
ఫెడ్ సమావేశం ముందు అమ్మకాలు
సెన్సెక్స్కు 53 పాయింట్ల నష్టం
ముంబై: కీలకమైన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమీక్షకు మందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించారు. ఫలితంగా ఐటీ, టెక్ కౌంటర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 53.60 పాయింట్టు నష్టపోయి 27,876.61 పాయింట్ల వద్ధ స్థిరపడింది. నిఫ్టీ మాత్రం అర పాయింటు లాభంతో 8,626.25 వద్ద ముగిసింది. అక్టోబర్లో తయారీ రంగం మెరుగైన పనితీరుకు తోడు ట్రేడర్లు పండుగ మూడ్ నేపథ్యంలో మార్కెట్లు రోజులో ఎక్కువ సమయం పాటు స్వల్ప పరిధికిలోబడి సానుకూలంగా ట్రేడయ్యాయి.
ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుండడంతో ఆఖరి గంటలో అమ్మకాలు రావడంతో సెన్సెక్స్కు నష్టాలు ఎదురయ్యాయి. వాహన విక్రయాల జోరుతో ఆయా కంపెనీల స్టాక్స్లో కొనుగోళ్లు జరిగాయి. చైనా పీపీఐ (ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్) గత కొన్నేళ్లలోనే గరిష్ట స్థాయిలో నమోదు కావడంతో మెటల్ స్టాక్స్కు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడం మార్కెట్పై ప్రభావం చూపిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఎఫ్ఓఎంసీ సమావేశం, అమెరికా ఎన్నికలు పూర్తయ్యే వరకు మార్కెట్లలో ఈ స్థిరీకరణ కొనసాగుతుందన్నారు.