
చివర్లో అమ్మకాలు...
గ్రీస్ అనిశ్చితి... ఇన్వెస్టర్ల జాగ్రత్త
♦ 75 పాయింట్ల నష్టంతో 27,946కు సెన్సెక్స్
♦ 8 పాయింట్ల నష్టంతో 8,445కు నిఫ్టీ
ఆద్యంతం ఊగిసలాటకు గురైన గురువారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ చివర్లో లోహ, ఐటీ షేర్లలో అమ్మకాల వెల్లువ కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి 27,946 పాయింట్లకు, నిఫ్టీ 8 పాయింట్లు పడిపోయి 8,445 పాయింట్లకు పడిపోయాయి. గ్రీస్ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, లోహ షేర్లు నష్టపోగా, టెలికాం, ఎఫ్ఎంసీజీ, కొన్ని వాహన షేర్లు లాభపడ్డాయి.
గ్రీస్ ఉదంతం సుఖాంతంగానే ముగుస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 28,116 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది.
‘సాగు’ షేర్లు రయ్....సాగునీరుకు సంబంధించి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన పథకం కింద ఐదేళ్లలో రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ సంబంధిత కంపెనీల షేర్లు పెరిగాయి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, శక్తి పంప్స్, కావేరి సీడ్స్, మోన్శాంటో ఇండియా, ధనుక ఆగ్రిటెక్, అద్వాంతలు 8 శాతం వరకూ పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,711 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,286 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,47,620 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.575 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.219 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
నిఫ్టీ టార్గెట్ను తగ్గించిన ఆర్బీఎస్
ది రాయల్ బ్యాంక్ స్కాట్లాండ్(ఆర్బీఎస్) నిఫ్టీ ఈ ఏడాది చివరకు చేరే టార్గెట్ను 10,000 పాయింట్ల నుంచి 9,200 పాయింట్లకు తగ్గించింది. బీహార్లో ఎన్నికల జరగనున్నందున సంస్కరణలు ఆలశ్యమవుతాయని, కీలకమైన బిల్లులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందుతాయని, కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉంటాయని.. అందుకే నిఫ్టీ టార్గెట్ను తగ్గంచామని తెలిపింది.
బీఈఎంఎల్ జోరు...
ఈ ఏడాది భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) షేర్ జోరుగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.793గా ఉన్న ఈ షేర్ గురువారం రూ.1,301 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,320)కి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 2 శాతం పెరగ్గా ఈ షేర్ 68 శాతం ఎగసింది. ఈ షేర్ను రూ.1,414 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సిఫార్స్ చేస్తోంది. పట్టణ మౌలికవసతుల కల్పనకు, రక్షణ రంగానికి అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరపడం, మైనింగ్ రంగంలో సంస్కరణలు, డిమాండ్ పుంజుకోనుండడం, కంపెనీకి దాదాపు గుత్తాధిపత్యం ఉండడం, వ్యయ నియంత్రణ పద్ధతులు అనుసరిస్తుండడం... సానుకూలాంశాలని పేర్కొంది.