
కేసు వివరాలు తెలియజేస్తున్న ఏసీపీ నిందితుడు మహేష్
చైతన్యపురి: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఇన్స్పెక్టర్లు సైదయ్య, మహేష్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీందర్రావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు (22) నగరానికి వచ్చి బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదన కోసం నేరాల బాట పట్టి దొంగగా మారాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలు, ఇంటి తాళాలు, దేవాలయాల హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల ప్రభాత్నగర్ శ్రీలక్ష్మీగణపతి దేవాలయం హుండీ ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ కెమెరాలకు చిక్కాడు. అప్పటినుంచి క్రైం పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. సోమవారం బైక్పై దిల్సుఖ్నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహేష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పాతనేరస్తుడిగా గుర్తించారు. చైతన్యపురి, కటంగూరు, సూర్యాపేట స్టేషన్ల పరిధిలో ఏడు బైక్లు, రెండు సెల్ఫోన్లు, రెండు దేవాలయాల్లో హుండీ దొంగతనం, ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ. 3.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నా రు. 2012 నుంచి 2017 మధ్య కాలంలో చైతన్యపురి, సరూర్నగర్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు.
సిబ్బందికి రివార్డులు
చోరీలకు పాల్పడుతున్న పాతనేరస్తుడు మహేష్ను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన డీఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు మహేష్, మల్లేష్, రాము, నగేష్, లక్ష్మికాంత్రెడ్డి, ఎన్ఎన్రెడ్డి, సురేందర్, నవీన్కుమార్, శివలను ఏసీపి పృథ్వీందర్రావు అభినందించారు. డిపార్టుమెంట్ తరఫున క్యాష్ రివార్డును అందజేశారు.