
హరీష్(ఫైల్) మృతిచెందిన జింక
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: వేగంగా వెళ్తున్న బైక్కు జింక అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకునితోపాటు జింక కూడా దుర్మరణం పాలైంది. ఈ విషాదం నెలమంగల తాలూకా అప్పగొండనహళ్లిలో చోటుచేసుకుంది. అప్పగొండనహళ్లి గ్రామం నివాసి హరీష్ (21) మృతుడు. స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ మంగళవారం తెల్లవారుజామున అక్కను బైక్పై ఎక్కించుకుని బస్టాండులో వదిలి తిరిగివస్తున్నాడు.
ఎలా జరిగిందంటే
మంగళవారం తెల్లవారుజాము.. మంచు కారణంగా ముందు ఏముందు సరిగా కనిపించడం లేదు. ఈ సమయంలో ఎక్కడినుంచో బైక్కు అడ్డుగా వచ్చిన జింకను హరీష్ త్వరగా గుర్తించకపోవడంతో దానిని ఢీకొన్నాడు. హరీష్ హెల్మెట్ ధరించకపోవడంతో కిందపడ్డ తక్షణం తలకు గాయమై ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఇటు జింక తలకు కూడా తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. త్యామగొండ్లు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.