
‘ప్లంజ్పూల్’ గొయ్యి పూడ్చివేతకు కసరత్తు
వైఎస్ జగన్ విమర్శల నేపథ్యంలో కదిలిన సర్కారు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని ప్లంజ్పూల్ ఏరియాలో 2009లో వచ్చిన వరదల వల్ల ఏర్పడిన సుమారు 100 మీటర్ల గొయ్యిని పూడ్చేందుకు ఎట్టకేలకు దాదాపు ఏడేళ్ల తరువాత చర్యలు మొదలయ్యాయి. గొయ్యిని పూడ్చేందుకు డ్యాం సేఫ్టీ అధికారులు, నిపుణులు, పలుమార్లు పరిసర ప్రాంతాలను తనిఖీచేసి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) నిపుణుల కమిటీకి నివేదికలు అందజేశారు. అయితే ప్రభుత్వం సత్వర పనులకు ఆదేశాలివ్వలేదు. గత గురువారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలంలో రైతు భరోసా యాత్రను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్లంజ్పూల్ గొయ్యిను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. ఆయన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం హడావుడిగా విజయవాడలో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటివరకు గొయ్యి పూడ్చేందుకు ఇచ్చిన ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయని, సీడీఓ అనుమతులను ఎందుకు తీసుకోలేదని చీఫ్ ఇంజనీర్తోపాటు శ్రీశైలం డ్యాం ఇంజనీర్లను మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డ్యాం వద్ద ఏర్పడిన గొయ్యిని పూడ్చేందుకిచ్చిన నివేదికలకు సీడీఓ ఆమోదం సైతం లభించినట్టు తెలిసింది. త్వరలో పనులకు టెండర్లను పిలిచే అవకాశముంది.