యంగా వాటిని గాలికొదిలేశారు. పాతవి లేవనుకొని.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే సమయంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. వేల ఏళ్ల నాటి దేవాలయాలూ మునిగిపోయాయి. ఆ సమయంలో అధికారులు కొన్ని విప్పి మరోచోట పునర్ నిర్మించారు. మరో 100 వరకు దేవాలయాల నమూనాలు గ్రానైట్ రాళ్లతో రూపొందించి మ్యూజియంలో భద్రపరిచారు. ఆ తరహాలో భవిష్యత్లో దేవాలయాలు నిర్మించాలనేది నాటి ఆలోచన. దేవాదాయ శాఖ రూ.లక్షలు వెచ్చించి ఆ నమూనాలకు చెక్కలు, అద్దాలతో షోకేసులు రూపొందించింది. కొంతకాలం తర్వాత ఆ నమూనాలను హైదరాబాద్ హెరిటేజ్ మ్యూజియంకు తరలించారు. అప్పుడు ఆ షోకేసులను షెడ్డులో ఉంచారు. కానీ ఇప్పటి అధికారులకు పాత షోకేసుల విషయం తెలియక భారీ వ్యయంతో కొత్త షోకేసులు ఆర్డరిచ్చారు. కొద్దిరోజుల క్రితం హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు విశాలాచ్చి ఆ షెడ్డులో ఏమున్నాయో చూడాలంటూ సిబ్బందిని పురమాయించడంతో ఏళ్ల తర్వాత తాళాలు తీసి ఒక్కో వస్తువును పరిశీలించి కంగుతిన్నారు. షోకేసులు సహా వెలకట్టలేని పురాతన సంపద చాలా వరకు ధ్వంసమైనట్లు గుర్తించారు. పదిలంగా ఉన్న వాటిని వేరుచేసి అదే షెడ్డులో జాగ్రత్తగా భద్రపరిచే చర్యలు చేపట్టారు. ధ్వంసమైనవాటిని తరలించారు. -
వాణిజ్యానికి పేరు.. పెద్దబొంకూరు!
సాక్షి, హైదరాబాద్: మట్టిని ముట్టుకుంటే నాణేలు తగులుతున్నాయి. ఇప్పటివరకు 30 వేలకు పైచిలుకు లభించాయి. ఏంటా అని తవ్వి చూస్తే 20 మీటర్ల పొడవున్న ఓ భారీ భవంతి ఆనవాళ్లు తేలాయి.. మరికాస్త శోధిస్తే కొన్ని గదుల రూపురేఖలూ కనిపించాయి. ఆ పక్కన మంచినీటి బావులు.. వాటికి నాణ్యమైన ఇటుకల అమరిక.. అక్కడి నుంచి నీటిని తరలించే కాలువలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. వెరసి అదో పట్టణమే. నాణేలు, నిర్మాణాల సరళిని పరిశీలిస్తే అది క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య కాలానివని తేలింది. తొలి శాతవాహన కాలానికి చెందినదని ప్రాథమికంగా రూఢీ అయింది. శాతవాహనుల జాడలు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాంతం పెద్దబొంకూరు. శాతవాహన చరిత్రకు కీలక ఆధారాలు చెప్పే నేల. శాతవాహన కాలంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. అందుకే అక్కడ రోమ్ వంటి విదేశీ ప్రాంతాల నాణేలు లభించాయి. రోమన్ ప్రాంతాలతో శాతవాహనులు పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ వాణిజ్యానికి ప్రధాన కేంద్రమే ఇదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన సామ్రాజ్యంలో మింట్ (నాణేల తయారీ కర్మాగారం)లు ఉండేవి. పూర్వపు మెదక్ జిల్లా కొండాపూర్ ప్రధాన మింట్ కాగా, అనుబంధంగా మరికొన్ని ఉండేవి. అందులో ఇది కూడా ఓ మింట్ అయి ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. 1950– 1965 మధ్య కాలంలో ఇక్కడ తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పుడు ప్రాథమికంగా కొన్నిచోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి గొప్ప చారిత్రక ఆనవాళ్లను గుర్తించింది. కానీ అది ముందుకు సాగలేదు. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యమేంటో తేల్చబోతున్నారు. అప్పట్లోనే భూగర్భ డ్రైనేజీ 2 వేల ఏళ్ల క్రితమే అక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు తేలింది. ఆవాసాల ముందు నుంచి భూగర్భం గుండా మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటై ఉంది. ప్రాకృత భాష, బ్రాహ్మి లిపి వాడుకలో ఉన్నట్టు తేలింది. ఇనుము, వెండి, రాగి లోహాలను వస్తువుల తయారీకి వినియోగించారు. విరివిగా సీసం వస్తువులు వాడారు. రోమ్ వంటి ప్రాంతాల నుంచి సీసం దిగుమతి చేసుకున్నారు. భారీ మట్టి పాత్రల్లో ముడి సీసం చుట్టలు లభించాయి. శాతవాహన చరిత్రకు ఇదో మలుపు ‘తెలంగాణ చరిత్రలో శాతవాహన పాలన కీలకం. అంతకు పూర్వం వివరాలు అస్పష్టం. వాటికి సమాధానం చెప్పేవి పెద్దబొంకూరు వంటి ప్రాంతాలే. గతంలో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. తర్వాత కొత్త ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి భూమి పొరల్లో దాగున్న చరిత్రను వెలుగులోకి తెస్తాం’ –విశాలాచ్చి, హెరిటేజ్ తెలంగాణ సంచాలకులు వెలుగు చూసిన కొన్ని నాణేలు -
గుప్తనిధులపై పెద్దల కన్ను
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాదేదీ దోచుకునేందుకు అనర్హమనే రీతిలో ఇసుక, మట్టి నుంచి రాజధాని భూముల వరకూ చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా చరిత్రాత్మకమైన కోటపై ఉన్న గుడి సంపదపైనా కన్నేశారు. ఆ సంపదను దిగమింగేందుకు ఏకంగా ప్రభుత్వ అధికారులనే రంగంలోకి దింపారు. కర్నూలు జిల్లాలో చెన్నంపల్లి కోటపై ఉన్న పీర్ల గుడికి సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోటపై పెద్ద కడియాల స్వామికి చెందిన పీర్లు దొరికాయని, మొహర్రం సందర్భంగా కోటపైనే గ్రామస్తులంతా అలాయి గుంత తవ్వుకుని పీర్లస్వామిని ఎత్తుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. కోటపై అత్యంత విలువైన గుప్త నిధులు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గుప్త నిధులపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, వాటిని దోచుకునేందుకు అధికారులను సైతం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు చెన్నంపల్లి కోటలో ఈ నెల 13న మొదలైన తవ్వకాలు 8 రోజులుగా అధికారుల పర్యవేక్షణ మధ్య కొనసాగుతున్నాయి. బంగారం, వజ్రాల కోసం అన్వేషిస్తున్నామని మొదట్లో చెప్పిన అధికారులు.. ఇప్పుడు విలువైన ఖనిజాల కోసం అంటూ మాట మారుస్తుండడం గమనార్హం. ఇక్కడ నిధులు వెలికితీస్తామని ఒక ప్రైవేట్ ఏజెన్సీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) దరఖాస్తు చేసుకుందని, అక్కడి నుంచి కలెక్టర్కు ఆదేశాలు రావడంతో తవ్వకాలు సాగిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తవ్వకాలు చేపడుతున్నామని, ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. ఎనిమిది రోజులుగా సాగుతున్న తవ్వకాల్లో ఇప్పటిదాకా ఇటుకలు, ఎముకలు మినహా ఏమీ బయటపడలేదు. అయితే, కోటపై పవిత్రమైన గుడికి సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అంటున్నారు. గుప్త నిధుల కోసం కాదట! గుప్త నిధుల కోసం కాదు, విలువైన ఖనిజాల కోసమే చెన్నంపల్లి కోటలో తవ్వకాలు సాగిస్తున్నట్లు ఆదోని ఆర్డీవో బుధవారం చెప్పారు. మరికొన్ని రోజులు ఈ తవ్వకాలు చేపడతామన్నారు. వాస్తవానికి ఈ కోటలో విలువైన ఖనిజాలు ఉన్నాయని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) గానీ, రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు గానీ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా ఏయే ఖనిజాలు ఉన్నాయో ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టాలి. ముందస్తుగా ఏ విషయం చెప్పకుండానే తవ్వకాలు సాగించడం మైనింగ్ కన్సెషన్ నిబంధనలకు (ఎంసీఆర్) విరుద్ధమే. విమర్శలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే గుప్త నిధుల కోసం కాదు, ఖనిజాల కోసమే అన్వేషణ అంటూ ప్రభుత్వ పెద్దలు నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన గుడి పక్కన తవ్వకాలా? ‘‘మా గ్రామానికి సమీపంలోని చెన్నంపల్లి కోటపై పెద్ద కడియాల స్వామి పీర్లు దొరికాయి. కోటపైనే గుడి, అలాయి గుంత ఉంది. పవిత్రమైన ఈ గుడికి సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండడం దారుణం’’ – మహమ్మద్, చెన్నంపల్లి చరిత్రక కట్టడంపై తవ్వకాలు వద్దు ‘‘మా ఊరి కోటపై అధికారులు తవ్వకాలు చేపట్టడం మంచిది కాదు. గతంలోనూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. అప్పుడు మేం అధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకున్నాం. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ అధికారులే దగ్గరుంచి మరీ తవ్వకాలు జరిపిస్తున్నారు. చరిత్రక కట్టడమైన కోటపై, పీర్లగుడి పక్కన తవ్వకాలు జరపడం తగదు’’ – సుధాకర్రెడ్డి, చెన్నంపల్లి -
చెన్నంపల్లి కోట రహస్యం
-
అనుమానాలెన్నో?
చెన్నంపల్లి కోట.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. ఇక్కడ కొనసాగు తున్న తవ్వకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ అధికారులే నిధుల కోసం వేట సాగించడం చర్చ నీయాంశమైంది. ఇక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు కనిపించకపోవడం.. అధికారులు ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన కీలక నేత ఆదేశాల మేరకు నిధిని కొల్లగొట్టడానికి తవ్వకాలుజరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కర్నూలు, తుగ్గలి : కొన్నేళ్లుగా చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. ఏజెన్సీ ద్వారా తవ్వకాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా దాని పేరు ఏమిటో ఇంత వరకు బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా టీడీపీ ముఖ్య నేత ఆదేశాలతో నిధుల వేట మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, పోలీసు అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఐదో రోజు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డోన్ డీఎస్పీ బాబా పకృద్దీన్ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. వీరే కాక పత్తికొండ, బనగానపల్లె, డోన్ సీఐలు విక్రమసింహ, శ్రీనివాసులు, శ్రీనివాస్, ఏడుగురు ఎస్ఐలు, మహిళా సీఐ ఆదిలక్ష్మి, 150 మంది దాకా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తవ్వకాలపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రకరకాలుగా ప్రచారం... ఐదు రోజులుగా దాదాపు 20 మందికి పైగా కూలీలు రాళ్లను పగులగొట్టి పక్కకు తొలగిస్తున్నారు. నిధి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం ఇరుకుగా ఉండడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. 607 సర్వే నంబరులో 102.54ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంది. దాదాపు 300 అడుగులకు పైగా ఎత్తులో ఉండడంతో యంత్రాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. దీంతో ఎన్ని రోజులైనా కూలీలే తవ్వకాలు చేయాల్సి వస్తోంది. ఈ కోటలో విశేషంగా వజ్ర, వైఢూర్యాలు, బంగారం లాంటి సంపద ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురానికి చెందిన ఓ స్వామీజీతో పాటు, పలు ముఠాల సభ్యులు అనేకమార్లు కోటపై అధునాతన పరికరాలతో పరీక్షించి విశేషంగా సంపద ఉందని గుర్తించారు. చాలా సార్లు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. అయితే ప్రతిసారీ విషయం బయటకు పొక్కు తుండడంతో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ అనుమతులపై స్పష్టత ఇవ్వకుండా అధికారులే రంగంలోకి దిగడంతో చర్చనీయాంశమైంది. నిధులు లేనప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎందుకు తవ్వకాలు చేపడుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే అధికారులు అనుమతులపై ఎవరికీ చెప్పకుండా ఇంత బహిరంగంగా తవ్వకాలు జరిపే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అనుమతులపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. అంతటా ఉత్కంఠ కోటలో నిధి కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం తవ్వకాల్లో కొన్ని టెంకంలాంటి ముక్కలు, ఓ ఎముక బయటపడింది. ఇక నిధి వస్తుందేమోనని అందరూ ఆత్రుతతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు.. పక్కనే ఉన్న బండరాయికి వేసిన సీసం టెంకం స్పష్టంగా కనబడలేదు. పని చేసే చోట రాళ్లు, మట్టి వేగవంతంగా తొలగించేందుకు వీలుకావడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిధి బయట పడుతుందని భావిస్తున్నారు. -
ఆగని వేట, తవ్వకాల్లో పెద్దల హస్తం?
కర్నూలు, తుగ్గలి: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తవ్వకాలు ప్రారంభినట్లు తెలిపారు. అయితే రాత్రి గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని వివరించారు. ట్రెజరీ చట్టం 2–88 ప్రకారం భూమిలో ఉన్న సంపద ప్రభుత్వానికి చెందుతుందన్నారు. కోటలో సంపద ఉందని, దాన్ని వెలికి తీస్తామని ఓ ఏజెన్సీ ప్రభుత్వ అనుమతులు కోసం సీఎం పేషీని కోరిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్నామే తప్ప..మీరు అనుమానిస్తున్నట్లు ఇది ఎవరి కోసమో కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు, గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి.. వారి సమక్షంలో తవ్వకాలు జరుపుతామని చెప్పారు. దీన్నంతటినీ వీడియో తీస్తామన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలపాలని కోరడంతో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్ గ్రామస్తుల తరఫున మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు ఉంటే గ్రామ ప్రజలకు, మీడియాకు చూపించకుండా దొంగ దారిలో తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్డర్ చూపాలని కోరితే అలాంటి రూల్ లేదని ఆర్డీఓ చెప్పడం సరైందికాదన్నారు. చట్టాలు తమకూ తెలుసని, ప్రజలెవరూ అమాయకంగా లేరని అన్నారు. భూమిలో ఉన్న సంపదను తీయాల్సి వస్తే చట్టం ప్రకారం ఆ సంపదలో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి 33 శాతం కేటాయించాలన్నారు. కోటలో సంపద ఉంటే దాంట్లో కొంత పంచాయతీ అభివృద్ధికి కూడా కేటాయించేలా అధికారులు గ్రామసభ తీర్మానం ద్వారా కలెక్టర్కు పంపాలన్నారు. అలా కుదరదని ఆర్డీఓ చెప్పడంతో తవ్వకాలు కూడా జరపనిచ్చే ప్రసక్తే లేదని నబీరసూల్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అధికారులతో వాదించారు. ప్రభుత్వ అనుమతులు చూపకుండా తవ్వకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ఆర్డర్ చూపుతానని ఆర్డీఓ చెప్పగానే.. టీడీపీ నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగమ్మ తనయుడు వెంకటపతి, వారి అనుచరులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఇది తమ గ్రామ సమస్య అని, మీకేం సంబంధం అంటూ గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా అధికారులు గ్రామసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు గంటల తర్వాత మళ్లీ కొంత మంది గ్రామస్తులతో కమిటీ వేసినట్లు చెబుతూ తవ్వకాలు కొనసాగించారు. అధికారులే తవ్వకాలకు పూనుకోవడంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తవ్వకాలు జరిపే వారిలో కొందరు ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. కోట విశిష్టత.. చెన్నంపల్లి గ్రామం వెనుక ఉన్న కొండపై పురాతన కోట ఉంది. ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరని బురుజులు కనిపిస్తాయి. విజయనగర రాజులు, మౌర్యవంశీయులు, గుత్తి పాలకులకు ఈ కోటతో సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొండపై గోడలు, ద్వారాలు, బురుజులు, కోనేర్లు, ఊరువాకిలి ఉన్నాయి. ప్రస్తుతం ఊరువాకిలి పూర్తిగా శిథిలావçస్థకు చేరుకుంది. ఈ కోట నుంచి గుత్తి కోటకు సొరంగ మార్గం ఉందని ప్రజలు చెబుతుంటారు. అంతేకాక కోట ప్రారంభంలో ఉన్న రాతి బండపై నిరంతరం నీళ్లు ఉండటం ఓ ప్రత్యేకత. కోటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతనమైన చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ ఈ కోటలో విశేషంగా బంగారం ఉందని, దాన్ని బయటకు తీసేందుకు సహకరిస్తే ప్రతి ఇంటికీ పిడికెడు బంగారం ఇవ్వొచ్చని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామీజీ సూచనను అనుసరించి కోటపై ఉన్న ఓ రాతి బండ వద్ద నిధి ఉందంటూ రాత్రి సమయాల్లో తరచూ తవ్వకాలు చేసేవారు. చివరకు అప్పటి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందడంతో తవ్వకాలు జరిపిన చోట పోలీసులు పెద్దబండరాయి వేయించారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా గుప్త నిధులు తీయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మాట్లాడుతున్న బీవైరామయ్య, చిత్రంలో పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి దోచుకోవడమే చంద్రబాబు పని– వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య దొరికినంత దోచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న వారు గురువారం చెన్నంపల్లికి వచ్చి అధికారులను నిలదీశారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజుల కోటలో గుప్త నిధులున్నాయని, ఎవరికీ సమాధానం ఇవ్వకుండా అక్రమ తవ్వకాలు జరపడం అన్యాయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచభూతాలను సైతం వదిలిపెట్టలేదన్నారు. మట్టి, నీరు ఇలా వేటినీ వదలడం లేదని విమర్శించారు. చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతులు చూపకుండా.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అధికారులు తవ్వకాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉంటే వాటిని మీడియాకు, ప్రజలకు ఎందుకు చూపలేదని నిలదీశారు. అమాయక ప్రజలపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గుప్త నిధులు కొల్లగొట్టేందుకే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారులు తవ్వకాలు జరుపుతారా అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాదిరిగా గుప్త నిధులను తీయాలని సూచించారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆలయంలోని నిధులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం వచ్చినా ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని వారు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నాగేష్, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాలరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు, ఎంపీటీసీ సభ్యులు రామాంజినేయులు, రంగనాథరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
-
గుప్తనిధుల కలకలం
♦ గోపాల్పూర్ శివారులో గుప్తనిధుల తవ్వకాలు ♦ జలతోపాటు ఓ మూగజీవాన్ని బలిచ్చిన దుండగులు ♦ వారం రోజులుగా తతంగం భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు ఎల్కతుర్తి (హుస్నాబాద్): కష్టపడకుండా డబ్బు వస్తుందనుకున్న దుండగులు పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకు మూగజీవాలను సైతం బలిస్తున్నారు. మిగిలిన అవశేషాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి సంఘటనే మండలంలోని గోపాల్పూర్ శివారులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్పూర్ గ్రామ శివారులో పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆనవాళ్లు ఉండగా ఆ గుట్టను గుడిబండ అని పిలుచుకుంటామని, ఆలయంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కొన్నేళ్ల క్రితమే మాయమైనట్లు గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటున్నారు. కాగా, ఆ ఆలయం ఉన్న గుట్ట కింది భాగంలో ఉన్న ఓ పెద్ద బండరాయి కిందుగా గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గుప్త నిధులను పొందేందుకు ఏదైన మూగజీవాన్ని బలివ్వాలనే కారణంతో కంచర్ల వీరస్వామి అనే రైతుకు చెందిన కోల్యాగను బలిచ్చి, దాని రక్తాన్ని పూజలో వాడుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, మరుసటి రోజు ఆ రైతు పొలం వద్దకు వచ్చి చూసే సరికి కోల్యాగ చనిపోయి ఉంది. దీంతో ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు చేప్పి ఏదైన విషపురుగు కరిచిందేమోనని భావించి అక్కడే ఖననం చేశారు. తర్వాత వారికి పక్కనే పూజలు చేసిన ప్రదేశం కనిపించడంతో గుప్తనిధు ల కోసమే తమ మూగజీవా న్ని బలిచ్చి ఉంటారని బాధితులు భావిస్తున్నారు. గుప్తనిధులు దొరికాయా, లేదా.? సుమారు వారం రోజులుగా ఈ తతంగం జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కోల్యాగ చనిపోవడం, తవ్వకాలు, పూజలు కనిపించడంతో గుప్తనిధుల కోసమే ఈ తతంగమంతా జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, తవ్విన ప్రదేశంలో గుప్తనిధులు దొరికాయా? లేక ఇంకా తవ్వకాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేక తస్కరించుకుని వెళ్లారా? అనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భయాందోళనలో రైతులు.. తమ పంట పొలాలకు ఎలాంటి భయం లేకుండా వెళ్లే రైతులకు దుండగులు క్షుద్రపూజలు నిర్వహించారనే సమాచారంతో ఆ చుట్టుపక్కల ఉండే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని బయటపెడితే తమకేమైన హాని తలపెడుతారేమోనని జంకుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించని గుప్త నిధుల వేట ఎల్కతుర్తి మండలంలో చోటు చేసుకోవడంతో మండలంలో కలకలం రేగింది. ఈ విషయం ఈనోట ఆనోట పోలీసులకు తెలిసింది. గుప్తనిధుల కోసం వచ్చి పూజలు చేసిన దుండగులను పట్టుకుంటారా.? రైతుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
శివయ్య చెప్పినా..శివలింగం చిక్కలేదు
కలలో శివుడు కన్పించాడంటూ ఓ భక్తుడి హంగామా హైవే వద్ద గ్రామస్తుల తవ్వకాలు సాక్షి, జనగామ: ఓ శివభక్తుడు గ్రామస్తులను పరుగులు పెట్టించాడు. శివయ్య తనకు కలలో కనిపించి శివలింగాన్ని బయటకు తీయాలంటున్నాడ ని చెప్పడంతో స్థానికులు తవ్వకాలు చేపట్టారు. ఎంత తవ్వినా శివలింగం కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు శివభక్తుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. జనగామ పట్టణానికి చెందిన మాంసం వ్యాపారి ఎల్.మనోజ్ అలియాస్ మణి గత ఐదేళ్లుగా శివమాల ధరించి పూజలు చేస్తున్నాడు. పెంబర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న టంగుటూరు క్రాస్రోడ్డు వద్ద శివలింగం ఉందని, గత మూడేళ్లుగా శివుడు తన కలలో దర్శన మిస్తూ.. బయటకు తీయాలని వేడుకుంటున్నాడని పెంబర్తి గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మనోజ్ ప్రతి సోమవారం శివలింగం ఉందని భావించిన ప్రదేశంలో పూజలు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో గ్రామ ప్రజాప్రతిని ధులను కలిసిన మనోజ్ శివలింగం విషయాన్ని గుర్తుచేయడంతో సోమవారం పూజలు నిర్వహించిన స్థలంలో జేసీబీ సహాయంతో 20 అడుగుల లోతు తవ్వారు. అయినా శివలింగం కనిపించలేదు. తవ్వకా ల సమాచారాన్ని అందుకున్న పోలీసులు మనోజ్తోపాటు సర్పంచ్ సిద్ధిలింగం, ఎంపీటీసీ సభ్యురాలి భర్త కిషన్, కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంక ట్లను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగిన ప్రదేశం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఓం నమశివాయ అంటూ శివనామ çస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిం ది. జేసీబీతో తవ్వకాలకు ముందు భక్తుడు మనోజ్ పూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో ఆయనకు పూనకం రావడంతో ప్రజలు, పులకించిపోయారు. కానీ, 20 అడుగులు తవ్వినా ఫలితం కానరాకపో వడంతో వెనుదిరిగారు.ఈ క్రమం లో హైదరాబాద్ – జనగామ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరా యం కలిగింది. దీంతో పోలీసులు సంఘటన స్ధలాని కి చేరుకొని స్థానికులను అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించారు. సంఘటన స్ధలాన్ని జనగామ డీసీపీ వెంకన్న, ఏసీపీ పద్మనాభరెడ్డి, సీఐ శ్రీనివాస్ చేరుకొ ని గుంతను పూడ్చివేశారు. ప్రజలు మూఢన మ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
నర్మెటలో కొనసాగుతున్న తవ్వకాలు
వెలుగుచూసిన ప్రాచీన మానవుడి అస్థికలు నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఆదిమమానవుడి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మట్టి కుండలు, రాతి పనిముట్లను కనుగొన్న అధికారులు.. గురువారం ప్రాచీన మానవుడి అస్థికలను వెలికితీశారు. ఇందులో 1.80 సెం.మీ ఎముకతోపాటు, సుమారు పది వరకు చిన్నచిన్న ఎముక ముక్కలు ఉన్నాయి. ఆయుధాలను పదును పెట్టేందుకు ఉపయోగించే రాతి బండ కూడా దొరికింది. మెన్హీర్ వద్ద సుమారుగా పది అంగుళాల వరకు మట్టిని తొలగించారు. నాలుగు చోట్ల ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ తవ్వకాల్లో భాగంగా ఇప్పటికే మట్టి కుండలు, మృణ్మయ పాత్రలు, వేటకు ఉపయోగించే రాతి మొన, ఉలి లభించాయని చెప్పారు. మట్టి కుండల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలుస్తోందన్నారు. పాలమాకులలో నాలుగు రోజులుగా రెండు సమాధులను తవ్వుతున్నామని, వారం రోజుల్లో మరిన్ని అవశేషాలు బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. తవ్వకాలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజల భారీగా తరలివస్తున్నారు. సిద్దిపేట ఏసీబీ నర్సింహారెడ్డి, డీఆర్డీఓ సత్యనారాయణరెడ్డిసహా, పలువురు అధికారులు తవ్వకాలను ఆసక్తిగా తిలకించారు. -
మెట్లబావిలో తవ్వకాలు
ఖిలా వరంగల్ : గుప్త నిధుల కోసం మెట్లబావి లో తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 19వ డివిజన్ శివనగర్లో కాకతీయుల కాలం నాటి మెట్ల బావి ఉంది. బావి మొదటి అంతస్తు ఈశాన్య భాగంలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. భారీ రాళ్లు కదలకపోవడంతో మిషన్తో డ్రిల్ చేసి బాంబులతో పేల్చేశారు. పునాది రాయిని బాంబులతో పేల్చారు. ఆ రాయి కిందే గుప్తనిధి దొరికి ఉండవచ్చని స్థానికులు అనుమాని స్తున్నారు. తవ్విన చోట పైఫ్లోర్కు ఐరన్ కొండి ఉండడం వల్ల కాకతీయుల నిధులకు ఇదే సంకేతమని దుండగులు భావించి ఈ ఘటనకు పాల్పడినట్లు అనుకుంటున్నారు. పోలీసుల నిఘా లేకనే ఇలాంటì æఘటన చోటు చేసుకుంద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చారిత్రక బావిని కాపాడాలని కోరుతున్నారు. -
ఎవరికి వారే..జనం బేజారే..!
బంజారాహిల్స్: విద్యుత్ అండర్గ్రౌండ్ కేబుల్ పనుల్లో శాఖల మధ్య సమన్వయం కుదరక.. పనుల్లో జాప్యం జరుగుతోంది. చలికాలంలో చేయాల్సిన పనులను వర్షాకాలంలో చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డుతో పాటు యూసుఫ్గూడ ఆర్బీఐ చౌరస్తా, శాలివాహన నగర్ ప్రాంతాల్లో కేబుల్ తవ్వకాలతో రహదారులు శిథిలమయ్యాయి. ఎటు చూసినా గోతులతో మృత్యుకుహరాలుగా మారాయి. రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్న అధికారులు ఇప్పటికీ సగం పనులు కూడా పూర్తిచేయకపోవడంతో రహదారులు బురదమయమై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 15న శ్రీనగర్కాలనీ మెయిన్ రోడ్డులో 132 కేవీ ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులు ప్రారంభించిన అధికారులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ ఎమ్మార్టీ ఇంజినీర్లకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. గత నెల 20న పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఎక్కడి గోతులు అక్కడే ఉన్నాయి. రోడ్లపై మట్టి పేరుకుపోవడంతో వాననీరు నిలిచి బురదమయమవుతోంది. వారం రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు చెబుతుండగా, రెండు వారాలు పడుతుందని ట్రాన్స్కో ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ మాత్రం ఇప్పట్లో పూర్తి కాదని చేతులెత్తేశాడు. ఇలా ఎవరికివారు పొంతన లేకుండా సమాధానాలు చెబుతుండటంతో స్థానికులు ఆయోమయానికి లోనవుతున్నారు. ట్రాన్స్కో ఇంజినీర్లతో చర్చించాం శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డుతో పాటు శాలివాహననగర్ రోడ్డులో 132 కేవీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ లైన్ పనుల్లో జాప్యంపై ట్రాన్స్కో డీఈ వేణుగోపాల్, ఏఈ సత్యనారాయణలతో చర్చించాం. పలుచోట్ల రాయి పడటంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదని వారు చెబుతున్నారు. ఇకపై జాప్యాన్ని సహించేది లేదని వారిని హెచ్చరించడంతో వారం రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. - జీహెచ్ఎంసీ ఎంఆర్డీ ఈఈ అశోక్రెడ్డి రెండు వారాల్లో పూర్తి చేస్తాం కేబుల్ పనుల్లో పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి.రాయి రావడంతో జాప్యం జరుగుతున్నది. రెండు వారాల్లో పనులు పూర్తి చేస్తాం. కొరియాకు చెందిన ఎల్జిన్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ ఈ పనులను నిర్వహిస్తోంది. జాయింట్ బేలు చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాయి వస్తుండటంతో జీహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. - సైట్ సూపర్వైజర్ నాగసురేష్ వారం రోజుల్లో పూర్తి చేస్తాం అండర్గ్రౌండ్ 132 కేవీ ఎలక్ట్రికల్ కేబుల్ పనులు నాలుగు భాగాలు విభజించడం జరిగింది. ఇప్పటికీ మూడు స్కెచ్లు పూర్తి చేశాం. ఇంకో స్కెచ్లో రాయి రావడంతో జాప్యం జరుగుతున్నది. వారం రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాము. - ట్రాన్స్కో డీఈ వేణుగోపాల్ -
'రంగుల' కలలు !
* అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రంగురాళ్ల వేట * దాచేపల్లి మండలం శంకరాపురం అడవుల్లో యథేచ్ఛగా తవ్వకాలు * పగలు, రాత్రి తేడా లేకుండా 20 అడుగుల లోతు సొరంగాలు * హైదరాబాద్ దళారీల ద్వారా రాజస్థాన్కు అక్రమ రవాణా * పట్టనట్టు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు * తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు ఓ కూలీ మృతి ? సాక్షి, గుంటూరు : అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు అటవీ ప్రాంతాలపైనా కన్నేశారు. కడప, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో అక్కడి అధికార పార్టీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతుండగా, ఇక్కడ ఆ అవకాశం లేక తెలుగు తమ్ముళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ వంటి ప్రాంతాల్లో అటవీ భూముల్లో రంగురాళ్ల వేట సాగిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొందరు దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్కు అక్రమ రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సైతం ఆ వైపు తిరిగి చూడడం లేదు. నెలనెలా మామూళ్లు తీసుకుంటూ తమకేమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారు. అధికార పార్టీనేతలు దాచేపల్లి మండలం భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాల నిరుపేద కూలీలను తవ్వకాలకు వినియోగిస్తూ వారికి కొద్దిగా ముట్టజెబుతూ భారీఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి తవ్వకాలు... దాచేపల్లి మండలం శంకరాపురం సమీప అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే అటవీ ప్రాంతంలో రంగు రాళ్ల వేట జరుపుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతూ వేట సాగిస్తున్నారు. రంగు రాళ్ల ముడిరాయి అధికంగా దొరుకుతుండడంతో రోజురోజుకు తవ్వకాలను ఉధృతంం చేస్తున్నారు. ఇక్కడ రంగురాళ్లతోపాటు, బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతిరాళ్లు సైతం దొరుకుతుండడంతో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నేతలు హైదరాబాద్కు చెందిన కొందరు దళారుల ద్వారా రంగు రాళ్ల ముడిసరుకును ముక్కలుగా చేసి రాజస్థాన్కు ఎగుమతి చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం అక్కడి పోలీసు అధికారులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులందరికీ తెలిసినప్పటికీ నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అటవీ ప్రాంత తండాల్లో మంచినీరు బోరువేసుకోవాలన్నా నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టే అటవీశాఖ అధికారులు రంగురాళ్ల తవ్వకాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.15 నుంచి రూ.20 లక్షల విలువచేసే రంగురాళ్ల మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందిగా, దాన్ని బయటకు పొక్కనీయకుండా అంత్యక్రియలు కానిచ్చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. స్పెషల్ ఫోర్స్ను నియమించాం.. దాచేపల్లి మండలం శంకరాపురం వద్ద అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకా లు జరుగుతున్న విషయం వాస్తవమే. రాత్రి పూట అధిక సంఖ్యలో కూలీలు అటవీ ప్రాంతానికి చేరుకుని తవ్వకాలు జరుపుతున్న విషయం నా దృష్టికి వ చ్చింది. భారీస్థాయిలో గుంతలు ఏర్పడడంతో పొక్లయిన్ల ద్వారా వాటిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానిక పోలీసుస్టేషన్లో దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. మావైపు నుంచి కూడా స్పెషల్ ఫోర్స్ను నియమించి రంగురాళ్ల తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. - కె. మోహన్రావు, డీఎఫ్వో (టెరిటోరియల్) -
బతుకులు.. కూలుతున్నాయ్!
► ఉచిత ఇసుక పాలసీతో ఎడా పెడా తవ్వకాలు ► ప్రమాదకర సొరంగాల్లో తోడేస్తున్న వైనం ► ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆరుగురి కూలీల మృతి ► బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో మరో ఇద్దరు జలసమాధి పలమనేరు : ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసినప్పటి నుంచి ఆ తవ్వకాలు ఊపందుకున్నాయి. కూలీలకు విఫరీతమైన డిమాండ్ ఏర్పడింది. అధిక మొత్తంలో కూలీ డబ్బులిస్తామని ట్రాక్టరు యజమానులు ఆశచూపుతున్నారు. ప్రమాదకర సొరంగాల్లో పనులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక దిన్నె లు మీదపడి పలువురు కూలీలు మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే పలమనేరు ప్రాం తంలో ఆరుగురు మృతిచెందారు. బుధవా రం బెరైడ్డిపల్లె సమీపంలోని పెద్ద చెరువులో ఇద్దరు కూలీలు జలసమాధి అయ్యారు. ఎటు చూసినా ఇసుక త వ్వకాలే... పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య నదితో పాటు పలు చెరువుల్లో ప్రస్తుతం భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. కొత్త విధానంతో వాహనాలను ఉపయోగించరాదు కాబట్టి కూలీలకు డిమాండ్ ఏర్పడింది. నాణ్యత కల్గిన ఇసుక కోసం వీరు 15 అడుగుల దాకా అత్యంత ప్రమాదకరంగా సొరంగాలు తవ్వి మరీ ఇసుక తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని నాగమంగళం, రామాపురం, బొమ్మిదొడ్డి, గంగవరం మండలంలోని కౌండిన్యనది, పంజాణి మండల సరిహద్దులోని పలు చెరువులు, బెరైడ్డిపల్లె మండలలోని చెరువులు, వీకోట మండలంలోని పాలేరు నదుల్లో కూలీలు సొరంగాల్లా తవ్వి ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుకను తోడుతున్నారు. మూడు పూటలా భోజనం, రూ.500 కూలీ ఇసుక తవ్వే కూలీలకు మూడు పూటలా భోజనం పెట్టి రూ.500 దాకా ఇస్తున్నారు. అధిక కూలీలకు ఆశ పడిన కూలీలు ఈ ప్రమాదకర పనులను చేస్తున్నారు. ఈ మధ్యనే బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో రాత్రి పూట ఇసుకను తోడుతూ ఓ యువకుడు ఇసుక దిన్నె కింది పడి మునిగిపోయాడు. అయితే అక్కడున్న ఇతర కూలీలు అతన్ని కాళ్లుపట్టి వెంటనే లాగేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వ ఆదేశాలు గాలికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మీటర్ల కంటే లోతు ఇసుక తవ్వరాదు. కానీ ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. చెరువులు, వాగులు, వంకల్లో ఇసుకను తోడుతుంటే ఎంత లోతు తవ్వారు, పనులు ఎలా చేస్తున్నారని పర్యవేక్షించేవారే లేకుండా పోయారు. దీనిపై ఏ శాఖకు పర్యవేక్షణ ఉందో కూడా తెలియదు. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రతి మండలంలోనూ కొన్ని రీచ్లను గుర్తించి వాటి నుంచే ఇసుకను తోడాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటి నుంచి కాకుం డా అక్రమార్కులు కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు, రైతుల సెటిల్మెంటు భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు. ఉన్నట్టుండి కూలిపోతాయి ముఖ్యంగా చెరువుల్లో ఇసుక తోడడం చాలా ప్రమాదకరం. మొదట చెరువులోని బంకమట్టిని తొలగిం చాలి. ఆపై లోతుగా సొరంగాలు తవ్వుకుంటూ వెళ్లాలి. ఇలాంటి సమయంలో పై నున్న ఇసుక దానిపై ఉండే బరువైన మట్టి కారణంగా ఇసుక దిన్నెలు సెకన్ల వ్యవధిలో జారిపోతాయి. దీంతో కింద ఉండే కూలీలు అక్కడే సమాధి కావాల్సిందే. కనీసం తప్పించుకోవడానికీ సమయం ఉండదు. బుధవారం బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో జరిగిన ప్రమాదం కూడా ఇలాగే సంభవించింది. -
తవ్వేసి.... చంపేసి
►అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ►తిరుపతిలో భవనం కూలి ►విద్యార్థిని మృతి మరొకరికి తీవ్ర గాయాలు ►అధికారుల నిర్లక్ష్యంతో కూలిన భవనం ►బాలిక మృతి మరో యువతికి తీవ్రగాయాలు ►తిరుపతి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం ►బలైపోయింది. అభివృద్ధి పనుల పేరుతో నగరంలో కాలువల పునఃనిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సున్నపు వీధిలో ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వేశారు. కొన్ని చోట్ల భవనాలకు వేసిన పునాదులూ ఊడిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఓ చోట పాత భవనం పేకమేడలా కూలిపోయింది. దీని శిథిలాల కింద పడి ఓ విద్యార్థిని ప్రాణాలు విడిచింది. మరో విద్యార్థిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. తిరుపతి క్రైం: తిరుపతి నగర పాలక సంస్థ కాలువ నిర్మాణానికి తవ్విన గుంతల వల్ల బుధవారం సున్నపు వీధిలో భవనం కూలిపోయింది. దాని కింద పడి బాలిక మృతిచెందింది. ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణ కథనం మేరకు.. తిరుపతి సున్నపువీధిలో మురుగు కాలువలు నిర్మించేందుకు నెల రోజులుగా జేసీబీతో గుంతలు తవ్వుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి సున్నపు వీధిలో కాలువ పనులను ఇంటి పునాదుల పక్కనే చేపట్టారు. అదేవీధిలో రెండు అంతస్తుల భవనంలో లత కూతుళ్లు గిరీష్మ(18), నిహారిక (15), వారి సమీప బంధువువైన బాలిక ఉంటున్నారు. కింద ఫ్లోర్లో పండ్ల దుకాణాం ఉంది. బుధవారం తెల్లవారుజామున భవనం ఒక పక్కకు ఒరిగిపోయింది. భవనంపై ఉన్న లతను, ఆమె సమీప బంధువుల బాలికను స్థానికులు నిచ్చెన ద్వారా కిందకు దించారు. అకస్మాత్తుగా ఆ పాతభవనం కూలిపోయింది. భవన శిథిలాల కింద గిరీష్మ, నిహారిక ఇరక్కుపోయారు. సమాచారం అందుకున్న ఈస్ట్ సీఐ రాంకిషోర్, ఎస్ఐ ప్రవీణ్కుమార్, అగ్నిమాపక అధికారి శంకర్ ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో భవన శిథిలాలను తొలగించారు. గిరీష్మ, నిహారికను రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహారిక మృతిచెందింది. ఆమె తండ్రి గతంలో చనిపోయాడు. తల్లి లత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటోంది. గిరీష్మ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిహారిక ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. నిహారిక మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గాయపడిన గిరీష్మాను మొదటగా రుయాకు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత వేలూరు స్విమ్స్కు తరలించారు. భవనం వెనుక నివాసముంటున్న మృతురాలు నిహారిక తాతయ్య మునికృష్ణయ్య, నానమ్మ పద్మావతి అందులోనే ఇరుక్కుపోయారు. అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది శిథిలాలను తొలగించి వృద్ధులను కాపాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, నగర పాలక కమిషనర్ వినయ్చంద్, అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్జెట్టి, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి, అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై అగ్నిమాపక, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. శిథిలాలను తొలగించి వెంటనే కాలువలో కాంక్రీట్తో నింపాలని అధికారులు ఆదేశించారు. పురాతన భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలి చెప్పారు. సంఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదికను హోంమంత్రి చిన్నరాజప్పకు పంపించాలని అధికారులు ఆదేశించారు. మృతుల కుటుంబాలను అదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. నగర పాలక సంస్థ అధికారులు ఎటువంటి సూచన లేకుండా లోతుగా కాలువలు తవ్వడంతోనే భవనం కూలిపోయిందని స్థానికులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొండవీడుకొండల్లో విధ్వంసం
► గుప్తనిధుల కోసం దుండగుల బ్లాస్టింగ్ ► పురాతన బావిలోపల 30 అడుగుల మేర తవ్వకాలు ► అడుగుభాగం నుంచి భారీ సొరంగాలు ఏర్పాటు ► మందుగుండు సామగ్రితో భావిలోపల భారీ రాళ్లు పేల్చివేత ► మూడు నెలల నుంచి నిర్విరామంగా తవ్వకాలు యడ్లపాడు: యడ్లపాడు మండలం కొండవీడు కొండలు ప్రారంభయ్యే బోయపాలెం - సంగం పరిధిలోని రెండు కొండల సంగమం వద్ద తాజాగా భారీ తవ్వకం బయటపడింది. బోయపాలెం నుంచి టెక్స్టైల్పార్కు భూముల మీదుగా సుమారు 3 కిలోమీటర్లు ప్రయణిస్తే కొండవీడు కొండ అంచులను చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడుస్తూ వెయ్యి అడుగుల లోపలకు వెళితే రాజుల కాలం నాటి బావిలోపల 30 అడుగుల లోతులో తవ్వకం కనిపిస్తుంది. రెండు వైపులా ఎత్తై కొండలపైనుంచి వచ్చే వర్షపునీరు కొండవాగులా వచ్చే మార్గం గుండా అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. మట్టిదిబ్బలు, గడ్డిదుప్పులు, రాళ్లగుట్టలు, దట్టంగా ఉన్న అడవి చెట్ల మధ్యగా మార్గం చేసుకుని ఈ పురాతన బావిని గుప్తనిధుల దుండగులు తవ్వేశారు. మూడు నెలల నుంచి కొందరు ఈ తవ్వకాలు చేస్తున్నట్లు గొర్రెలు, గేదెల కాపరులు చెబుతున్నారు. బావి కింద నుంచి సొరంగ మార్గాలు... చుట్టూ 10 అడుగుల కైవారంతో ఉన్న బావి లోపల 30 అడుగుల లోతులో తవ్వారు. ఇందులో భారీ రాళ్లను పగులగొట్టి సుమారు 8 ట్రక్కుల వరకు ఒడ్డున పడేశారు. రాళ్లను పగులగొట్టేందుకు మందుగుండు సామగ్రిని వినియోగించి నట్టు తెలుస్తోంది. బావి అడుగు నుంచి రెండు వైపులా మనిషి నిలబడి వెళ్లేంత సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సొరంగం రాజుల కాలం నాటిదా..లేక వీరు కొత్తగా తవ్వుతున్నదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది కొత్తపాలెం కొండల్లోని భారీ రాళ్లకింద 40 అడుగుల సొరంగ చేశారు. అప్పట్లో మూడు నెలలు తవ్వకాలు చేయగా పురాతన పంచలోహ విగ్రహాలు గుప్తనిధుల చోరులకు లభించినట్లు కలకలం రేగింది. చుట్టూ మరో నాలుగు చోట్ల తవ్వకాలు ... అనేక ఆనవాళ్లు ఈ బావిని తవ్వక ముందే చుట్టూరా నాల్గు చోట్ల ఇదే విధంగా తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. చివరకు బావిని ఎంచుకుని తవ్వకాన్ని నిర్విరామంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న బావిచుట్టూ నాల్గువైపులా ప్రమిదలు, పూజలు చేసినట్లు పూలు, రోజ్వాటర్, సుగంధ ద్రవ్యాలు వినియోగించిన వస్తువులు ఉన్నాయి. బావిలోపల గడ్డపలుగు, పార ఉండగా, ఒడ్డున కూడా మరో రెండు ఉన్నాయి. వాటి పక్కనే కొండరాళ్లను బ్లాస్టింగ్ చేసే మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. కొద్దిదూరంలో పూజలు చేసిన ముగ్గులు, రక్తపు చారికలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఖాళీగోతాల్లో హోటల్ నుంచి పార్శిల్ తెచ్చుకున్న భోజన ప్యాకెట్లు, విస్తళ్లు, కిరోసిన్, వాటర్బాటిల్స్, ఇతర వస్తువులు అనేకం ఉన్నాయి. తవ్వకాలను సాహసంతో ఛే దించిన బోయపాలెం యువత... కొండవీడు కొండల్లోకి ఆకులు, వనమూలికల కోసం అంటూ పలుగు, పారలతో కొందరు వ్యక్తులు తరచూ వెళ్లడం బోయపాలెం యువకులు గుర్తించారు. అనుమానం వచ్చిన యువకులు ఎంతో సాహసంతో ఆ ప్రాంతానికి వెళ్లి జరిగినదంతా తెలుసుకున్నారు. ఇదే సమాచారాన్ని మీడియా, పోలీసులు, ఫారెస్టు అధికారులకు తెలిపారు. ఎస్ఐ ఎం. ఉమామహేశ్వరరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముందుగా తవ్విన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులపై అనుమానాలు... గుప్తనిధుల దుండగులు అటవీ శాఖ సిబ్బంది, స్థానికులతో సంబంధాలు పెట్టుకుని తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భావి తరాలకు చరిత్ర లేకుండా చేస్తున్న దుండగులను, వారికి సహాయకారాలు అందిస్తున్న వారిని పట్టుకుని భవిష్యత్తులో అక్రమ తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలు
మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల మండలం ఉర్లోవకొండ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన పురావస్తు తవ్వకాలు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పది మంది సభ్యుల బృందం ఈ తవ్వకాలలో పాలుపంచుకుంటోంది. ఎందుకోసం ఈ తవ్వకాలన్న విషయమై సమాచారం బయటకు రాలేదు. ఖనిజాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. -
తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్న రైతులు
రణస్థలం/లావేరు: రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రణస్థలం, లావేరు మండలాల్లో అధికారులు చేపట్టిన తోటపల్లి కాలువ తవ్వకాలను గురువారం అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్వానికి వచ్చే పంటల్లో కాలువల తవ్వకంపై మండిపడ్డారు. రణస్థలం మండలంలోని రణస్థలం రెవెన్యూ, లావేరు మండలంలోని తాళ్లవలస రెవెన్యూ పరిధిల్లో పొక్లెయిన్లతో చేపట్టిన తవ్వకాలను రణస్థలం, రావివలస రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న లావేరు మండల తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఎస్సై రామారావులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శివారు భూములకు సాగునీరందించేందుకు చేపట్టే కాలువ తవ్వకాలకు సహకరించాలని కోరారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు పక్వానికి వచ్చే దశలో ఉన్నాయని, ఇప్పుడు వాటిని నాశనం చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. భూము లు ఏ మేరకు పోతున్నాయి, ఎంత నష్టపరిహారం అందజేస్తారన్నది తెలియజేయకుండా పనులు చేపట్టడాన్ని తప్పుబట్టారు. స్థానికంగా భూములు లేని టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా పనులకు పూనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.అధికారులు నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. పక్కా సర్వే, పరి హారం లెక్క తేలాకే పనులు చేపట్టాలని రణస్థలం, తాళ్లవలస గ్రామాలకు చెందిన రైతులు పిన్నింటి అప్పలనాయడు, సత్యం, పి.పాపినాయుడు, కుప్పిలి అప్పారావు, నీలకంఠం, లక్ష్మణరావు తదితరులు కోరారు. ఎకరాభూమి నష్టపోతున్నా... రావివలస గ్రామంలో ఉన్న ఎకరా భూమి తోటపల్లి కాలువకు పోతోంది. ఇక్కడ భూమిని సాగుచేయడానికి బోరుకూడా వేశాను. ఇప్పుడు ఎకరాభూమితో పాటు బోరుకూడా నష్టపోతున్నాను. ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియజేసి కాలువల తవ్వకాలు జరపాలి -పిన్నింటి సత్యనారాయణ, రైతు, రణస్థలం పంట చేతికొచ్చే సమయంలో...కాలువకు 40 సెంట్లు భూమి పోతోంది. ఇందులో ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేస్తున్నా. పక్వానికి వచ్చింది. ఈ సమయంలో కాలువ తవ్వితే పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది. పరిహారం ఇచ్చాకే పనులు జరపాలి -పిన్నింటి అప్పలనాయుడు, రైతు, రణస్థలం -
పజ్జూరులో త్వరలో తవ్వకాలు
పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తిప్పర్తి: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని, త్వరలో తవ్వకాలు చేపట్టనున్నామని పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తెలిపారు. గురువారం ఆయన పజ్జూరులో పాటివారి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని, రైతులు, గ్రామస్తుల సహకారంతో నాటి ఆధారాలను వెలికితీయనున్నట్లు తెలిపారు. ఒకటి, రెండో యుగం కాలం నాటి ఆనవాళ్లు లభించడంతోపాటు 10, 12వ యుగం నాటి ఆలయం కూడా ఇదే గ్రామంలో ఉందని, ఈ తవ్వకాలతో మధ్యకాలంలో ఉన్న చరిత్ర, ఆధారాలు బయటపడే అవకాశముందని చెప్పారు. ఆయన వెంట పురావస్తుశాఖ అధికారులు నాగరాజు, భానుమూర్తి, తదితరులు ఉన్నారు. -
ఇసుక బంద్!
ఇసుక వినియోగదారులకు 20 రోజులు ఇబ్బందులు తప్పవు. ఇసుక నూతన విధానం అమలులో భాగంగా ప్రభుత్వం శుక్రవారం నుంచి జిల్లాలోని అన్ని రీచ్లను మూసివేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త విధానంలో ఇసుక కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూపొందించిన విధివిధానాల మేరకు రీచ్లను వేలం నిర్వహించనున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించిన వ్యాపారులకు రీచ్ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఇసుక ధరలను వ్యాపారులు పెంచేశారు. గుంటూరు: ఫిబ్రవరి ఒకటి నుంచి ఇసుక నూతన విధానం అమలులోకి రానున్న దృష్ట్యా విక్రయాల కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి చలానాలు కట్టించుకోవద్దని రాష్ట్ర గనుల శాఖ డెరైక్టర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే విక్రయాలను పర్యవేక్షిస్తున్న సెర్ఫ్ సీఈవో ఆరోగ్యరాజు కూడా చలానాలు కట్టించుకోవద్దని అన్ని మీ-సేవ కేంద్రాలను ఆదేశించారు. ఇప్పటికే చలానాలు కట్టిన కొనుగోలుదారులకు ఈనెలాఖరు వరకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న రీచ్లను ఫిబ్రవరి 1 నుంచి బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చే ఇసుక వ్యాపారులకు అప్పగించనున్నారు. తిరిగి భూగర్భగనుల శాఖకు... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఇసుక అమ్మకాల బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్)కు అప్పగించింది. తిరిగి ఈ నెల 2న ఇసుక అమ్మకాలు, పర్యవేక్షణ బాధ్యతలను భూగర్భగనుల శాఖకు అప్పగిస్తూ నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రీచ్లను డ్వాక్రా మహిళలు చేపట్టినా, తెర వెనుక టీడీపీ నాయకులే దందా నిర్వహిస్తుండడంతోప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది గమనించిన ప్రభుత్వం పాత విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసి కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. గతంలో రీచ్లకు బహిరంగ వేలం నిర్వహించడం, నదీ తీరంలో ఇసుక మేటలు వేసిన భూముల్లో వాటి యజమానులు లేదా ఇసుక వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఇసుక విక్రయాలు సాగించేవారు. తాజాగా భూముల్లో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం భూ యజమానికి, 75 శాతం ప్రభుత్వానికి వచ్చేలా ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఈ రెండు విధానాలను ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇసుక అమ్మకాలు నిలిపివేత ... ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి, ఉండవల్లి, అమరావతి, దుగ్గిరాల మండల గొడవర్రు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లను మూసివేశారు. -
‘నిక్షేపం’గా దోపిడి
మూడు రాష్ట్రాల కూడలి కుప్పంలో క్వారీల పేరుతో అధికారపార్టీ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకే పర్మిట్తో టన్నుల కొద్ది బండరాయిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజనాకు భారీగా గండిపడుతోంది. తెలుగుదే శం నేతల అక్రమాలపై సొంత పార్టీ వారే ఫిర్యాదు చేసినా.. సీఎం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150 క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే చెప్పుకున్నారు. దీనిపై సీఎం, ఆయన తనయుడికి ఫిర్యాదు చేసినా పట్టించులేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సదరు నాయుకుడికి పార్టీలో ప్రమోషన్ రావటంతో స్థానిక నాయకులు కివ్మునకుండా ఉండిపోయూరు. ఎగుమతులతో ఎదిగి.. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. నేలను తవ్వి, రారుుని బ్లాకులుగా తీసి ఎగువుతులు చేస్తున్నారు. వీటికితోడు బ్లాకులను పూర్తిస్థారుులో ప్రాసెస్ చేసి ఎగువుతులు చేసే పరిశ్రవులు జిల్లాలో వందకు పైగా ఉన్నారుు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్మికుల జీవితాలు.. గాల్లో దీపాలు క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్ఐ సదుపాయూలు లేవు. ఇదిగో సాక్ష్యం.. శాంతిపురం వుండలంలోని కోనేరుకుప్పం వద్ద ఉన్న ఓ క్వారీలో మేలో జరిగిన ప్రవూదంలో ఒడిశాలోని బరంపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వుతి చెందాడు. వుళ్లీ ఇదే క్వారీలో ఈ నెల 24న తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, అదే రాష్ట్రంలోని విల్లుపురాని కి చెందిన వురొకరు తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారు లు, పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
లక్సెట్టిపేట: అదిలాబాద్ జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక గోదారి రోడ్డులోని మసీదు వెనక భాగంలో నివాస ముంటున్న ఎం.డీ. సలీం ఇంట్లో గత రెండు రోజులు గా రాత్రి పూట చప్పుడు వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులకు రంగంలోకి దిగారు. సలీం ఇంట్లో పరిశీలించగా.. ఇంటి మధ్య భాగంలో పెద్ద గొయ్యి కనిపించింది. గొయ్యి ఎందుకు తీసారో పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో సలీం కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లలో గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ పాడబడ్డ ఇంట్లో 9 మంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా స్థానికులుగా పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
ఉరవకొండ: విలువైన వస్తువులు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలోని గోపురంపైన ఉన్న కలశాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామ శివారులోని పర్వతేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన అర్చకుడు ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకురావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. పురాతన ఆలయం కావడంతో గుప్తనిధులు లభిస్తాయనే అనుమానంతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. -
పుల్లూర్లో కొనసాగుతున్న తవ్వకాలు
వేటాడే పరికరం లభ్యం సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూర్ గ్రామ శివారులో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు కొనసాగుతున్నాయి. బుధవారం పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తవ్వకాలను పరిశీలించారు. బృహత్శిలా యుగపు సమాధుల తవ్వకాల్లో భాగంగా జంతువులను వేటాడే పరికరం (ఈటె) కనిపించింది. ఇది ప్రస్తుతం 61 సెంటీమీటర్ల మేర బయటకు కనిపిస్తోంది. అది సుమారుగా మీటరు లోతున ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భోజనం చేసే బౌల్స్, ఉలి (చీజిల్), మృణ్మయ పాత్రలు, ఇతర ఇనుప పనిముట్లు లభ్యమవుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి. ప్రేమ్కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పరిశీలిస్తున్నారు. -
ఇసుక సిరి
రూ.5 కోట్లకు చేరిన అమ్మకాలు రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం 16 రీచ్లలో కొనసాగుతున్న తవ్వకాలు ఫలిస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖ కృషి విశాఖపట్నం: జిల్లాలో 21 రీచ్లలో 3,17,848 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నవంబర్లో ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టినప్పటికీ డిసెంబర్లో ఊపందుకున్నాయి. జిల్లాలోని దార్లపూడి, జి.కోడూరు, గజపతినగరం రీచ్లలో అందుబాటులో ఉన్న సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు. ఇక మిగిలిన 16 రీచ్ల ద్వారా ఇప్పటి వరకు 53 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు సాగించారు. ఇప్పటి వరకు 4,500కు పైగా ఆర్డర్లు లభించాయి. వాటిలో సగానికి పైగా మీ-సేవ కేంద్రాల ద్వారానే వచ్చాయి. సుమారు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను పూర్తిగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు విక్రయించగా, మిగిలిన 63 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డిఫెన్స్, నేవీ, ఎన్టీపీసీ, స్టీల్ప్లాంట్, అన్రాక్, సాన్వీరా, క్రెడాయ్లతో పాటు ప్రభుత్వ సివిల్ పనుల కోసం కేటాయించారు. వీటి అమ్మకాల ద్వారా 4.36 కోట్లు ఆదాయం రాగా, రవాణా ద్వారా జిల్లాకు మరో రూ.65 లక్షల ఆదాయం సమకూరినట్టు లెక్కతేల్చారు. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో ఏనాడు ఈ స్థాయిలో ఇసుక అమ్మకాల ద్వారా జిల్లాకు ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్యే అమ్మకాలుండేవి. పదేళ్ల తర్వాత డీనోటిఫై చేయడంతో జిల్లాలో నేడు పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. మరొక పక్క రీచ్ల నుంచి కొనుగోలు చేసే ఇసుక పక్కదారి పట్టకుండా ఉండేందుకు సొంత ట్రాన్స్పోర్టేషన్కు శ్రీకారం చుట్టారు. సుమారు 750కు పైగా వాహనాల యజమానులు డీఆర్డీఏ వద్ద ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏజెన్సీ పరిధిలో అందుబాటులో ఉన్న మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలు కోసం వినియోగించేలా చర్యలు చేపట్టారు. మైదాన ప్రాంతాల్లో మరో లక్ష క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక అందుబాటులో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో నెలకొన్న ఇసుక కొరతను అధిగమించేందుకు రాష్ర్టంలో తొలిసారి ఆరిలోవలో ప్రత్యేకంగా శాండ్ డిపోను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిల్వ చేసే ఇసుక నాణ్యత విషయంలో తొలుత పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి ఈ డిపో ద్వారా కేవలం పది రోజుల వ్యవధిలోనే 1080 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించి రూ.16 లక్షల వ్యాపారం చేశారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ నగర పరిధిలో రోజుకు 500 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందన్న అంచనాతో ఆ మేరకు శ్రీకాకుళం రీచ్ల్లో కొనుగోలు చేసి రప్పిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఇసుకను తరలించే వాహనాలను తొలిసారి జీపీఆర్ఎస్కు కనెక్ట్ చేసి వాటిని పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. తొలిసారిగా ఈ సెంట్రల్ డిపోతో పాటు మేజర్ రీచ్లలో ఒకటైన పొట్నూరు రీచ్ నుంచి ఇసుక రవాణాకు పూర్తిగా హోలోగ్రామ్తో కూడిన ఈ వేబిల్లు జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇసుక కొరత రానీయకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్లో తవ్వకాలు సాగించడం ద్వారా వచ్చే ఇసుకను పూర్తిగా సెంట్రల్ శాండ్ డిపోకు కేటాయించేలా ప్రతిపాదనలు పంపారు. మరొ పక్క జిల్లాలో రాంబిల్లి, అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేటలలో మరో 10 నుంచి 15 కొత్త రీచ్లను గుర్తించారు. ఈ రీచ్లలో మరో లక్షకు పైగాక్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
ఇసుకాసురులు
⇒ నదులు, గెడ్డలకు తూట్లు ⇒ అనధికారిక తవ్వకాలు ⇒ దొడ్డిదారిన అమ్మకాలు ⇒ మామూళ్ల మత్తులో అధికారులు ⇒ కానరాని నిఘా.. కొరవడిన పర్యవేక్షణ ⇒ లూటీ చేస్తున్న ‘దేశం’ నేతలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సర్ప, పెద్దేరు, శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం,బొడ్డేరు,తాచేరు రిజర్వాయర్లలో ఆయా సాగునీటి వనరులకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఇసుకను దృష్టిలో పెట్టుకుని రీచ్లను గుర్తించారు. అధికారికంగా గుర్తించిన రీచ్ల కంటే అనధికారికంగా ఇసుకతవ్వకాలు జరిగే ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అనుమతులిచ్చిన రీచ్ల్లో ఎక్కడా సీసీ కెమేరాలు లేవు. రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్తో అనుసంధానించలేదు. ఒకరిద్దరు డ్వాక్రామహిళలు, నోరు వాయ లేని కిందిస్థాయి సిబ్బంది తప్ప ఏరీచ్లలోనూ చెప్పుకో తగ్గస్థాయి అధికారులు లేరు. డ్వాక్రామహిళలకు తవ్వకాలు, అమ్మకాలపై కనీస అవగాహన ఉన్నట్టుగా కన్పించదు. రీచ్ల కోసం ఏ సమాచారం అడిగినా వారు చెప్పే పరిస్థితులో లేరు. మీ సేవ..ఆన్లైన్లో జరిగే రిజిస్ట్రేషన్ మేరకు సాగే తవ్వకాలు, అమ్మకాల కంటే అనధికారికంగా సాగే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమొచ్చిన చోటల్లా ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగిస్తూ నదులు, గెడ్డలకు తూట్లు పొడిచేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నుంచి సుమారు 500కు పైగా ట్రాక్టర్లు, వెయ్యికిపైగా టైరు బండ్లపై ఇసుకను ధర్జాగా తరలించు కుపోతున్నట్టుగా గుర్తించారు. అనధికారిక తవ్వకాలు జరిగే ప్రాంతాలు.. ఏజెన్సీలో మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన మత్స్యగెడ్డవంతెన, బొకెల్లు కాజ్వే, రాయగడ హాస్టల్, పరదానిపుట్టుకాజ్వే, పాతరపుట్టు, రాళ్లగెడ్డ పరిసర ప్రాంతాలైన చెరుకుంపాలెం, భీమసింగ్, దేవారాపల్లి మండలం కిమరాం, బి.చంతాడ, వేచలం, మాడుగులమండలం వీరవల్లి, ఎస్.రాయవరం మండలం పెనుగల్లు, ధర్మవరం, పెదఉప్పలం, పాయకరావుపేట మండలం మంగవరం, సత్యవరం, అరట్లకోట, మోసయ్యపేట, ముటాఆనకట్టలు, అనకాపల్లిమండలం దిబ్బపాలెం, వెంకుపాలెం, సీతా నగరం, మూలపేట,చోడవరం మండలం విజయరామరాజు పేట, వడ్డాది, గౌరవరం, గజపతినగరం, జెన్నవరం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా రోజూ వందలాది ట్రాక్టర్లు, టైరుబండ్లపై టన్నుల కొద్ది ఇసుక తరలి పోతున్నట్టుగా ‘సాక్షి’ పరిశీలన లో వెలుగుచూసింది. సముద్ర ఇసుకను వదలడం లేదు వ్యాపారులు సముద్రపు ఇసుకను కూడా వదలడం లేదు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డిఎల్.పురం, బోయిపాడు,పెదపీనర్ల, చినపీనర్ల, బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట, కేశవరం,పాల్మన్పేటల్లో సముద్రపుఇసుకను తవ్వేస్తున్నారు. ఈసుకను నదుల్లోని ఇసుకతో కలిపేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ’ఇలా చెప్పుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో జరుగు తున్న అక్రమాలు లెక్కకు మించే సాగుతున్నాయి. తాండవ నదిలో తుని-పాయకరావుపేట సరిహద్దు గ్రామాల్లో ఏకంగా పొక్లెయినర్లను ఉపయోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి పూట డ్వాక్రా మహిళల మాటున సాగుతున్న తవ్వకాలు రాత్రిళ్లు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. రాత్రిపూట అనధికారిక రీచ్లలో వందల కొద్ది లారీలు, టైర్ల బండ్లపై తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. -
గుట్టుగా బలవుతున్నారు
తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగే కౌలాస్ ఖిల్లా చారిత్రాత్మక ప్రదేశాల్లో గుప్త నిధులు ఉన్నాయనే నమ్మకంతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జగుతున్నాయి. కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజుల్లో తవ్వకాల మూలంగా ఏర్పడిన బిలలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుప్త నిధులపై ఆశతో కొందరు తవ్వకాలకు ఖర్చుచేస్తూ ఆస్తులు కరిగించేసుకుంటున్నారు.గుప్త నిధుల వేటలో మరికొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నిధుల కోసం.. * బాన్సువాడ ప్రాంతంలో తవ్వకాలు * అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జోరు * ప్రాణాలు పణంగా పెడుతున్న అమాయకులు * శాంతాపూర్ గండిలో ఇదే రీతిలో ఒకరి మరణం * కౌలాస్ ఖిల్లాలో నిధులున్నాయని నమ్మకం బాన్సువాడ : చారిత్రక కట్టడాలు గల బాన్సువాడ ప్రాంతంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి తవ్వకాలు జరుపుతున్న ముఠాలు, అమాయకుల ప్రాణాలకు హాని కూడ కలిగిస్తున్నారు. కౌలాస్ రాజులు పాలించిన ఈ ప్రాంతంలోని కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజు, బి చ్కుంద, పుల్కల్, శాంతాపూర్ గండి, వాజిద్నగర్, పి ట్లం, బీర్కూర్, సోమేశ్వర్ ప్రాంతాల్లో తరచుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజుల కాలంలో ఆయా ప్రాంతాల్లో బంగారు నగలు, నాణేలు భూమిలో పాతిపెట్టారనే ప్రచారం ఉంది. దీంతో తవ్వకాలకు పాల్పడుతూ కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. ఇందుకు నిదర్శనంగా రెండు నెలల క్రితం బిచ్కుంద మండలం శాంతాపూర్ గండిలో గుప్త నిధుల కోసం తవ్వుతూ ఒకరు మరణించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఏకంగా 25 మంది ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరపడం గమనార్హం. పాత బాన్సువాడలోనూ గుప్త నిధుల కోసం వారం రోజుల క్రితం తవ్వకాలు జరిపారు. అలాగే మూడేళ్ల క్రితం బీర్కూర్లోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి మేక పిల్లను బలి ఇచ్చేందుకు పూనుకోగా, గ్రామస్తులు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు పట్టించారు. రాజుల కాలంలో దాచి ఉంచిన నిధులు ఇక్కడ తవ్వకాల్లో లభిస్తున్నాయనే ప్రచా రం దశాబ్దాలుగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం బీర్కూర్లోని ఒక పాత థియేటర్లో గుప్త నిధులు లభించగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ జరిపి కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కౌలాస్ ఖిల్లాలో అప్పటి రాజులు భారీగా నిధులను దాచి ఉంచారనే ప్రచారం జరుగుతుండడంతో కొన్నేళ్లుగా గుర్తు తెలి యని వ్యక్తులు అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. బిచ్కుంద మండలం తక్కడపల్లి వద్ద చారిత్రాత్మక మందిరాన్ని గుప్త నిధుల కోసం కూల్చివేశారు. మరో ఘటనలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మూడేళ్ల క్రితం కౌలాస్ ఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్తులు అడ్డుకొన్న ఘటన తెలిసిందే. గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో కొందరు బృందాలుగా ఏర్పడి తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. బీర్కూర్ మండలంలోని సంగెం, బొమ్మన్దేవ్పల్లి, దుర్కి తదితర గ్రామాల్లో ఆమావాస్య, పౌర్ణమి రోజులతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గుప్త నిధుల కోసం జోరుగా తవ్వకాలు సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం సంగెం గ్రామంలో కొందరు గుప్తనిధి కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలుసుకున్న గ్రామస్తులు వారిని పట్టుకుని భారీగా జరిమానా విధించారు. గుప్త నిధుల కోసం లక్షలాధి రూపాయలు వెచ్చిస్తూ ఇల్లును గుల్ల చేసుకుంటున్నవారు సైతం ఉన్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ నిధుల వేట ముమ్మరంగా సాగుతోంది. మంత్రగాళ్లుగా చెప్పుకునే వారిని మూఢ విశ్వాసంతో ఇతర ప్రాంతాల నుంచి పిలిపించి పూజలు చేయిస్తూ నిధుల కోసం తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ తంతు వ్యవహారాలు తరుచూగా జరుగుతున్నాయి.పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండటంతో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ నిధుల వేటకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖనిజం.. మైనింగ్ మాఫియాకు సిరులు కురిపిస్తోంది.. అధికారుల కళ్లుగప్పి మాంగనీస్ వ్యాపారులు సరిహద్దులు దాటిస్తున్నారు.. అనుమతి లేనిచోట తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు గడిస్తున్నారు.. గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని దందా కొనసాగిస్తున్నారు.. ప్రభుత్వానికి గండి కొడుతున్నారు.. జిల్లాలో ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీస్(ఐరన్ ఓర్) లభిస్తుంది. సీజన్లవారీగా కంపెనీలు తవ్వకాల అనుమతి, లెసైన్స్, పర్యావరణ అనుమతి పొంది గనుల శాఖ సూచించే కొన్ని షరతులకు లోబడి తవ్వకాలు జరపాలి. లేకుంటే ఆ కంపెనీలకు మాంగనీసు తరలించేందుకు అనుమతిని మైనింగ్ అధికారులు ఇవ్వరాదు. నిబంధనలు తుంగలో తొక్కి కొన్ని కంపెనీలు రూ.కోట్ల విలువ చేసే మాంగనీసును మూడో కంటికి తెలియకుండా రాత్రిపూట సరిహద్దులు దాటిస్తున్నాయి. ఇంకా మైనింగ్ శాఖ పర్యావరణ అనుమతి లేని కంపెనీలకు పర్మిట్లు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది క్రితం ఆదిలాబాద్ నుంచి ఆదిత్య మినరల్స్ పర్మిట్పై రాయల్టీ ఎగవేసి అక్రమంగా రాజస్థాన్కు తరలుతున్న లారీని ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. కొంత మంది ప్రాస్పెక్టీవ్ లెసైన్స్(పీఎస్) అనుమతి తీసుకుని 200 టన్నుల మాంగనీసును తవ్వాల్సి ఉండగా వేలాది టన్నులు తవ్వుతూ ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకునే భూగర్భగనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ జరుపుతున్న ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్థలున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్న మైనింగ్ శాఖ ఆదిలాబాద్, తాంసి, జైనథ్ మండలాల్లో మాంగనీసు తవ్వకాల కోసం 16 కంపెనీలకు 12,200 ఎకరాల్లో అనుమతి ఉంది. అయితే చాలామంది వ్యాపారులు పర్యావరణ అనుమతి తీసుకోకుండానే మాంగనీసు తవ్వి తరలిస్తున్నారు. తమకు లీజు ఇచ్చిన స్థలంతోపాటు ప్రభుత్వ, రెవెన్యూ, ఫారెస్టు భూముల నుంచి కూడా అక్రమంగా మాంగనీసు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయమై పలువురు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుపై జరిపిన విచారణలో తేలినా ఇప్పటివరకు అక్రమ మైనింగ్కు కళ్లెం పడలేదు. అయితే ఇప్పుడు తవ్వకాలు జరపడం లేదని అధికారులను బుకాయిస్తున్నా, గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యాపారులు 20 రోజులుగా ఆదిలాబాద్ నుంచి తరలిస్తుండంపై పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు ఇటీవలే ఫిర్యాదులు అందాయి. ఇదిలా వుంటే అక్రమ మైనింగ్కు తోడు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బోర్వెల్ మిషన్లతో డ్రిల్చేసి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ మాంగనీసు తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులు, ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తుండటంపై చర్చ జరగుతోంది. అంతేగాకుండా మాంగనీసు తవ్వకాల్లో కొందరు ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ ఎగవేస్తున్నారు.