
రాజమండ్రికి రెండు ప్రత్యేక హెలికాప్టర్లు
విమానాశ్రయం (గన్నవరం): గోదావరి పుష్కరాల కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి రాజమండ్రికి రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు డెరైక్టర్ ఎం.రాజ్కిషోర్ తెలిపారు. సోమవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ.. పుష్కరాలకు దేశ విదేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది వరకు యాత్రికులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
దీనివల్ల రోడ్డు మార్గంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవడంతో పాటు రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాత్రికులను త్వరితగతిన పుష్కర ఘాట్లకు తీసుకువెళ్లడంతో పాటు వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీని కోసం పవన్ హాన్స్ లిమిటెడ్ సంస్థ 10 సీటింగ్, 6 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు హెలికాప్టర్లను గోదావరి పుష్కర ప్రయాణికుల కోసం కేటాయించిందని రాజ్ కిషోర్ తెలిపారు.