
బెంగళూరు: అధీకృత సంస్థలు పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేషన్ ఇచ్చిన పరికరాలను మాత్రమే టెలికం ఆపరేటర్లు ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే నిర్దేశిత నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి దేశీయంగా ఆపరేటర్లు దిగుమతి చేసుకునే ప్రతి పరికరానికి ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) చట్టం 2017 ప్రకారం పరీక్షలు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.
చైనా కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే పరికరాల విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ అరుణ ఈ వివరాలు వెల్లడించారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం నిర్దేశిత పరీక్షలు నిర్వహించని, సర్టిఫై చేయని పరికరాలను టెలికం ఆపరేటర్లు ఉపయోగించడానికి లేదు. అయితే, స్థానికంగా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరన్న నిబంధన మూలంగా నెట్వర్క్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణలో జాప్యం జరిగే అవకాశం ఉందంటూ పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్పొ బ్రీఫ్స్...
ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్: స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీని డీలిస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. భారీ రుణ భారంతో కుదేలైన ఈ కంపెనీని వేదాంత కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
పవర్ ఫైనాన్స్ కంపెనీ: ఈ కంపెనీలో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కు (ఆర్ఈసీ) విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.13,000 కోట్లు వస్తాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment