
మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర సిలిండర్కు రూ 37 చొప్పున పెరిగింది. వరుసగా మూడు నెలలు వంట గ్యాస్ ధర దిగివచ్చినా జూన్ 1 నుంచి ఎల్పీజీ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర పెరగడంతో సిలిండర ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది.
అంతర్జాతీయ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అంశాల ఆధారంగా ఎల్పీజీ ధరలను ప్రతి నెల ఆరంభంలో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెరిగిన ధరలతో హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ 636కు పెరిగింది. ఇక ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ 593కు చేరగా, కోల్కతాలో రూ 616, ముంబైలో రూ 590, చెన్నైలో రూ 606కు ఎగబాకింది.