
వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం: వైఎస్ జగన్
హైదరాబాద్ : గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే గృహ నిర్మాణాలపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా 35 వేల ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్లో 44,895, అర్బన్లో 2,687 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేశారన్నారు.
ప్రభుత్వం లక్షా 35వేల ఇళ్ల కట్టామని చెబుతోందని, ఒక్కో ఇల్లుకు లక్షన్నర వేసుకున్నా రూ.6వేల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా హౌసింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ పది లక్షల ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని, దానిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో అవినీతిని అరికట్టేందుకు జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నామన్నారు.