
రూ.125 నాణెం
న్యూఢిల్లీ : కొత్త రూ.125 స్మారక నాణెంను శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేయనున్నారు. గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ 125వ జయంతి వేడుక సందర్భంగా ఈ నాణెంను ఉపరాష్ట్రపతి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మహాలనోబిస్ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది.
సామాజిక-ఆర్థిక ప్రణాళికల్లో, పాలసీ రూపకల్పనలో గణాంకాలు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తాయో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతేడాది నిర్వహిస్తోంది. ఈ ఏడాది గణాంకాల దినోత్సవ థీమ్ ‘అధికారిక గణాంకాల్లో నాణ్యతా హామీ’ అనే విషయం. జూన్ 29న కోల్కతాలో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఐఎస్ఐను 1931లో మహాలనోబిసే ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment