
స్వామిదాస్ (ఫైల్)
వైఎస్ఆర్, చెన్నరాజుపోడు (ఓబులవారిపల్లె) : ఆడుకుంటూ కిరోసిన్ తాగిన చిన్నారి మృత్యుఒడికి చేరుకున్నాడు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన దార్ల స్వామిదాస్ (ఏడాదిన్నర వయసు) ప్రమాదవశాత్తూ కిరోసిన్ తాగి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నరాజుపోడు వ్యవసాయ పొలం వద్ద నివాసం ఉండే దార్ల ఆనంద్బాబు ఆర్టిస్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సారమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. స్వామిదాసు నాల్గవ సంతానం. సోమవారం సాయంత్రం స్వామిదాస్ ఆడుకుంటూ ఇంటిలో బ్యాగులో దాచి వుంచిన పాత కిరోసిన్ డబ్బా తీసి తాగాడు.
చాలా రోజుల క్రితం పెయింట్బ్రష్లు కడిగిన కిరోసిన్ కావడంతో తాగిన వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే రైల్వేకోడూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి బంధువుల సమాచారం మేరకు ఏఎస్ఐ గోపాల్ కేసు నమోదు చేశాడు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందిన విషయం తెలియగానే.. చెన్నరాజుపోడు దళితవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ సుంకేసుల రఫీ, గుంటిమడుగు దశరథరామరాజు, వీఆర్ఓ రాంబాబు.. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి వారు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment