
ఫిర్యాదు చేయడానికి జేఆర్పురం పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితులు
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : అధిక వడ్డీలకు ఆశచూపి మోసం చేయడం, అవసరానికి అక్కరకు వస్తుందని దాచుకున్న చిట్టీల సొమ్ముతో ఉడాయించడం... ఇలా పొదుపుదారులకు ఆర్థిక నేరగాళ్లు గుండెపోటు తెప్పిస్తున్నారు. తాజాగా మండలంలోని పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామానికి చెందిన అత్మకూరు కామేశ్వరరావు కోటి రూపాయలతో ఉడాయించాడు. గ్రామంతోపాటు చుట్టు్ట పక్కల గ్రామాల ప్రజల నుంచి చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట కోటి రూపాయలకుపైగా వసూలు చేశాడు. ఈ మొత్తంతో పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వరిసాం గ్రామానికి చెందిన పీవీ సత్యనారాయణ, పెద్దినాగభూషన్, కొన లక్ష్మణరావు, పీ నాగేశ్వరరావు, మునకాల రమణ, బీ రాము, జీరు రమణ, ఎం అప్పలనరసయ్య, కే బోగష్, ఎం దుర్గారావు, జీరు కుర్మారావుతోపాటు మరో 15 మంది బుధవారం జేఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్మకూరు కామేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ పెద్ద మొత్తంలో వేసిన చిట్టీలను తిరిగి ఇవ్వకుండా పరారైనట్లు బోరుమన్నారు.