కామ స్వామి | rasa lelalu in matam | Sakshi
Sakshi News home page

కామ స్వామి

Published Fri, Oct 27 2017 2:10 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

rasa lelalu in matam - Sakshi

భక్తులకు నీతిబోధలు చేస్తూ, మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నడపడానికి బదులుగా అనైతిక కార్యకలాపాలు నెరుపుతున్న స్వామీజీ బండారం బట్టబయలైంది. అతని రాసలీలలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో అతని నీచకార్యాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

యలహంక: యలహంక సమీపంలోని హునసమారనహళ్లిలో  జంగమ మఠం ఉంది. ఈ మఠం పీఠాధ్యక్షుడు దయానంద స్వామి  రాసలీలలు జరుపుతున్న వీడియో చిత్రాలు బయటకు రావడంతో మఠం చుట్టుపక్కలనున్న గ్రామస్తులు ఆ ధార్మిక కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. స్వామీజి ముసుగులో దయానంద రాసలీలలు సాగిస్తున్నాడని, పీఠాధ్యక్షుడుగా అతణ్ని తొలగించి అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 13వ పీఠాధ్యక్షుడు పర్వతరాజ శివాచార్య స్వామీజీ నలుగురు పిల్లల్లో రెండవ కుమారుడు దయానంద 2011లో మఠాధిపతి అయ్యాడు. ఆ తరువాత తన పేరును (గురునంజేశ్వర శివాచార్యస్వామి)గా మార్చుకున్నాడు. ప్రస్తుతం మఠంలో తల్లి, అక్క కుటుంబ సభ్యులు ఆరుమందితో ఉన్నారు. మఠానికి చెందిన ఆస్తులు ఈయన చేతిలోనే ఉన్నాయి. కాగా,  మఠాన్ని శృంగార కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడని కొందరు మఠం సభ్యులు, భక్తులు మండిపడ్డారు.

ఆమె.. ఒక నటి!
దయానంద మఠాధిపతి అయినప్పటి నుంచి గ్రామస్తులు, ట్రస్ట్‌ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఎన్నోసార్లు ధర్నాలు, పంచాయితీలు నడిచాయి. మూడు సంవత్సరాల క్రితం అతని కుటుంబ సభ్యులే పడకగదిలో రహస్య కెమెరా అమర్చి ఆయన అనైతిక కార్యకలాపాన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఒక చిన్న సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువతితో ఆయన గడుపుతున్న వీడియో తాజాగా బయటకు రావడంతో కలకలం రేగింది. బుధవారం రాత్రి ఒక టీవీ చానెల్‌వీలో వీడియో ప్రసారమైంది. ఘటనపై చిక్కజాల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఉదయం వరకు మఠంలోనే ఉన్న దయానంద.. రాసలీల దృశ్యాలు వెలుగుచూడగానే  మరో ద్వారం గుండా పరారైనట్లు సమాచారం.  ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ట్రస్ట్‌ న్యాయవాది ఉమేశ్‌  చిక్కజాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మఠంలో అశ్లీల కార్యక్రమాలు
మఠం అశ్లీల కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది, భక్తులు ఆవేదన చెందుతున్నారు, పదవ తరగతి పాస్‌ కాని దయానంద కొంతమంది రాజకీయ నాయకులతో, గూండాలతో కలిసి మఠానికి సంబంధించిన ఆస్తులను స్వాహా చేస్తున్నారు,  ప్రస్తుతం ఆస్తలు 220 ఎకరాలు మాత్రమే మిగిలాయి. శ్రీశైలం మఠం ఆదీనంలో ఈ మఠం ఉన్నందున ఆ మఠ పీఠాదిపతులు స్పందించి చర్యలు తీసుకోవాలి.– ట్రస్ట్‌ సభ్యుడు బసవరాజు

యువతి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం  
వీడియోలోనున్న బాధిత యువతి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు మాకు ఎటువంటి పిర్యాదు రాలేదు. ఆస్తులకు సంబంధించిన విషయాలను రెవిన్యూ అధికారులు చూస్తారు. ఫిర్యాదులు వస్తే నమోదు చేసి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.  – డీసీపీ గిరీష్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement