
తగ్గుతున్న వెండి, పసిడి ధరలు
ముంబయి : నిన్న మొన్నటి వరకూ పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారాంతంలో 500 రూపాయలకు పైగా పెరిగిన 10 గ్రాముల ధర సోమవారం ఉదయం 550 రూపాయల దాకా తగ్గింది. ప్రస్తుతం ఎంసీక్స్లో ధర 29,550 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 2 డాలర్లు తగ్గి 1325 డాలర్లకు రావడం.. మన మార్కెట్లో రూపాయి.. రూపాయి దాకా బలపడటంతో 10 గ్రాముల బంగారం ధర తగ్గుతోంది.
ఈవారంలో అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్.. స్టిమ్యులస్ పాకేజీల ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది అనే వార్త కూడా బంగారానికి ప్రతికూలంగా మారింది. స్టిమ్యులస్ ప్యాకేజీల ఉపసంహరణ వల్ల డాలర్ల ముద్రణ తగ్గుతుంది. గత ఐదేళ్లుగా ఇష్టానుసారం డాలర్లు ప్రింట్ చేయడం వల్ల బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అదే కారణంతో ఔన్స్ ధర తగ్గుతూ వస్తోంది. 1900 డాలర్ల నుంచి 1300 డాలర్ల స్థాయికి వచ్చింది. బంగారం లాగే వెండి ధర కూడా పతనమవుతోంది. ప్రస్తుతం ఎంసీక్స్లో కేజీ ధర 1600 రూపాయల దాకా నష్టపోతూ 49 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవువతోంది.