తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం (ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం (ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో ‘ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలు’ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సభలకు 25 దేశాల నుంచి సుమారు 7 వేల మంది తెలుగువారు హాజరవుతారన్నారు. ఈ సభలకు సీఎం కేసీఆర్, మంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు. అనంతరం జ్యోతిరెడ్డి చింతల పాని, రమాదేవి నీలారపు, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షురాలు, ప్రముఖ నృత్యకారిణి కె.పద్మజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కో ఆర్డినేటర్ బి. రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.