
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. బులియన్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా పసిడి నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు క్షీణించి 31,600 రూపాయలకు చేరుకుంది. స్థానిక నగల దుకాణదారుల నుంచి గిరాకీ తగ్గడం, విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పడిన పసిడి ధర 286 రూపాయలు పతనమై రూ. 30,545వద్ద ఉంది.
వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. డిమాండ్ క్షీణించిన కారణంగా 100 రూపాయలు తగ్గిన కిలో వెండి రూ .40,500 పలుకుతోంది. వారపు ఆధారిత డెలివరీ ధర రూ. 145 కు రూ. 39,535 కి చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెల తయారీదారుల ద్వారా డిమాండ్ బాగా తగ్గిందని ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధానిలో, 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛతగల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 300 నష్టపోయి వరుసగా రూ .31,600, రూ.31,450 లుగా నమోదైంది. కాగా గత రెండు రోజుల్లో విలువైన మెటల్ 190 రూపాయలు కోల్పోయింది. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ .24,800 వద్ద ఉంది. బలహీనమైన గ్లోబల్ ధోరణి, అమెరికా పేరోల్స్ డేటా , ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.37 శాతం పడిపోయి 1,293.10 డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment