
రాబర్ట్ వాద్రా ( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మనీ ల్యాండరింగ్ కేసులో ఊరట లభించింది. మధ్యతర బయిల్పై ఉన్న రాబర్ట్ వాద్రాతోపాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరాకు మరోసారి ఊరటనిస్తూ ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది స్పెషల్ సీబీఐ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సోమవారం ఈ ఆదేశాలిచ్చారు. అయితే దేశం విడిచి వెళ్లరాదంటూ షరతులు విధించారు. దర్యాప్తునకు పిలిచినపుడు విచారణ అధికారులతో సహకరించాలని, సాక్ష్యాలను నాశనం చేయవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించ వద్దని నిందితులిద్దరినీ న్యాయమూర్తి కోరారు.
షరతులతో కూడిన ఈ బెయిల్ కోసం ఇద్దరూ చెరి రూ. 5లక్షల పర్సనల్ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా వాద్రా, అరోరా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ విజయం సాధించిందని వాద్రా న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వ్యాఖ్యానించారు.
నిజం నిగ్గు తేలిందనీ, న్యాయమే గెలిచిందని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న అచంచల విశ్వాసం విజయం సాధించిందనీ, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన హితులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సవాల్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment