నెల్లూరు(క్రైమ్), న్యూస్లైన్: రాష్ట్ర విభజనపై హోంశాఖ సమర్పించిన నోట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ 72, ఎన్జీఓ సంఘం 48 గం టల బంద్కు పిలుపునిచ్చిన సం గతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం బంద్ ప్రశాంతంగా జరిగింది.
ముందే అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరులోని ప్రధాన కూడళ్లు, కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నెల్లూరులో ఉదయం 6 గంటల నుంచే బంద్ ప్రభావం కనిపించింది. వైఎస్సార్సీపీ, ఎన్జీఓ సంఘ నాయకులు రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలతో హోరెత్తించారు. విద్యాసంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, మద్యంషాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. విద్యుత్ భవన్ ఎదుట రోడ్డుపై కొయ్యను కాల్చేందుకు ఉద్యోగులు యత్నించగా ఐదో నగర సీఐ ఎస్వీ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. ఉద్యమానికి సహకరించాలని ఉద్యోగులు ఆయన కాళ్లు పట్టుకుని బతిమలాడే క్రమంలో సీఐ అదుపుతప్పి కిందపడ్డారు. ఇది గమనించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది స్వల్పంగా లాఠీచార్జి చేయడంతో విద్యుత్శాఖ డీఈఈ అనిల్కుమార్కు స్వల్పగాయమైంది. పోలీసుల వైఖరి నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేశారు. విషయం ఎస్పీ రామకృష్ణ దృష్టికెళ్లడంతో డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి సంఘటనస్థలానికి చేరుకుని విద్యుత్ ఉద్యోగులతో చర్చించి పరిస్థితి చక్కదిద్దారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇళ్లను ముట్టడించేందుకు వెళుతున్న ఎన్జీఓలను నర్తకీ సెంటర్లో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ పలు ప్రాంతాల్లో పర్యటించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.
డీఎస్పీ వెంకటనాథ్రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు మద్దిశ్రీనివాసులు, కోటారెడ్డి, కె.వి.రత్నం, రామారావు, ఎస్వీ రాజశేఖర్రెడ్డి, మంగారావు, సుబ్బారావు, సురేష్కుమార్రెడ్డి, వీరాంజనేయరెడ్డి బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. తడలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్యతో పాటు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరు వద్ద జాతీయరహదారిపై బైఠాయించిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో పాటు 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
మొదటి రోజు ప్రశాంతం
Published Sat, Oct 5 2013 4:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement