
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ వరకు మొదటి మూడు నెలల కాలంలో నికరంగా రూ.1.34 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.93,400 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే గనుక 43 శాతం వృద్ధి కనిపిస్తోంది.
ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం బలంగా ఉంటోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ గణాంకాల ప్రకారం చూస్తే... విరివిగా వచ్చి పడుతున్న పెట్టుబడులతో 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ కూడా కొత్త శిఖరాలకు చేరుతోంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.23.40 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూన్ నాటికి ఉన్న రూ.20.40 లక్షల కోట్ల ఆస్తులతో పోలిస్తే 20 శాతం పెరుగుదల ఉంది.