రూ. 9 లక్షలు ఆదాయం.. సొంతిల్లు సొంతం! | Rs. .. 9 million of income earned own house | Sakshi
Sakshi News home page

రూ. 9 లక్షలు ఆదాయం.. సొంతిల్లు సొంతం!

Published Fri, Jan 1 2016 11:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రూ. 9 లక్షలు ఆదాయం.. సొంతిల్లు సొంతం! - Sakshi

 
స్థిరాస్తి కొనడానికైనా.. అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్
నాలుగేళ్లుగా నగరంలో 6.3 శాతం పెరిగిన కమర్షియల్ ధరలు
10.46 శాతం మేర పడిపోయిన రెసిడెన్షియల్ అద్దెలు
అర్థయంత్ర బై వర్సెస్ రెంట్ నివేదిక వెల్లడి

భాగ్యనగరంలో సొంతిల్లు.. మోస్తారుగా ఉన్నోళ్లకు మాత్రం దక్కే అదృష్టమనేది నిన్నటి మాట. కానీ, నేడది ఏడాదికి రూ.9 లక్షల ఆదాయమున్న ప్రతీ ఒక్కరికీ సొంతం! దీనర్థం నేటికీ భాగ్యనగరంలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్నాయని!! కొనడానికే కాదు అద్దెకుండేందుకైనా చారిత్రక నగరి దగ్గరిదారేనట!!! ఈ వరుసలో అహ్మదాబాద్‌కూ చోటుందని అర్థయంత్ర యాన్యువల్ బై వర్సెస్ రెంట్ (ఏబీఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది. ఇటీవల అర్థయంత్ర సంస్థ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబై, పుణెల్లో ‘‘స్థిరాస్తి కొనుగోలు.. అద్దెలు’’ అంశంపై సర్వే చేసింది. ఇందులో పలు ఆసక్తికర వివరాలివిగో..
                                                                                                                                       - సాక్షి, హైదరాబాద్

 
   హైదరాబాద్
 నగరంలో స్థిరాస్తి కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ధరలు అందుబాటులోనే ఉన్నాయి.
 నాలుగేళ్లుగా వాణిజ్య సముదాయాల అద్దె ధరలు 6.3 శాతం పెరిగాయి. ఆదే సమయంలో నివాస సముదాయాల ధరలు 10.46 శాతం మేర పడిపోయాయి.
 ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం సంపాదించేవారు ఇక్కడ నివాస సముదాయాన్ని కొనుగోలు చేయవచ్చు.
 
  బెంగళూరు
 ఐటీ, స్టార్టప్ హబ్ పేరొందిన గార్డెన్ సిటీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలకు గిరాకీ బాగా ఉంది.
 గతేడాదితో పోల్చితే ఇక్కడి అద్దెలు 10.08 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి ధరలు మాత్రం 2.55 శాతం మేర పడిపోయాయి.
 ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ.15 లక్షల ఆదాయం ఉండాల్సిందే.
 
  చెన్నై
 దేశంలో స్థిరాస్తి ధరలు ప్రియంగా ఉన్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. తొలి రెండు స్థానాలు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లవి. గతేడాదితో పోల్చితే చెన్నైలో ధరలు 8.78 శాతం పెరిగాయి. ఆసక్తికరంగా అద్దెలు మాత్రం 1.7 శాతం మేర పడిపోయాయి.
 ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం గడించేవారు మాత్రంమే చెన్నైలో స్థిరాస్తి సొంతమవుతుంది.
 
  ఢిల్లీ-ఎన్‌సీఆర్
 దేశ రాజధానిలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. నివాస సముదాయాల ధరల విషయంలో ఢిల్లీది రెండో స్థానం.
 గత నాలుగే ళ్లుగా రాజధానిలో నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి కొనుగోలు ధరలైతే 9.1 శాతం మేర పెరిగాయి.
 ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏటా ఆదాయం కనీసం రూ.25 లక్షలకు పైగానే ఆర్జించాలి మరి.
 
  కోల్‌కత్తా
 స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దె విషయంలోనైనా కోల్‌కత్తా సమాంతరంగా వృద్ధి చెందుతుంది.
 ఏడాదికాలంగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 11.27 శాతం, అద్దెలు 11.48 శాతం మేర పెరిగాయి.
 ఏటా ఆదాయం రూ.15 లక్షలుంటే కోల్‌కత్తాలో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు.
 
  అహ్మదాబాద్
 హైదరాబాద్ తర్వాత స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దెకైనా సామాన్యులకు అందుబాటులో ఉన్న నగరమేదైనా ఉందంటే అది అహ్మదాబాదే.
 ఏటా ఆదాయం రూ.10 లక్షలుంటే చాలు ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
 పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒక వైపు గోడను మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది.
 చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement