అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట | United States to Hyderabad | Sakshi
Sakshi News home page

అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట

Published Sat, Aug 15 2015 5:37 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట - Sakshi

అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట

♦ హైదరాబాద్‌ కేంద్రంగా..అమెరికాలోని ఆసుపత్రులకు సేవలు
♦ ఒక్క ఏడాదిలోనే 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ
♦ బీమా ఆదాయ విశ్లేషణల్లో వినూత్న సేవలందిస్తున్న డేటా మార్షల్

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గతేడాది అమెరికాలోని బీమా కంపెనీలు అక్కడి ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లను అండర్ పేమెంట్ (తక్కువ మదింపు) చేశాయని అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ మదింపు ఆధారంగా వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకుంది డాటా మార్షల్. దాంతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వ్యాపార బాటలు వేసింది. తప్పుగా మదింపు చేసిన క్లయిమ్‌లను పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీసెస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. బీమా చెల్లింపులను రికవరీ చేయించడమే దీని పని. ఇలా ఒక్క ఏడాదిలోనే రికవరీ చేసిన సొమ్మెంతో తెలుసా.. అక్షరాల 6 మిలియన్ డాలర్లకు పైమాటే. ఇది చాలదు బీమా రంగంలో డేటా మార్షల్ అందిస్తున్న వినూత్న సేవలోంటే చెప్పేందుకు!! మరిన్ని విశేషాలు డేటా మార్షల్  కో-ఫౌండర్ రవి ర్యాలీ మాటల్లోనే..

 2000వ సంవత్సరంలో మన దేశంలో బీమా పాలసీలను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశ్యంతో అప్పటివరకున్న ప్రభుత్వ బీమా సంస్థలతో పాటుగా ప్రైవేటు బీమా కంపెనీలకూ అవకాశం కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలోనే దేశంలో ఇంటర్నెట్ బూమ్ కూడా వచ్చింది. అప్పుడే అనిపించింది.. ఆన్‌లైన్‌లో బీమా పాలసీలను విక్రయిస్తే ఎలా ఉంటుందని! చేతిలో ఉన్న కొంత మొత్తంతో సంరక్ష.కామ్ పేరుతో కంపెనీ ప్రారంభించి.. ఆన్‌లైన్‌లో బీమా పాలసీలను విక్రయించడం ప్రారంభించాను. హైస్ట్రీట్ వాసులు తిరిగే చోట కార్పొరేట్ స్థాయిలో పాలసీలను విక్రయించడం మొదలుపెట్టాను. ఇది చూసిన చాలా బీమా కంపెనీలు డొమైన్ నాలెడ్జ్ ఇస్తాం.. మరింత విస్తరింప చేయండని ప్రోత్సహించారు.

 2001 డిసెంబర్‌లో అమెరికాలోని ఒక ఆరోగ్య బీమా కంపెనీ.. ఫిజికల్‌గా ఉండే బీమా క్లయిమ్‌లను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చే పనిని అప్పజెప్పింది. ఆరోగ్య బీమాలకు సంబంధించిన పేషెంట్ వివరాలు, డేటా వంటి సమాచారం ఫిజికల్ కాపీలు వచ్చేవి. వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేయడం డేటా గ్రిడ్ పని. సంరక్ష.కామ్‌ను కాస్త డాటా గ్రిడ్‌గా పేరు మార్చి 5 మంది ఉద్యోగులతో అమెరికాలో సేవలను ప్రారంభించాం.

 అసలేం జరుగుతుందో..
 ఆరోగ్య బీమాకు సంబంధించిన  ఫిజికల్ కాపీలు మా దగ్గరి రావడానికి ముందు.. ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేశాక జరిగే తతంగం ఏంటనే విషయంపై నోయిడాకు చెందిన ఇద్దరు నిపుణుల సహాయంతో విశ్లేషించాం. అప్పుడే అర్థమైంది.. ఆరోగ్య బీమా ఎలా క్లయిము చేయాలో.. బీమాను ఎలా పే చేస్తున్నారనే విషయం. బీమా రంగంలో ఎంత వ్యాపారముందో కూడా తెలిసింది. అమెరికాలో చాలా ఆసుపత్రులు వెయ్యి డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న క్లయిమ్‌లను మాత్రమే డాక్టర్స్ బ్యాక్‌ఆఫీస్ ఫాలోఅప్ చేస్తుంటారు.

కానీ ఈ విభాగం 20 శాతం కంటే ఎక్కువ ఉండదు. చాలా వరకూ వంద డాలర్ల లోపే క్లయిమ్‌లుంటాయి. ఈ సమయంలోనే కంపెనీ పేరును డేటా మార్షల్‌గా మార్చాం. డేటా మార్షల్ ప్రత్యేకత ఇక్కడే ఉంది. ఆసుపత్రుల తరపున వంద డాలర్ల క్లయిమ్‌లను కూడా ఫాలో చేస్తుంది మా సంస్థ. మెడికల్ బిల్లింగ్ మాత్రమే కాదు.. క్లయిమ్ రైజ్ చేయటం దగ్గరి నుంచి ఆసుపత్రికి బీమా డబ్బులొచ్చే వరకూ మాదే బాధ్యత.

 డాటా మార్షల్ సక్సెస్ సీక్రెట్..
 అత్యంత నిపుణతలో పనిచేయడం సంస్థ విజయ రహస్యం. 5 మందితో ప్రారంభించిన డేటా మార్షల్‌లో ఇప్పుడు 400 మంది ఉద్యోగులు స్థాయికి ఎదిగింది. రెండేళ్లలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం.

 ఒక్క ఏడాదిలో 6 మిలియన్ డాలర్లు..
 పేషెంట్ ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి మొదలుపెడితే.. బెడ్‌కు ఎంత.. తిండికెంత.. ట్రీట్‌మెంట్‌కెంత.. మందులకెంత.. వంటి అనేక అంశాలపై క్లయిమ్‌కు ఎంత చెల్లించాలనే విషయంపై ముందుగానే ఆసుపత్రులకు, బీమా కంపెనీలకు మధ్య ఒప్పందం ఉంటుంది. దాని ప్రకారమే బీమా కంపెనీలు ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తాయి. ప్రతి వెయ్యి క్లయిమ్స్‌లో 7 శాతం క్లయిమ్‌లు అండర్ పేమెంట్‌గా జరుగుతుంటాయి. 2014 సంవత్సరంలో బీమా కంపెనీలు ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లు (రూ.3.64 లక్షల కోట్లు) అండర్ పేమెంట్‌గా చేశాయని అక్కడి ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది.

దీన్ని కూడా పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. ఒక్క ఏడాదిలోనే 18 కంపెనీలకు 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ (అండర్ పేమెంట్ రీకవరి) చేసిచ్చాం. ఇందుకు గాను ఇటీవలే ముంబైలో జరిగిన కార్యక్రమంలో 2015 సంవత్సరానికి గాను వైద్య రంగంలో ఇండో అమెరికన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌లెన్స్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది.

 ఈ ఏడాదిలో 55-60 ఆసుపత్రులకు..
 ప్రస్తుతం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో.. 22 ఆసుపత్రులు డేటా మార్షల్ సేవలను వినియోగించుకుంటున్నారు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని సాధించాం.రూ.6 కోట్ల పెట్టుబడులతో హైటెక్‌సిటీలో మరో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నాం. గతంలో 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మెడికల్ బిల్లింగ్ కంపెనీ ఫోనిక్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (పీఎంజీ)ని కొనుగోలు చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement