
2001 నుంచే అక్కడున్న సంగతి తెలీదా?
హైదరాబాద్ : ప్రతిపక్షంతో సమన్వయం సాధించుకుంటూ అసెంబ్లీలో చర్చను కొనసాగించాల్సిన ప్రభుత్వమే... బెదిరింపు ధోరణులకు పాల్పడటం టీడీపీ ప్రభుత్వానికే చెల్లింది. పట్టిసీమ ప్రాజెక్ట్పై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుకోవటమే కాకుండా అవాస్తవాలను సభలో ప్రస్తావించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సతీమణి విజయమ్మతో వ్యక్తిగత సంభాషణలు చేసిన విషయాలను కొణిజేటి రోశయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటూ కాల్వ శ్రీనివాసులు తీసుకొచ్చిన ప్రస్తావన అసెంబ్లీలో గందరగోళానికి దారి తీసింది. ప్రియతమ నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ వైఎస్ జగన్ చెబుతున్నారని... అలాంటి ఆయన కన్నతండ్రే... వైఎస్ జగన్తో వేగలేకపోతున్నామని, అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ రాకుండా చూసుకోవాలన్నారని, జగన్ ఇక్కడకు వస్తానంటే ఎలా వద్దని చెబుతామని వైఎస్ విజయమ్మ... రోశయ్యతో అన్నట్లు కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు పలికారు.
అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2001 బెంగళూరులో ఉంటున్నారన్న విషయాన్ని కాల్వ శ్రీనివాసులు కావాలనే విస్మరించారు. ఆయన తానా అంటే... తాము తందానా అంటూ మంత్రులు రావెల కిశోర్ బాబు ఓ వైపు... అచ్చెన్నాయుడు మరోవైపు తిట్ల పురాణం అందుకున్నారు. కేవలం వైఎస్ జగన్ను విమర్శించేందుకే అన్నట్టు అధికార పక్ష సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు.