ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో గురువారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విశాఖపట్నం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో గురువారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ. 2 నుంచి 4 వరకు కర్ఫ్యూను సడలించారు. మరోవైపు పట్టణంలోని రైతుబజార్లన్నింటినీ మూసేసి సిబ్బంది, రైతులు నిరసన తెలపడంతో కర్ఫ్యూ సడలించినా ప్రజలకు ఉపయోగంలేకుండా పోయింది. కూరగాయల ధరలు నింగినంటడంతో అవస్థలు పడ్డారు. శుక్రవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండె, ఎస్పీ కార్తికేయ తెలిపారు.
ముగ్గురు సీఐల సరెండర్ : విజయనగరంలో సమైక్య నిరసనలను అదుపు చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఐలు డి. లక్ష్మణరావు, వెంకట అప్పారావు, రమణమూర్తిలను బాధ్యులుగా చేస్తూ డీఐజీ కార్యాలయానికి సరెండర్ చేసి వారి స్థానంలో మరో ముగ్గురిని తాత్కాలికంగా నియమిస్తూ విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.