
విమానాశ్రయం(గన్నవరం): ఇండిగో ఎయిర్లైన్స్ విజయవాడ ఎయిర్పోర్టు కేంద్రంగా మంగళవారం నుంచి విశాఖపట్నానికి నూతన విమాన సర్వీసును ప్రారంభించనుంది. 74 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం ప్రతిరోజు ఉదయం 10.10కి ఇక్కడి నుంచి బయలుదేరి 11.25కి వైజాగ్కు చేరుకుంటుంది. తిరిగి వైజాగ్ నుంచి 11.55కు బయలుదేరి మధ్యాహ్నం 13.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి రోజుకు 14 సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈనెల 9నుంచి బెంగళూరు, చెన్నైకి మూడవ డైరెక్ట్ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. కొత్త సర్వీస్లతో విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో రాకపోకలు సాగిస్తున్న సర్వీసుల సంఖ్య 20కు చేరనుంది.