ఖరారు..తకరారు
Published Thu, Mar 6 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
కాకినాడ సిటీ, న్యూస్లైన్ :జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లకు సంబంధించి గురువారం రాత్రి గెజిట్ విడుదల చేశారు. 20, 21 నెంబరుతో గెజిట్ విడుదల చేసినప్పటి కీ రిజర్వేషన్ల ఖరారు మాత్రం కొలిక్కి రాలేదు. జిల్లాలో 58 జెడ్పీటీసీలు, 1052 ఎంపీటీసీలు రిజర్వేషన్ల ఖరారు కోసం గత మూడురోజులుగా జెడ్పీ కార్యాలయంలో అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బుధవారం రాత్రికల్లా ఈ కసరత్తు పూర్తి చేసి గురువారం అధికారిక ప్రకటన (గెజిట్) విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి కావడంతో కసరత్తు పూర్తికాకుండానే రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ విడుదల చేసినట్టు అధికారులు
పకటించారు. శుక్రవారం ఉదయానికల్లా ఈ కసరత్తు ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న సుమారు 50 మంది ఎంపీడీఓలు ఇటీవలే ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్తవారు బాధ్యతలు చేపట్టారు. వీరికి జిల్లాపై కనీస అవగాహన లేకపోవడం, ఎంపీటీసీల పునర్విభజన కసరత్తుపై అనుభవం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని జెడ్పీ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికితోడు జెడ్పీ సీఈఒగా బదిలీపై వచ్చిన సూర్యభగవాన్ రిజర్వేషన్ల ఖరారులో ఎలాం టి లోటుపాట్లు లేకుండా ఉండాలన్న భావనతో ప్రతి చిన్న అంశంపైనా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించాల్సి ఉండగా, ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
Advertisement
Advertisement