
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణం బాధితుల్లో మరొకరు అకస్మాత్తుగా ప్రాణాలు విడవడం విషాదాన్ని నింపింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) లో డబ్బులు దాచుకున్న ప్రతాప్ జియందాని (71) ములుండ్లోని తన నివాసంలోగుండెపోటుతో మరణించారు. ఈ సమాచారాన్ని ఆయన బంధువు ముఖేష్ చండిరామణి శుక్రవారం వెల్లడించారు.
కాగా గత రెండు నెలల కాలంలో పెద్దమొత్తంలో పీఎంసీలో డబ్బులు దాచుకున్న డిపాజటర్లలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఏడుగురు డిపాజిటర్లు గుండెపోటుతో మరణించారు. సుమారు 16 లక్షల మంది డిపాజిటర్లను కలిగి ఉన్న పీఎంసీలో రూ 4355 కోట్ల రూపాయల కుంభకోణం సెప్టెంబరు మాసంలో వెలుగులోకి రావడంతో ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. కస్టమర్లు వెయ్యిరూపాయల మాత్రమే విత్ డ్రా చేసుకోగలరని నిబంధనలు విధించింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులో నగదును డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని అంటూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో విత్డ్రా పరిమితిని రూ.40,000 నుంచి 50 వేలకు పెంచింది. అయితే 78 శాతం ఖాతాదారులు తమ మొత్తం బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ, వివాహాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో పీఎంసీ డిపాజిటర్ రూ.1 లక్ష వరకూ విత్డ్రా చేసుకోవచ్చంటూ వారికి భారీ ఊరట కల్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment