
శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 'నీరు- చెట్టు' సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
'జల వనరుల్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరి పరిధిలో వారు వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకుందాం. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేసి సాగు నీటి ప్రాజెక్టులను మనుగడలోకి తెద్దాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
కడప: 'జల వనరుల్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరి పరిధిలో వారు వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకుందాం. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేసి సాగు నీటి ప్రాజెక్టులను మనుగడలోకి తెద్దాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. 'నీరు-చెట్టు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత సర్వరాయసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం చదిపిరాళ్ల, కడప చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చదిపిరాళ్ల, కమలాపురంలో నిర్వహించిన సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులపై 1,050 గంటలు సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రాధాన్యత పరంగా వాటిని చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వివరించారు. గండికోట ప్రాజెక్టులో సుమారు 20 టీఎంసీలు, వామికొండ, సర్వారాయసాగర్లో సుమారు 4.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. ఇదే నీరు ఏడాదిలో కడపకు తరలించేందుకు అన్ని చర్యలు చేపడతామని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఈ నెల 13నసమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పని చేయని కాంట్రాక్టర్లను తప్పిస్తాం..
'హంద్రీ-నీవా పనులు ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సీరియస్గా ఉందన్న విషయం చెప్పేందుకు రాత్రి కాలువపై బస్సులో నిద్రించా. అప్పు చేసైనా రూ.2 వేల కోట్ల నిధులు సమకూరుస్తాం. పనులు చేయలేమన్న కాంట్రాక్టర్లను తప్పిస్తాం' అని సీఎం చంద్రబాబు అన్నారు.
టీడీపీ నేతలకు తలంటు
ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తుంటే వైఎస్సార్ జిల్లాలో తెలుగు తమ్ముళ్లల్లో ఆశించిన చొరవ కన్పించలేదని పేరు పేరునా ముఖ్యమంత్రి చురకలు అంటించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంపీ రమేష్ న్యూఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఆకాశంలో తిరుగుతున్నారని, అలా అయితే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెల కిశోర్బాబు సమీక్షలు నిర్వహించడం లేదన్నారు. కలెక్టర్ కేవీ రమణ చొరవ తీసుకోలేదని వరుసగా చురకలంటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ రమణ, జాయింట్ కలెక్టర్ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ పరిధిలో ప్యాకేజీల వారీగా పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
పట్టుబడిన 'ఎర్ర' సంపద మనదే
బి.కొత్తకోట: 'దొంగతనానికి గురైన బంగారం రికవరీ అయితే బాధితులకు అప్పగిస్తారు. అలాంటి మన ఎర్ర సంపద(ఎర్రచందనం) పొరుగు రాష్ట్రాల మీదుగా అక్రమంగా రవాణా అవుతూ పోలీసులకు పట్టుబడితే అది మనకే చెందాలి.. దీన్ని అప్పగించబోమని చెబితే ఎలాగ?' అంటూ రాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని హంద్రీ-నీవా కాలువపై విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులది బ్లాక్ మెయిల్ సమ్మెని ఆర్టీసీ సంఘాల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
మాఫీ మూడు వేలే..
'నా పేరు స్వరూపరెడ్డి. వీరపునాయునిపల్లె మండలం గడ్డంవారిపల్లె. నేను టీడీపీకి వీరాభిమానిని. మా కూతురు పేరుతో బ్యాంకులో రుణం తెచ్చుకున్నా. అక్కడ చూస్తే రూ. 2 వేలు మాఫీ అయింది. నేనేమో బంగారం కుదువపెట్టి బ్యాంకులో రూ. 1.50 లక్షలు తెచ్చుకున్నా. మీరేమో మొత్తం మాఫీ అన్నారు. తీరా రూ.3 వేలు మాఫీ అయిం ది. ఇదేంది సార్..' అంటూ స్వరూపరెడ్డి సర్వరాయసాగర్ వద్ద సీఎంను ప్రశ్నిం చగా.. అలా ఏం కాదు.. పలుచోట్ల రుణాలు తీసుకున్నారు.. మేం చెప్పింది లక్షా యాభై వేలే అని సీఎం సమర్థించుకున్నారు.
గాలేరు-నగరిపై చంద్రబాబుకు ఎంత ప్రేమో?
హైదరాబాద్: గాలేరు-నగరి ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసిన ఖర్చు ఎంతో తెలుసా.. రూ.17 కోట్లే. గాలేరు-నగరిలో భాగమైన సర్వరాజ సాగర్, గండికోట ప్రాజెక్టులను చంద్రబాబు శుక్రవారం సందర్శించారు. ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోని విధంగా నిధులిచ్చి.. ఇప్పుడు గాలేరు-నగరి ఘనత తనదేనని చెప్పుకోవడానికి బాబు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది.