
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ థియేటర్ చెయిన్ను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29 మధ్యలో వాటాదారులు ఈ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఓటింగ్ ఫలితాలను వచ్చే నెల 30న వెల్లడిస్తామని తెలియజేసింది.
ఈ నిధులను పెట్టుబడుల అవసరాలకు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్పీఐ సినిమాస్లో 71.69 శాతం వాటాను పీవీఆర్ రూ.633 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నుంచి డీటీ సినిమాస్ను రూ.433 కోట్లకు చేజిక్కించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నేపథ్యంలో బీఎస్ఈలో పీవీఆర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.1,585 వద్ద ముగిసింది.