-
ఔటర్పై నేటి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు
లక్డీకాపూల్: ఔటర్ రింగ్ రోడ్పై టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సోమవారం నుంచి పెంచిన టోల్ చార్జీలు 5 శాతం అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్లకు ప్రతి కిలోమీటర్కి రూ.2.34 పైసలు, ఎల్సివి, మినీ బస్లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్మెంట్లకు రూ.12.40, ఓవర్సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.కొత్త టోల్ రేట్లు, రో జువారీ పాసులు, నెలవారీ పాసులు తదితరాలకు హెచ్ఎండిఏ వైబ్సైట్ను సందర్శించాల్సిందిగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్ప్రెస్వే ప్రైవేట్ సంస్ధ నిర్వాహకులు సూచించారు. -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
భూమి విలువ పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం. రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది. గుండె పెరగడం.. రకాలు.. గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి.. డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్) రెండూ పెరుగుతాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అంటారు. ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్ డయలేటెడ్ కార్డియో మయోపతి అంటారు. కారణాలు.. గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకారై్డటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం. గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. దీన్ని ఎక్స్–రే ద్వారా కనుగొంటారు. రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల. కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి). దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు. లక్షణాలు.. శ్వాస సరిగా అందకపోవడం కాళ్ల / పాదాల వాపు బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం. నిర్ధారణ పరీక్షలు.. కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్మిల్పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. చికిత్స.. గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా. రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా. గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా. మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. ఇతర మందుల వాడకంతోనూ.. కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్తో రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో. రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్తో. గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు. గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు. గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్మేకర్’ అమర్చడం ద్వారా. లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ) అనే ఉపకరణాన్ని. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో. చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇవి చదవండి: మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి.. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. 2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది. జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా.. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు 2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
ఇంకా పెరగాలి ఓటు ధర!
ఓ జర్నలిస్టు... ఓ (అ)సామాన్య ఓటరును ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓటును నోటుకూ, ఓ రేటుకూ అమ్ముకుంటున్నారనీ, ఈ పద్ధతి తప్పు అని తెలియజెప్పాలని సదరు జర్నలిస్టు ఉద్దేశం. అదే విషయాన్ని అతణ్ణి అడిగాడు. ‘‘సార్... పేపర్లలో టీవీల్లో... మీరే దాన్ని ‘విలువైన ఓటు’, ‘విలువైన ఓటు’ అంటుంటారా, లేదా? మరి అంత విలువైనదాన్ని ఫిరీగా ఇచ్చేయడమేంటి?... నాన్చెంచ్’’ ‘‘ఓటు ధర ఇలా పెరిగిపోవడం ఓ చెడు సంకేతం కాదా?’’ ‘‘ఎంతమాత్రమూ కాదు. నిజానికి నా ఒపీనియనింగు పెకారం ఓటింగు ప్రైసింగు వింకా పెరగాలి. ఒకప్పటి రేట్లూ..ఇప్పటి ధరలూ, ఇప్పటికి తరిగిపోయిన రూపాయి విలువా.. వీటన్నింటినీ కూలంకచంగా పరిచీలింపచేసి, ఏ ఆడమ్ చ్మిత్తుతోనో, అమర్తచేనుతోనో లెక్కలు కట్టించారనుకోండి, పెరిగిన ద్రవ్యోల్బణం పెకారం.. ప్చ్..ఇప్పటి మన ఓటు ధర చాలా తక్కువని తెలుతుంది. ఇంకో విషయం.. ఓటు ధర బాగా పెరిగిందనుకోండి.. ‘అమ్మో.. మా చీటు ఇంతటి వ్యాల్యుయేషనబుల్ కదా’ అంటూ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం మమ్మల్ని మరింత చంతృప్తిపరచేలా పాలిస్తుంటారు సార్ నేతలు’’ ‘‘అదేంటీ... ఇలా చెబుతున్నారు?’’ ‘‘సార్... మీకు మీ ఆఫీసువాళ్లు ఏడాదికోసారి బోనచు ఇస్తుంటారా, లేదా? దాన్ని మీరు తీసుకుంటారా లేక ‘అబ్బే..అప్పనంగా వచ్చింది మాకెందుకండీ’ అని వదిలేస్తారా?’’ ‘‘తీసుకుంటాం’’ ‘‘మాకు నెలనెలా వచ్చే మా పింఛనే జీతమనుకుందాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎప్పుడో... ఐదేళ్లకోసారి బోనచుగా ఏ ఐదువేలో, ఆరువేలో ఇస్తారు. మీరు ఏడాదికోసారి బోనచు రాకపోతేనే ఎంతో అల్లల్లాడిపోతారు కదా. మాకేమో ఏదో ఓ రెణ్ణెల్ల పింఛన్ను..అది కూడా ఐదేళ్లకు..మచ్చుకు కొద్దిగా బోనచులాగా పడేస్తే..మీరీమాత్రానికే ఇంతగా విదైపోతుంటారెందుకో నాకు అర్థంకావడం లేదు’’ ‘‘ఇలా ఓటుకు ధర పెరుగుతూ పోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం కాదా?’’ ‘‘ఓటును అమ్మడం, అమ్ముకోవడం అని మాటిమాటికీ అనకండి సిరాగ్గా! అమ్ముతున్నాడంటూ బదనాం చేయడానికి ఓటరే దొరికాడా మీకు తేరగా? అసలుఓటును అమ్ముకోడం అనడమేంటి? బార్బేరియన్’’ అన్నాడు చిరాగ్గా. ‘‘మరి ఏమనాలి?’’ ‘‘సార్.. నిజానికి ఇదొక వెకనమిక్ యాక్టివిటీ. అనగా... ఓ ఆర్థిక కార్యెకలాపం. ఉదాహరణకు..ఓ విలువైన పనికి టెండర్లు పిలుస్తారు. బిడ్డింగు వేస్తారు. ఎవరు ఎక్కువ లాభదాయకంగా కోటింగు చేస్తే, వాళ్లకు ఇస్తారు. ఓటు విషయంలోనూ అదే జరుగుతోందని ఎందుకనుకోరు? ‘అరె ఓ విలువైన పనికి బిడ్డింగు జరిగింది, ఎవరు ఎక్కువగా ఇస్తే, వాళ్లకు ఓటిచ్చారు’ అని మీరెందుకనుకోరు?’’ ‘‘బిడ్డింగులో ఎవరు లాభదాయకంగా కోట్ చేస్తే వారికే పని అప్పగిస్తారు. కానీ ఓటు విషయంలో అభ్యర్థులందరినుంచీ డబ్బులు తీసుకుంటారు కదా ఓటర్లు?’’ ‘‘నేను ముందే చెప్పాను కదా... ఇదొక ఆర్థిక కార్యెకలాపం అని. ‘ఓట్లు అమ్ముకుంటుంటారూ, అమ్ముకుంటున్నారం’టూ అదేపనిగా ఓటరును బ్లేమింగు చేస్తుంటారుగానీ..వాస్తవానికి ఏ ముగ్గురో, నలుగురో పోటీపడి ఆక్షనింగులో మానుంచి ఎమ్మెల్లే పదవిని కొనుక్కుంటున్నారననే ‘ఓ–కామర్స్’లా దీన్ని మీరెందుకు చూడరు? అరె... మార్కెట్ అన్నాక వొడిదొడుకులుంటాయ్. డిమాండును బట్టి ‘ఎలక్షన్ ఓటు రేటు సూచీ’ విండెక్చు ప్రకారం.. ఒక్కోసారి ఓటు ధర అమాంతం పెరుగుతుంది. ఒక్కోసారి పడిపోతుంది. కొన్నిసార్లు కొందరు ఓడిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేసుకున్న దాఖలాలు లేవా? మిగతా కామర్చు విషయాల్లోలాగే..చెరతులు వర్తిస్తాయనీ లేదా ‘ద వోటు ప్రైసెస్ ఆర్ సజ్జెట్టు టు మార్కెట్ రిచుకు’ అని పేపర్లలో మీరే రాస్తుంటారు కదా. ఇక్కడా అంతే. చేమ్ టు చేమ్. దీనికి మీరెందుకంతగా ఆశ్చర్యపోతుంటారెందుకో నాకర్థం కావడం లేదు’’ ‘‘మీరు పేపర్లు బాగా చదువుతూ, టీవీ ఎక్కువగా చూస్తుంటారు కదా? అందునా బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రాములు’’ ‘‘అవును... మీకెలా తెలుసు?’’ కాస్త సిగ్గు నటిస్తూ, కాంప్లిమెంటులా తీసుకున్నాడా ఎక్్చపర్టు!! -
రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. కమీషన్ టన్నుకు 700 నుండి 1400 రూపాయలకు పెంపుదల చేసింది. కమీషన్ పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.245 కోట్ల భారం పడనుంది. డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. 17 వేలకు పైగా రేషన్ డీలర్ల కుటుంబాకు లబ్ధి కలుగనుంది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
భారత్లో పెరగనున్న ధాన్యం ధరలు! కారణం ఇదే..
గతకొన్ని రోజుల నుంచి కెనడా - భారత్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెనడా పౌరులకు వీసాల మంజూరును సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు, ఇదే కొనసాగితే భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు మరింత బలపడే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల.. ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. కెనడా నుంచి ఎక్కువగా ధాన్యాలు దిగుమతి అయ్యేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మునుపటికంటే 6 శాతం దిగుమతి తగ్గినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా గణనీయమైన పాత్రను పోషించింది, ఇది భారతదేశం యొక్క మొత్తం పప్పు దిగుమతుల్లో సగానికి పైగా ఉంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏకంగా 1,90,784 టన్నులు దిగుమతి చేసుకున్నట్లు భారతదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తోంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ప్రస్తుతం భారతదేశం కూడా కెనడా మీద ఎక్కువ ఆధారపడకుండా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల మీద ఆధారపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కానీ ఇండియన్ మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అధికారిక ఆవివరాలు తెలియాల్సి ఉంది. -
డీమ్యాట్ నామినీ నమోదు గడువు పెంపు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్కు సంబంధించి తమ ఎంపికను తెలియజేసేందుకు గడువును సెబీ డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. వాస్తవానికి అయితే ఈ నెల 30తో ఈ గడువు ముగుస్తోంది. ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించి నామినీ నమోదు లేదంటే నామినీ నిలిపివేయడం ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ ఎంపికను స్వచ్ఛందం చేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ట్రేడింగ్ ఖాతాలకు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఇన్వెస్టర్ల అభీష్టానికే విడిచిపెట్టింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లు, డిపాజిటరీలు, బ్రోకర్ల అసోసియేషన్లు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ను స్వచ్ఛందం చేసినట్టు సెబీ తెలిపింది. డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి నామినేషన్ ఎంపిక గడువును డిసెంబర్ 31వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఇక ఫిజికల్గా షేర్లు కలిగిన వారు తమ ఫోలియోలకు సంబంధించి పాన్, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా, స్పెసిమెన్ సిగ్నేచర్ (సంతకం)ను డిసెంబర్ 31 వరకు ఇవ్వొచ్చని సెబీ స్పష్టం చేసింది. -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
విమానయాన ప్రాప్తిరస్తు! ఈ ఏడాది ఎన్ని కోట్ల మంది ఎక్కుతున్నారంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా తెలిపింది. 2023–24లో 15–15.5 కోట్ల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్ ముందస్తు 2019–20నాటి 14.12 కోట్ల ప్యాసింజర్లను దాటొచ్చని వివరించింది. విమానయాన పరిశ్రమ నష్టాలను మరింత తగ్గించుకోవచ్చని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్లో నిరంతర పునరుద్ధరణ, టికెట్ల ధరలు మెరుగైన నేపథ్యంలో భారతీయ విమానయాన రంగంపై స్థిరమైన అంచనాలు ఉన్నట్టు ఇక్రా ప్రకటించింది. ‘2023–24లో ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో 6.32 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. 2019–20 ఏప్రిల్–ఆగస్ట్లో 5.89 కోట్ల మంది దేశీయంగా విమానాల్లో విహరించారు. భారత్ నుంచి విదేశాలకు, విదేశాల నుంచి భారత్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5–2.7 కోట్ల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. 2022–23లో పరిశ్రమ రూ.17,000–17,500 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3,000–5,000 కోట్లకు వచ్చి చేరనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో 2023 ఏప్రిల్ నుండి తగ్గుదల (ఇటీవలి పెరుగుదల ఉన్నప్పటికీ), సాపేక్షంగా స్థిర విదేశీ మారకపు రేట్ల కారణంగా విమానయాన సంస్థల ధరల శక్తి కొనసాగుతుంది’ అని ఇక్రా వెల్లడించింది. -
హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్హెచ్బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్హెచ్బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్హెచ్బీ నివేదిక వెల్లడించింది. -
దివ్యాంగుల పింఛన్ రూ.4,016
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెలవారీగా ఇస్తున్న పింఛన్ పరిమితిని పెంచింది. ఇప్పటివరకు రూ.3,016 చొప్పున దివ్యాంగులకు నెలవారీగా పింఛన్ ఇస్తుండగా... జూలై నుంచి రూ.4,016 చొప్పున ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం జీఓ. 25 జారీ చేసింది. ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్కు మరో వెయ్యి రూపాయల పరిమితిని పెంచిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సీఈఓను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్ ఆదేశించారు. దివ్యాంగుల పింఛన్ పెంపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభ వేదికగా ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో సంబంధిత శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. పింఛన్ పెంపుదలతో రాష్ట్రంలో దాదాపు 5,11,656 మందికి అదనపు లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రికి మంత్రుల కృతజ్ఞతలు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆసరా పింఛన్లలో భాగంగా నెలవారీగా ఇస్తున్న మొత్తాన్ని పెంచినందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కె.చంద్రశేఖర్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశంలో సామాజిక పింఛన్ల పథకాన్ని ఇంత పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
వినియోగానికి రూ.2,000 నోట్ ఉపసంహరణ బూస్ట్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం దేశంలో వినియోగం పెరుగుదలకు, తద్వారా వృద్ధి స్పీడ్ ఊపందుకోడానికి దోహదపడుతుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనమిస్టులు తమ తాజా నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆరి్థక సంవత్సరం (2023–24)లో వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందన్న ఆర్బీఐ అంచనాలకు మించి ఎకానమీ స్పీడ్ ఉంటుందని కూడా వీరి నోట్ అభిప్రాయపడింది. క్యూ1లో 8.1 శాతం వృద్ధి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష అంచనావేయగా, 8.1 శాతంగా ఈ రేటు నమోదవుతుందని ఎస్బీఐ ఎకనమిస్టులు అంచనా వేశారు. రూ.2000 నోట్ల రద్దు వల్ల వినియోగ వ్యయం రూ.55,000 కోట్లు పెరుగుతుందన్నది ఎకనమిస్టుల అంచనా. నోట్ ప్రకారం బంగారం, ఆభరణాలు, ఎయిర్ కండీషనర్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై–ఎండ్ కన్సూ్యమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాల్లో వినియోగ వ్యయాలు పెరుగుతాయి. రూ.2,000 వ్యయాల్లో 30 శాతం ఇందనం కొనుగోళ్లు, ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లకు క్యాష్ ఆన్ డెలివరీలకు వెచ్చిస్తున్నట్లు కూడా నోట్ లెక్కగట్టింది. దేవాలయాలు, ఇతర మతపరమైన సంస్థలకు కూడా విరాళాలు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే క్లోజ్ యూజర్ గ్రూప్లో పరీక్షిస్తున్న ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కూడా రూ. 2,000 నోట్లను ఉపసంహరణ వల్ల ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. ఈ–రూపీ వినియోగం స్పీడ్ అధిక డినామినేషన్ నోటు లేకపోవడం వలన చిన్న స్థాయి లావాదేవీలకు తక్కువ విలువకలిగిన ఫిజికల్ కరెన్సీ నోట్లు, వ్యాపార లావాదేవీల కోసం ఈ–రూపీ వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2016 నవంబర్లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచి్చన ఆర్బీఐ, గత నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. కాగా, వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయని, వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించారు. వ్యవస్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. -
కాసుల గలగల.. భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 నాటికి నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదపడినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 17 నాటికి ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.70%పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. నికరంగా వసూలైన రూ. 3,79,760 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్నులు రూ. 1,56,949 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 2,22,196 కోట్లు ఉన్నాయి. జూన్ 17 నాటికి రీఫండ్లు 30% పెరిగి రూ. 39,578 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ రిటర్నులకు అదనపు ధ్రువీకరణలు! కాగా పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్లకు అడ్డుకట్ట వేసేలా జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ విధానంలో మరిన్ని ధ్రువీకరణలను అమలు చేయాలన్న సీబీఐసీ ప్రతిపాదనను జూలై 11న జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ అలాగే రిటర్ను దాఖలు చేసేటప్పుడు కూడా అదనంగా ధ్రువీకరణ నిబంధనలను ప్రవేశపెట్టాలని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయించినట్లు వివరించారు. -
వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థులకు శుభవార్త. వారి నెలవారీ స్టైపెండ్ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్లతో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు స్టైఫండ్ పెంపు ప్రక్రిను వేగంగా పూర్తి చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. ఇలావుండగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కౌశిక్ కుమార్ పింజర్ల, ఆర్కే అనిల్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్రెడ్డి తదితరులకు జూడా తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
కొండెక్కిన కోడి ధరలు.. ఇంత ధరా? ఏం కొంటాం.. ఏం తింటాం!
ఎన్టీఆర్: కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కోడి మాంసం ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరను చూసి జేబులు పట్టుకుంటున్నారు. సహజంగానే వేసవిలో కోడి మాంసం ధరలు అధికంగా ఉంటాయి. ఈ సీజన్లో కోళ్లకు సోకే వ్యాధులతో కోళ్లు మృతి చెందటం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీని వలన ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ దఫా అనూహ్యంగా పెరిగిన కోడి రేట్లతో నాన్ వెజిటేరియన్లు ఏమి కొంటాము.. ఏమి తింటామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కిలో బాయిలర్ రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి రూ.150 నుంచి రూ.170 వరకు ధర ఉంది. అలాంటిది ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. ఫారం కోడి కిలో మాంసం రూ.200 దాటింది. స్థానికంగా లభ్యత లేకనే... ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కోళ్లు తక్కువగా పెంచుతారు. కోతకు సిద్ధం కాగానే విక్రయిస్తుంటారు. ప్రసుత్తం జిల్లా వ్యాప్తంగా కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయని దుకాణ దారులు చెబుతున్నారు. వినియోగదారులు చిన్న కోళ్లు కొనటానికి ఆసక్తి చూపక పోవంటతో అధిక బరువు ఉన్న కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, భీమవరం ప్రాంతాల నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. గుడ్డుదీ అదే దారి... కోడి మాంసంతో పాటు కోడి గుడ్డు ధర కూడా అదే రూట్లో పెరుగుతోంది. పది రోజుల క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5 కు చేరింది. అట్ట కోడిగుడ్డు ధర రూ.120 పలకగా ధర ప్రస్తుతం రూ.150కు చేరింది. కోడి మాంసం, కోడి గుడ్లు ధరలు పెరగటంతో మాంసం ప్రియులు పెదవి విరుస్తున్నారు. -
AP: గుడ్న్యూస్.. టెన్త్ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ ఎంత పెరిగిందంటే?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు (జీవో 37) విడుదల చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం)లో పాల్గొనే వారందరి రెమ్యునరేషన్ను ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్ హర్షం ఉత్తర్వులు ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్ తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. 2016 తరువాత రెమ్యునరేషన్ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్టీఎఫ్ నేత జాలిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో.. -
11 కరోనా కేసుల నమోదు
మహారాణిపేట: విశాఖలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 251 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి కరోనా నిర్ధారణ అయింది. 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. 31 మంది హోం ఐసోలేషన్ ఉండగా, ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మాధవధారలోని లవ్ అండ్ కేర్ సెంటర్లో అనాథ పిల్లలకు కోవిడ్ సోకడంతో భయాందోళన నెలకొంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 21 ఏళ్ల మానసిక దివ్యాంగుడికి ఈ నెల 17న రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా.. కోవిడ్ నిర్ధారణ అయింది. వెంటనే అతన్ని కేజీహెచ్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అప్పటికే ఈ యువకుడికి న్యూమెనియా, ఇతర వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. అదే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మంగళవారం చనిపోయాడు. అప్పటికి ఆర్టీపీసీఆర్ నివేదిక రాకపోవడంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన రిపోర్టులో నెగిజిట్ అని తేలిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆ యువకుడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇదే ఆశ్రమానికి చెందిన ఓ బాలికకు పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్ వచ్చిందన్నారు. కానీ ఇతర వ్యాధుల కారణంగా బాలిక ఆరోగ్యం కూడా విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్ది మొదటి స్థానం.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
సూసేకి.. అగ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్ అదిరిపోయింది!
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (16-06-2024)
Advertisement