
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్: ప్రభుత్వ ఆదాయవ్యయాల లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. బడ్జెట్ లెక్కలపై కేంద్రం అనుసరిస్తున్న పద్ధతినే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పారదర్శకత ఉన్న పాలన కొనసాగుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పద్దతి అనుసరిస్తోందని తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. ఏఏ పథకాలకు ఎంతెంత ఖర్చుచేస్తున్నారో తెలపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 23 వరకు జరుగనున్నందున సభలో చర్చకు వివరాలు సమగ్రంగా ఉండాలన్నారు. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఆదాయవ్యయాలు, పన్నులు, లోటు తదితర ఆర్థిక అంశాలను వెబ్సైట్లో పెట్టాలని వైఎస్ జగన్ కోరారు.
**